
మృగరాజైన సింహం ఒకసారి జంతువులకు పరుగుపోటీ నిర్వహించాలనుకుంది. విజేతగా నిలిచిన మొదటి పన్నెండు జంతువులకు ఘనసత్కారం ఉంటుందని, రాజ్యంలో ప్రత్యేకతలు కల్పిస్తామని ప్రకటించింది.
బద్దకస్తులైన ఎలుక, పిల్లి ఎద్దు దగ్గరకి వెళ్లి ‘‘మామా! మేము మర్చిపోతామేమో. మమ్మల్ని పిలు’’ అని చెప్పాయి. తీరా పోటీ సమయం రానే వచ్చింది. అప్పుడు ఎద్దు... పిల్లిని, ఎలుకను పిలవడానికి వెళ్లింది కానీ అవి గాఢనిద్రలో ఉండడంతో ఎద్దు ఎంత ప్రయత్నించినా వాటిని లేపలేకపోయింది. కొద్దిక్షణాల్లో పోటీ ప్రారంభం కానుంది. వాటిని వదిలి వెళ్లడం ఇష్టంలేక పిల్లిని, ఎలుకను తన వీపుమీద ఎక్కించుకుని పోటీకి బయల్దేరింది ఎద్దు.
పోటీలో భాగంగా ఎద్దు సరిగ్గా ఒక చెరువు వద్దకు రాగానే ఎలుకకు మెలకువ వచ్చింది. పందెం సంగతి గుర్తుకొచ్చింది. తనతోపాటు నిద్రిస్తున్న పిల్లిని ఒక్క తోపు తోసింది.
ఎద్దు నీటిని దాటే సమయానికి ఎలుక ఒక్కసారిగా ఎద్దు ముందుకి దూకింది. తానే గెలిచానని అరిచింది. అప్పటికి ఎద్దు ఇంకా రెండడుగులు వెనకే ఉంది. పులి మూడోస్థానంలో నిలిచింది. అందుకే చైనా జ్యోతిషపటంలో మొదటి మూడుస్థానాల్లో ఎలుక, ఎద్దు, పులి బొమ్మలు ఉంటాయి. అలా ఎలుక మోసం చేసింది గనుకనే పిల్లులు నిత్యం ఎలుకకి ప్రాణసంకటం అయ్యాయి.
No comments:
Post a Comment