
ముకుందాపురంలో వరహాలయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు గోపయ్య, రామయ్య. ఇద్దరూ సోమరిపోతులే. కొడుకుల విషయంలో వరహాలయ్యకు దిగులు పట్టుకుంది. తన తదనంతరం వాళ్లు సంపాదన చేతకాక అష్టకష్టాలు పడతారు. అందువల్ల తాను బతికి ఉండగానే వీళ్లను ఒక దారిలో పెట్టాలి అనుకున్నాడు.
గోపయ్య, రామయ్యలను పిలిచి, ‘‘నేను వృద్ధుడిని అయిపోయాను. ఇంతకాలం నేను సంపాదించిన డబ్బు అంతా అటక మీద ఉన్న ఆ రెండు కొయ్యపెట్టెలలో దాచి వుంచాను. మీరిద్దరూ చెరొకపెట్టెలో ఉన్న డబ్బు తీసుకుని హాయిగా జీవించండి. కానీ అంతకంటే ముందు మీరిద్దరూ చెరొక వెయ్యి వరహాలు సంపాదించి ఈ రెండు కుండలలో వేయాలి. లేకుంటే ఆ పెట్టెలు రెండూ మాయం అయిపోతాయి.
అంతేకాదు, కుండలు నిండక ముందే పెట్టెలు తెరిస్తే మీ తలలు పగిలిపోతాయి. ఇది మన కుల దైవం ఇచ్చిన శాపం’’ అని చెప్పాడు.
ముందు వెయ్యివరహాలు సంపాదిస్తే ఆ తరువాత హాయిగా పెట్టెల్లో ఉన్న డబ్బు తింటూ కూర్చోవచ్చు అని రామయ్య, గోపయ్య ఆ రోజు నుంచి కష్టపడి పని చేసి వెయ్యి వరహాలు సంపాదించారు. ఈలోగా వరహాలయ్య కన్నుమూశాడు. వెయ్యి వరహాలు సంపాదించి కుండల్లో నింపగానే రామయ్య, గోపయ్య అటుక మీద ఉన్న పెట్టెలు కిందకి దించి తెరచి చూడగా అవి ఖాళీగా ఉన్నాయి. అందులో ఉన్న చీటీలో... మీరు ఇలాగే కష్టపడి సంపాదిస్తే ఈ పెట్టెలు కూడా నింపవచ్చు. ఇదే నేను మీకు పంచే ఆస్తి’’ అని ఉంది. తండ్రి మనసు గ్రహించిన కొడుకులిద్దరూ కష్టపడి సంపాదిస్తూ హాయిగా జీవించసాగారు.
No comments:
Post a Comment