all

Monday, March 18, 2013

వేసవి ఆహారం...

 

వేసవి తీవ్రత కారణంగా శరీరంలోంచి ధారాపాతంగా చెమటలు కారిపోతాయి. దాంతో శరీరం తనకు అవసరమైన నీటిని, అందులోని పోషకాలను (ఎలక్ట్రోలైట్స్) కోల్పోతుంది. ఇలా కోల్పోరుున నీటిని, పోషకాలను భర్తీ చేయుడం అవసరం. అందుకే ప్రతిరోజూ కనీసం నాలుగు లీటర్లకు తగ్గకుండా నీరు తాగడం అవసరం.

ఈ సీజన్‌లో ద్రవాహారంగా నివ్ముజాతి పళ్లరుున నివ్ము, బత్తారుు, ఆరెంజ్ వంటి పళ్లరసాలు చక్కెర లేకుండా తీసుకోవడం వుంచిది.

ద్రవాహారంలో పీచు కూడా శరీరానికి అందాలంటే ఆపిల్, ఆరెంజ్ జ్యూస్‌లు వుంచివి.

తినే ఆహారం విషయూనికి వస్తే...
తిండివిషయూనికి సాధారణంగా వుసాలాలు ఎక్కువగా తీసుకోవడం ఎప్పుడూ హానికరమే అరుునా... ఈ సీజన్‌లో అది కడుపులో వురింత వుంటను, ఇబ్బందిని కలిగించవచ్చు. అందుకే... ఉడికించిన కూరగాయులతో వండిన కూరలతో మితమైన ఆహారం తీసుకోవడం వేసవిలో వుంచిది.

ఎక్కువ కొవ్వు ఉండే ఆరుుల్ ఫుడ్స్‌కు సాధ్యమైనంత దూరంగా ఉండాలి.

డీప్‌గా వేరుుంచిన పదార్థాలు, బేకరీ ఐటమ్స్ కంటే ఉడికించిన పదార్థాలు వుంచిది.

పచ్చికూరగాయులతో తయూరు చేసిన వెజిటబుల్ సలాడ్స్ ఈ సీజన్‌లో వురింత వుంచిది.

పానీయాల విషయంలో...
ఈ సీజన్‌లో కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ వంటి వాటిని తగ్గించడం వుంచిది. వేసవి నుంచి ఉపశవునం కలిగిస్తాయునుకునే కూల్‌డ్రింక్స్ తాపం నుంచి ఉపశవునం కలిగించవు సరికదా... కెఫిన్ ఎక్కువగా ఉండే ఇవి... ఒకింత హానిచేసే ప్రవూదవుూ ఉంది. కాబట్టి వాటికి బదులుగా కొబ్బరినీళ్లు, వుజ్జిగ, లస్సీ, తాజాపళ్లరసాల వంటివాటికే ప్రాధాన్యం ఇవ్వటం వుంచిది
 

వడదెబ్బవేడి దాడి

 

ఒక్కో సీజన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మానవ మనుగడకు సీజన్‌లు మారడం ఎంతో అవసరం. కానీ... మనుగడకు తోడ్పడే ఆ అంశమే కొన్ని ప్రతికూలతలనూ కలిగి ఉంటుంది. వేసవి ప్రతికూలతల్లో ముఖ్యమైనది... వడదెబ్బ. శరీర ఉష్ణోగ్రత అదేపనిగా పెరుగుతూ పోయే ఈ కండిషన్ ఒక్కోసారి ప్రాణాంతకమవుతుంది. కేవలం ఎండలో కాస్తంత ఎక్కువగా తిరగడమే ప్రాణాపాయానికి ఎందుకు దారితీస్తుంది? దానిని నివారించుకోవడం ఎలా? వేసవి తాపం నుంచి రక్షణచర్యలేమిటి? ఈ సీజన్‌కు అనువైన ఆహారాలేమిటి? వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఇవ్వాళ్టి సమగ్ర కథనం.

శంకర్ పూర్తిగా ఆరోగ్యవంతుడు. మంచి ఫిట్‌నెస్ కూడా ఉంది. అయితే... తన జీవనోపాధి కోసం ప్రతిరోజూ కనీసం 60 కి.మీ. టూవీలర్‌పైన తిరగాల్సి ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సీజన్‌లోనూ డ్యూటీకి వెళ్లాడు. కానీ వడదెబ్బ తగిలి ఆ సాయంత్రానికే ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. శంకర్‌ను సకాలంలో ఆసుపత్రికి తీసుకొచ్చినందువల్ల గండం గడిచిందనీ, ఏమాత్రం ఆలస్యం జరిగి ఉన్నా పరిస్థితి వేరేలా ఉండేదని డాక్టర్ చెప్పాక ఆ కుటుంబ సభ్యులు ఆందోళన పడుతూనే, ప్రమాదం తప్పిపోయినందుకు తేలిగ్గా నిట్టూర్చారు. శంకర్‌లాంటి ఎందరో వ్యక్తులు ఎండల్లోకి వెళ్లక తప్పదు. అలాంటివారే గాక ఎండలో తిరిగేవారు, కొద్దిరోజుల్లో పిల్లలు ఎండలోకి వెళ్తుంటే ఆపాల్సిన తల్లిదండ్రులంతా... ఈ సీజన్‌లో వేసవి అనర్థాలు ఎన్నిరకాలుగా వస్తాయి? ఎందుకలా జరుగుతుంది? వాటిని నివారించడానికి ఏం చేయాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత కూడా వడదెబ్బ తగిలితే ఏం చేయాలి? వంటివి తప్పక తెలుసుకుంటే మంచిది.

జ్వరం అంటే ఏమిటి...?
వదదెబ్బ, దాని దుష్ర్పభావాల గురించి తెలుసుకునే ముందుగా జ్వరం అంటే ఏమిటో చూద్దాం. మానవుల సాధారణ శరీర ఉష్ణోగ్రత 98.4 ఫారన్‌హీట్ డిగ్రీలన్న విషయం తెలిసిందే. అంటే... ఆ శరీర ఉష్ణోగ్రత వద్ద మన శరీరంలో జరగాల్సిన జీవక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయన్నమాట. చలికాలంలో బయటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నా మన శరీర ఉష్ణోగ్రత స్థిరంగా 98.4 ఫారన్‌హీట్ ఉంటుంది. అలాగే వేసవిలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా మన ఒంటి వేడి అంతే ఉంటుంది. ఇలా ఏ సీజన్‌లోనైనా మన శరీర ఉష్ణోగ్రత ఒకేలా ఉంచే బాధ్యతలను మనమెదడులోని కీలకభాగమైన హైపోథాలమస్ నిర్వహిస్తుంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండ ఉంటుంది కాబట్టి ఆ ప్రభావంతో పొద్దున్న సాధారణంగా మన శరీర ఉష్ణోగ్రత 98.9 డిగ్రీల ఫారన్‌హీట్ ఉన్నప్పటికీ ఎండ పెరుగుతూ పోతున్నకొద్దీ ఇది కూడా పెరిగి 99.9 డిగ్రీల ఫారన్‌హీట్‌కు చేరే అవకాశం ఉంది. మానవ శరీర సాధారణ ఉష్ణోగ్రత నుంచి కాస్త అటూయిటూగా ఉన్నా... అది 99.9 డిగ్రీల ఫారన్‌హీట్‌కు మించితే దాన్ని జ్వరంగా పరిగణిస్తుంటారు.

వడదెబ్బ... రకాలు
వడదెబ్బలో అనేక రకాలు ఉంటాయి. అవి హీట్ క్రాంప్స్, హీట్ ఎగ్జషన్, హీట్ సింకోప్. అన్నిటికంటే తీవ్రమైనది మనం వడదెబ్బగా పరిగణించే హీట్‌స్ట్ట్రోక్.

హీట్ క్రాంప్స్ : తక్కువ తీవ్రత ఉన్న వడదెబ్బగా దీన్ని పరిగణించవచ్చు. ఇందులో ఎండ తీవ్రత వల్ల శరీరంలోని ద్రవాలు తగ్గి తీవ్రమైన నొప్పి బాధతో కండరాలు (ప్రధానంగా పిక్కలు) పట్టేస్తుంటాయి.

హీట్ ఎగ్సషన్: ఎండలోకి వెళ్లి వచ్చాక కళ్లు తిరగడం, నీరసంగా ఉంటుంది.

హీట్ సింకోప్ : చాలాసేపు ఎండలోకి వెళ్లివచ్చాక ఇంట్లో కూర్చున్నప్పుడు అకస్మాత్తుగా కాసేపు సొమ్మసిల్లి పడిపోయినట్లుగా అవుతారు. హీట్ ఎగ్జషన్, హీట్ సింకోప్‌లో పైన పేర్కొన్న లక్షణాలు మనలో చాలామందికి కనిపించి, ఒకటి రెండు రోజులు ఎండపట్టున ఉంటే మళ్లీ మామూలైపోవడం చూస్తూనే ఉంటాం.

ఎగ్జషనల్ హీట్‌స్ట్రోక్: ఇది ఎక్కువసేపు ఎండలో ఉండి, ఎండలో శ్రమతో పనిచేసేవారిలో ఎక్కువగా వస్తుంది. అంటే సాధారణంగా సైనికులు, అథ్లెట్స్, ఫుట్‌బాల్ ఆటగాళ్లు, మారథాన్ రన్నర్స్, కూలీలు వంటి వారిలో ఇది ఎక్కువ.

నాన్ ఎగ్జషనల్ హీట్ స్ట్రోక్: (క్లాసిక్ హీట్ స్ట్రోక్): నేరుగా ఎండలో లేకపోయినా వాతావరణంలోని వేడి వల్ల ఈ వడదెబ్బ తగులుతుంది. వడగాడ్పులు ఎక్కువగా ఉన్న సమయంలో దీనికి గురవుతుంటారు. ఇండ్లలో ఉండే పెద్దవయసువారు, చిన్నపిల్లలు దీనికి గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఏసీ సౌకర్యాలు లేని వాళ్లకు, సరిగా గాలి సోకని ప్రదేశాల్లో (వెంటిలేషన్ సరిగా లేని నివాసాల్లో) ఉండేవారికి ఇది తగిలే అవకాశం ఎక్కువ.

హైపర్‌థెర్మియా: శరీరపు ఉష్ణోగ్రత 105 ఫారెన్‌హీట్ కంటే ఎక్కువగా ఉంటే ఆ కండిషన్‌ను ‘హైపర్‌థెర్మియా’ అంటారు. శరీర ఉష్ణోగ్రత ఈ స్థాయికి పెరగడం అన్నది సాధారణంగా వడదెబ్బతో వచ్చే జ్వరంలోనే ఉంటుంది. ఇలా మన శరీరంలోని ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరుగుతూ ఉండటాన్ని ‘థర్మోరెగ్యులేటరీ ఫెయిల్యూర్’ అంటారు. శరీర జీవక్రియలు (మెటబాలిక్ యాక్టివిటీస్) అన్నీ ఒక నిర్ణీత ఉష్ణోగ్రత వద్దనే సక్రమంగా జరుగుతుంటాయన్న విషయం తెలిసిందే. ఫలితంగా శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోయినప్పుడు ఈ జీవక్రియలన్నీ దెబ్బతింటాయి. దాంతో వడదెబ్బ తగిలినప్పుడు అది ప్రమాదకరంగా పరిణమిస్తుంది. అయితే చిన్న చిన్న జాగ్రత్తలతోనే ఆ పరిస్థితి రాకుండా కాపాడుకోవచ్చు.

వడదెబ్బ అంటే ఏమిటి..?
ఎంత ఎండలోనైనా మన శరీర ఉష్ణోగ్రత నార్మల్‌గానే ఉంటుంది. మహా అయితే ఎండవేళల్లో బయట తిరిగితే 99.9 ఫారన్‌హీట్ వరకు పెరిగి, మళ్లీ నీడకు లేదా చల్లటి ప్రదేశానికి రాగానే నార్మల్‌కు వచ్చేస్తుంది. అయితే వడదెబ్బ తగిలినప్పుడు మాత్రం శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాకుండా బయటి ఉష్ణోగ్రత ఎంత ఉందో అంతకు చేరిపోతుంది. ఇలా ఉష్ణోగ్రత నార్మల్‌కు తీసుకువచ్చే పరిస్థితిని శరీరం కోల్పోవడాన్నే వడదెబ్బ అంటారు.

శరీర ఉష్ణోగ్రత నార్మల్‌కు రాలేని పరిస్థితి ఎందుకు...?
మన శరీర ఉష్ణోగ్రతను స్థిరంగా ఉంచేలా నియంత్రించే బాధ్యత మెదడులోని హైపోథాలమస్‌ది. బయట ఉష్ణోగ్రత పెరుగుతున్నకొద్దీ... శరీరానికి చెమట పట్టేలా చేస్తుందది. దాంతో చెమట పట్టినప్పుడు... శరీరం నుంచి ఉష్ణోగ్రతను సంగ్రహిస్తూ అది ఆవిరైపోతుంది. శరీరం నుంచి ఉష్ణోగ్రతను సంగ్రహించడం వల్ల దేహం చల్లబడుతుంది. శరీరాన్ని చల్లగా చేయడం కోసమే చెమట పడుతుంది. అయితే ఎండవేడికి శరీర ఉష్ణోగ్రత పెరిగే క్రమంలో దాన్ని ఒక నిర్ణీతస్థాయి కంటే దాటకుండా చూసేందుకు హైపోథాలమస్ కృషి చేస్తుంటుంది. ఆ స్థాయిని ‘హైపోథాలమస్ సెట్ పాయింట్’ అని చెబుతారు. బయటి ఉష్ణోగ్రత ఎంతగా పెరిగినా శరీర ఉష్ణోగ్రత మాత్రం ఆ నిర్ణీత ‘సెట్ పాయింట్’ను దాటకుండా హైపోథాలమస్ చూస్తుంటుంది. కానీ ఎండవల్ల శరీర ఉష్ణోగ్రత అదేపనిగా పెరుగుతూపోతే ఇక ఒకదశలో హైపోథాలమస్ దాన్ని నియంత్రించలేని పరిస్థితి వస్తుంది. అలాంటప్పుడు బయటి ఉష్ణోగ్రతకు తగినట్లుగా శరీర ఉష్ణోగ్రత అనియంత్రితంగా పెరిగిపోతూ ఉంటుంది. వడదెబ్బ తగిలిన సందర్భంలో అసలు చెమటపట్టకుండా పోయినప్పుడు ఒక దశలో ఇది జరుగుతుంది. ఈ దశలోని స్థితినే ‘వడదెబ్బ’ తగిలిన కండిషన్‌గా పేర్కొంటారు.

తగిలే అవకాశాలు ఎవరిలో ఎక్కువ...
చిన్నపిల్లలు, వృద్ధులు

దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్నవారు (క్రానిక్ పేషెంట్స్)

ఆరుబయట పనిచేయాల్సి ఉన్న పోలీసు వంటి వృత్తుల్లో ఉన్నవారు

క్రీడాకారులు

స్థూలకాయులు

మద్యం తీసుకునేవాళ్లు, డ్రగ్స్ అలవాటు ఉన్నవాళ్లు

మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డవారు... ఉదాహరణకు కొకైన్, యాంఫిటమిన్స్, ఎల్‌ఎస్‌డీ, ఎఫిడ్రిన్ వంటివి తీసుకునేవాళ్లు.

కొన్ని మందులు వాడేవారు... ఉదాహరణకు దాహాన్ని తగ్గించే హ్యాలోపెరిడాల్ మందులు తీసుకునేవారిలో...

స్వేదాన్ని తగ్గించే మందులైన యాంటీహిస్టమైన్స్, యాంటీకోలినెర్జిక్, ఫీనోథయజైన్స్, బీటాబ్లాకర్స్ తీసుకునేవాళ్లలో

పొడి చర్మం ఉన్నవాళ్లు, వేడి చర్మం ఉన్నవాళ్లు

స్వేదరంధ్రాలు తక్కువగా ఉండేవారిలో వడదెబ్బ తగిలేందుకు అవకాశాలు ఎక్కువ.

వడదెబ్బలో ప్రమాదకరమైన పరిస్థితిని గుర్తించడం ఎలా...
శరీర ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారన్‌హీట్ (40.6 సెంటీగ్రేడ్) కంటే ఎక్కువ పెరుగుతుంది.

ముఖంలోకి రక్తం చిమ్ముకొచ్చినట్లుగా ఎర్రగా మారుతుంది (ఫ్లషింగ్)

చాలా వేగంగా శ్వాస తీసుకోవడం

ఒంట్లోని చివరి భాగాల్లో తిమ్మిరి, స్పర్శ తెలియకపోవడం

అయోమయం

ఒక్కోసారి ఫిట్స్ రావడం

మానసికంగా సాధారణ స్థితిలో లేకపోవడం (అబ్‌నార్మల్ మెంటల్ స్టేటస్)... అంటే... కోమాలోకి వెళ్లడం, కన్ఫ్యూజన్‌లో ఉండటం, భ్రాంతులకు గురికావడం, చికాకు, కోపం వంటి భావోద్వేగాలకు గురికావడం కనిపిస్తాయి.

ఇతర కాంప్లికేషన్లు...
మూత్రపిండాల వైఫల్యం (కిడ్నీ ఫెయిల్యూర్)

బీపీ తగ్గడం

శరీరంలోని కొన్ని భాగాల్లో రక్తస్రావం (ఉదాహరణకు ముక్కురంధ్రాల వంటి భాగాల నుంచి)

అకస్మాత్తుగా గుండె ఆగిపోవడం (కార్డియాక్ అరెస్ట్)

ఇలాంటి అన్ని పరిస్థితుల్లో వెన్వెంటనే ఆసుపత్రిలో చేర్చాల్సి ఉంటుంది.

చికిత్స ఇదీ...
వడదెబ్బ తగిలినప్పుడు అత్యవసరంగా వైద్యచికిత్స అందించాలి. దీన్ని మెడికల్ ఎమర్జెన్సీగా పరిగణిస్తారు. అలాంటి సమయాల్లో చికిత్స పరంగా అనుసరించే ప్రక్రియలివి...

శరీరం వెంటనే చల్లబడేలా చేస్తారు. ఐస్ వాటర్ టబ్‌లో తల, చేతులు, మోకాళ్ల కిందభాగం ఉండేలా చేయాలి. శరీర ఉష్ణోగ్రత 101 డిగ్రీల ఫారన్‌హీట్‌కు తగ్గిన వెంటనే ఇలా నేరుగా ఐస్‌తో చల్లబరిచే ప్రక్రియను ఆపాలి. అయితే ప్రతి 5 నిమిషాలకు ఓసారి శరీర ఉష్ణోగ్రతను చెక్ చేస్తూ ఉండాలి.

శరీరానికి చల్లటి గాలి తగిలేలా ఫ్యాన్ చేయడం వంటివి చేయాలి.

ఐస్‌ప్యాక్ ఉపయోగించాలి.

శరీరాన్ని తడిగుడ్డతో కప్పి ఉంచాలి.

సాధారణంగా జ్వరానికి ఉపయోగపడే పారాసిటమాల్ వడదెబ్బకు ఉపయోగపడదు.

శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందేలా సెలైన్ (ఐవీ ఫ్లూయిడ్స్) ఇవ్వాలి.

అవసరమైనప్పుడు ఆక్సిజన్ పెట్టాల్సి ఉంటుంది.

వడదెబ్బ ... సాధారణ లక్షణాలు...
చర్మం స్వేదాన్ని ఇక స్రవించలేని పరిస్థితికి రావడం

తలనొప్పి

వికారం, కండరాలు పట్టేయడం (మజిల్ క్రాంప్స్) ముఖ్యంగా పిక్కలు పట్టేయడం (క్రాంప్స్ ఇన్ కాఫ్ మజిల్స్)

వాంతులు

కళ్లు తిరగడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వడదెబ్బ తీవ్రతను సరిగా అంచనా వేయడంలో లోపం లేదా గుర్తించాక సకాలంలో ఆసుపత్రికి తరలించడం వంటి జాగ్రత్తలు తీసుకోకపోతే అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు.

కీలక అవయవాలపై దుష్ర్పభావాలు...
వడదెబ్బ ప్రభావం అన్ని కీలకమైన అవయవాలపై పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కండరాలు, కాలేయం, రక్తం గడ్డకట్టే వ్యవస్థ (కోయాగ్యులేషన్ సిస్టమ్)... ఇలా వీటన్నింటిపై వడదెబ్బ దుష్ర్పభావాలు ఉంటాయి. అయితే సరైన సమయంలో వడదెబ్బ లక్షణాలను గుర్తిస్తే ఆ దుష్ర్పభావాలను నివారించవచ్చు.

పోల్చుకోవద్దు... పొరపడవద్దు...
వేసవిలో వచ్చే ప్రతి జ్వరం వడదెబ్బ కానక్కర్లేదు. కొన్ని ఇతర ప్రాణాంతకమైన జబ్బుల లక్షణాలు కూడా వడదెబ్బ లక్షణాల్లాగే ఉంటాయి. ఉదాహరణకు మెదడువాపు (మెనింజైటిస్), సెరిబ్రల్ మలేరియా, థైరాయిడ్ స్టార్మ్, న్యూరోలెప్టిక్ మాలిగ్నెంట్ సిండ్రోమ్, మాలిగ్నెంట్ హైపర్‌థెర్మియా, డెంగ్యూ జ్వరం వంటి సందర్భాల్లోనూ వడదెబ్బ లక్షణాలతో కొన్ని పోలికలు కనిపిస్తాయి.

నివారణ...
సాధ్యమైనంత మట్టుకు నీడలోనే ఉండాలి.

బయటకు వెళ్లాల్సిన పరిస్థితుల్లో ఉదయం 10 గంటలకు ముందు గాని... సాయంత్రం చల్లబడ్డ తర్వాత గాని బయటిపనులు చూసుకోవాలి.

ఇంటి కిటికీలను తెరచి... గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అయితే వేడిగాలి రాకుండా, గది చల్లగా ఉంచుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండలోకి వెళ్లాల్సి వస్తే గొడుగు తీసుకువెళ్లడం, వెడల్పు అంచులున్న హ్యాట్, కూలింగ్ గ్లాసెస్ ధరించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి.

వీలైనంతగా మంచినీళ్లు తాగుతూ ఉండాలి.

శరీరం లవణాలను కోల్పోకుండా ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఉప్పు వేసిన ద్రవాలు ఇవ్వాలి.

చెమటను గ్రహించే, చల్లగా ఉంచే వదులైన కాటన్ దుస్తులు ధరించాలి.

వడదెబ్బకు దోహదం చేసే మందులు డాక్టర్ సలహామేరకు మోతాదు తగ్గించడం గాని ఆపేయడం గాని చేయాలి.

వడదెబ్బ నివారణ పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి.

ఈ వేసవిలో శీతలపానీయాలు (ఏరేటెడ్ కూల్‌డ్రింక్స్) అంత మంచిది కాదు. వాటికి బదులు కొబ్బరిబొండం, మజ్జిగ వంటివి తీసుకోవడం మంచిది. దీనివల్ల శరీరం కోల్పోయే లవణాలను భర్తీ చేయడం సాధ్యమవుతుంది.
 

కిడ్నీల్లో రాళ్లు రాకుండా జాగ్రత్తలు

 

మూత్రపిండాల్లో వచ్చే రాళ్ల వల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి వచ్చే అవకాశం ఉంది. అందుకే కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండేందుకు అవసరమైన చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంతో పెద్ద ప్రమాదాన్నే నివారించే అవకాశం ఉంది. ఆ జాగ్రత్తలివి...- నీటిని ఎక్కువగా తాగాలి. రోజుకు తప్పనిసరిగా రెండు నుంచి రెండున్నర లీటర్ల యూరిన్‌ను విసర్జించాలి. కాబట్టి శరీర కణాల నిర్వహణకు పోను ఆ మోతాదులో మూత్ర విసర్జన జరగాలంటే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది.

- ఆహారంలో ప్రొటీన్, నైట్రోజెన్, సోడియం ఉన్న పదార్థాలను తక్కువగా తీసుకోవాలి.

- ఆక్సిలేట్ ఎక్కువగా ఉండే గింజలు, సోయాబీన్స్, పాలకూర, చాక్లెట్ల వంటి వాటిని వీలైనంతగా తగ్గించాలి.

- క్యాల్షియం సప్లిమెంట్లను కూడా తగిన మోతాదులో ఉండేలా చూసుకోవాలి. అలాగే క్యాల్షియం సిట్రేట్‌కు కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా నివారించే లక్షణం ఉంది కాబట్టి ఆ మేరకు అవి శరీరానికి అందేలా ఆహార నియమాలను పాటించడం మంచిది.

- ఆల్కహాల్ వల్ల మూత్రం ఎక్కువగా వస్తుంది. దాంతో దేహంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఫలితంగా క్రమేణా మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి అవకాశం ఎక్కువ.


- ఆరెంజ్ జ్యూస్‌కు క్యాల్షియం ఆక్సలేట్‌ను రాయిగా మారకుండా నిరోధించే లక్షణం ఉంది. కాబట్టి ఆరెంజ్ జ్యూస్ మంచిదే. అయితే విటమిన్ సి ఎక్కువగా తీసుకోవడం కూడా కిడ్నీస్టోన్ సమస్యకు దారితీసే అవకాశం ఉంది. కాబట్టి పుల్లటి పండ్లతో చేసిన జ్యూస్‌లను ఎక్కువగా తీసుకోకూడదు.

- కూల్‌డ్రింకులను అస్సలు తాగకూడదు.

- కాఫీలోని కెఫీన్ అనే పదార్థం మూత్రంలోని క్యాల్షియం విసర్జనకు దోహదం చేస్తుంది. కాబట్టి తగిన మోతాదులో తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్స్‌ని నివారించవచ్చని కొన్ని పరిశీలనలు వెల్లడించాయి.
 

జోడు అనర్థాలు

డయాబెటిస్ - హైబీపీ
క్రమం తప్పకుండా రక్తంలో చక్కెర పాళ్లను పరీక్షింప చేసుకోవడం, బీపీ చెకప్ చేయించుకోవడం వంటివి చేస్తూ ఉంటే కిడ్నీలను కాపాడుకోవడం సులభం.

మన దేశంలో మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారి సంఖ్య 20 లక్షలకు పైచిలుకేనని ఒక అంచనా. దీనికి తోడు ప్రతి ఏటా ఈ జాబితాకు రెండు లక్షల మంది అదనంగా తోడవుతున్నారు. దీన్ని బట్టే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మూత్రపిండాలు దెబ్బతినడానికి ప్రధానంగా దోహదపడే రెండు ప్రధానమైన సమస్యల్లో మొదటిది చక్కెర వ్యాధి. రెండోది హైబీపీ. ఈ రెండింటినీ నియంత్రణలో ఉంచుకుంటే మనిషి జీవితాన్ని తప్పకుండా కాపాడుకోవడమేగాక... ఆయుర్దాయాన్నీ పొడిగించుకోవచ్చు. ఆరోగ్యకరమైన సాధారణ జీవితం గడపవచ్చు.

ఆ రెండిటితో కిడ్నీకి అనర్థాలెన్నో...

నూరుమంది కిడ్నీ బాధితులను తీసుకుంటే అందులో 40 శాతం మంది మధుమేహం, మరో 30 శాతం మంది హైబీపీలను నియంత్రణలో ఉంచుకోకపోవడం వల్ల తమకు తెలియకుండానే తమ కిడ్నీలు తామే దెబ్బతినేలా చూసుకున్నవారవుతారు. అందుకే ఈ రెండు సమస్యలను నియంత్రణలో ఉంచుకోగలిగితే కిడ్నీలు దెబ్బతినకుండా చూసుకోవడం చాలా సులభం. అందుకే మూత్రపిండాలను సంరక్షిచుకోవడం అంటే... మొదట అదుపులో ఉండాల్సినవి... మధుమేహం, హైబీపీ అని గుర్తుంచుకోవాలి.

చిన్నతనంలోనే వచ్చే (టైప్-1) మధుమేహ బాధితుల్లో 10-30 శాతం మంది, పెద్దయ్యాక వచ్చే (టైప్-2) మధుమేహ బాధితుల్లో 40 శాతం మంది కిడ్నీ జబ్బుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం ఉందంటే అటు గుండెజబ్బులు వచ్చే అవకాశాలతో పాటు, కిడ్నీలు పాడయ్యే అవకాశాలూ ఉన్నాయని గుర్తుంచుకోవాలి.

ఇక ఆధునిక జీవనశైలిలోని ఆహారపు అలవాట్లు, తీవ్రమైన ఒత్తిడితో కూడిన వృత్తులు వంటివి మన రక్తపోటు (హైబీపీ) సమస్యను తీవ్రతరం చేస్తున్నాయి. దాంతో హైబీపీ కారణంగా దెబ్బతినే ప్రధాన అవయవాల్లో కిడ్నీ ప్రధానమైనది. అందుకే ఈ రెండూ ఉన్నాయంటే మూత్రపిండాలను సురక్షితంగా ఉంచుకోవడం చాలా కీలకం అనే విషయాన్ని ఎప్పుడూ మరచిపోకూడదు.

ఆ రెండూ ఉంటే కిడ్నీలపై అంత శ్రద్ధ ఎందుకు..?

ఒకసారి మూత్రపిండం పనితీరు మందగించి విఫలం కావడం ఆరంభమైందంటే అది పూర్తిగా నార్మల్‌కు రావడం చాలా కష్టం. అదేగాని పూర్తిగా విఫలమైతే ఇక నిత్యం కృత్రిమంగానే రక్తాన్ని శుద్ధి చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి. ఈ ప్రక్రియనే డయాలసిస్ అంటారు. ఇది కుటుంబాలపై ఎంతో ఆర్థిక భారాన్ని మోపుతుంది.

ఎంత లేదన్నా ప్రతి నెల ఐదారువేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పాడైపోయిన మూత్రపిండానికి చికిత్స తీసుకుంటూ ఉన్నా అది పూర్తిగా సమర్థంగా మారదు. క్రమంగా గుండెజబ్బులు, అవయవాలు దెబ్బతినడం వంటివి మొదలవుతాయి. పోనీ... దెబ్బతిన్న మూత్రపిండాన్ని మార్పిడి చేయించుకోవాలన్నా కిడ్నీ దాతలు దొరకడం కష్టం. ఆపరేషనే పెద్ద ప్రయత్నం అనుకుంటే... ఇక ఆ తర్వాత జీవితాంతం వేసుకోవాల్సిన మందులకూ చాలా ఎక్కువగా ఖర్చవుతుంది.

మూత్రపిండాల వ్యాధి ఉన్నవారి కుటుంబానికి అటు డయాలసిస్ కోసం, ఇటు మందుల కోసం ఆర్థికంగా ఎంతో ఖర్చు అవుతుంటుంది. సరే... ఖర్చును ఎలాగోలా భరిద్దామనే అనుకున్నా మందులతో ఇతర సమస్యలు, దుష్ర్పభావాలు, ఇబ్బందులు కలుగుతాయి. వీటన్నింటి సంయుక్త ఫలితంగా జీవనప్రమాణాలు, ఆయుర్దాయం తగ్గవచ్చు. అందుకే కిడ్నీలు దెబ్బతినకుండా ముందునుంచే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది, అది అవసరం కూడా.

- నిర్వహణ : యాసీన్
 

కిడ్నీస్టోన్స్

 

కిడ్నీలో రాళ్లు ఉండడం కూడా ఒకోసారి వాటిని దెబ్బతీసి మూత్రపిండాల వ్యాధికి కారణమవుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్న కండిషన్‌ను కొన్ని సాధారణ లక్షణాలతో గుర్తించవచ్చు.

కిడ్నీస్టోన్స్ లక్షణాలు...

కోలికీ పెయిన్...

భరించలేని నొప్పి ఉండటాన్ని ఇలా వ్యవహరిస్తారు

హిమచ్యూరియా...

మూత్రంలో రక్తం పడడాన్ని హిమచ్యురియా అంటారు

పైయూరియా...
మూత్రంలో చీము రావడం

డిస్ యూరియా...

విసర్జన సమయంలో మార్గం మంటగా అనిపించడం. చిన్న రాళ్లు మూత్రంతోపాటు వచ్చినప్పుడు లేదా యూరిన్ ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు కూడా కనిపిస్తుంది

ఆలిగ్యురియా...

మూత్రం పరిమాణం తగ్గడం. యురెథ్రాలో కాని మూత్రాశయంలో కాని లేదా రెండింటిలో కాని రాళ్లు ఉన్నప్పుడు ఇలా జరగవచ్చు

అబ్డామినల్ డిస్టెన్షస్...

తల తిరగడం, వాంతులవడం ఉంటుంది. వీటితోపాటు చలి, జ్వరం కూడా ఉండవచ్చు

పోస్ట్రిరీనల్ అజోటీమియా...

కిడ్నీలో రాయి యురేటర్‌ని బ్లాక్ చేయడం, తద్వారా కిడ్నీ ఫెయిల్యూర్‌కు దారి తీయడం

ఫ్రీక్వెన్సీ ఇన్ మిక్చ్యురిషన్...

ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయాల్సి రావడం. అలాగని రోజుకు రెండున్నర లీటర్లకంటే ఎక్కువ మూత్రవిసర్జన ఉండదు. తక్కువ మోతాదులో విసర్జిస్తూ ఎక్కువసార్లు వెళ్లాల్సి రావడం జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల ఆహారం తీసుకోవాలన్న ఆసక్తి లేకపోవడం, బరువు తగ్గడం వంటి లక్షణాలూ కనిపిస్తాయి.

మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు...

కిడ్నీ స్టోన్స్ చాలావరకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వాటంతట అవే ఎక్కువగా మూత్రంతో పాటు పడిపోతుంటాయి. రాయి సైజు, రాయి ఉన్న ప్రాంతం వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని చేయాల్సిన చికిత్స నిర్ణయిస్తారు. ఎండోస్కోపీ ద్వారా యురేటర్‌లో రాయిని తీయడం (యూఆర్‌ఎస్‌ఎల్-ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఇన్ ద యురేటర్), ఎండోస్కోపీ ప్రక్రియతో మూత్రపిండం నుంచి రాయిని తొలగించడం (పీసీఎన్‌ఎల్ - ఎండోస్కోపిక్ రిమూవల్ ఆఫ్ స్టోన్ ఫ్రమ్ ద కిడ్నీ) వంటి ప్రక్రియలతో రాయిని తొలగించవచ్చు. రోగి విపరీతమైన నొప్పితో బాధపడుతున్నప్పుడు, మూత్రపిండాల వ్యవస్థ విఫలమైనప్పుడు, కిడ్నీలు ఇన్‌ఫెక్షన్‌కు గురైనప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది. ఆపరేషన్ ఇష్టపడని రోగులు ఒక నెల రోజులు ఆగి చూసి అప్పటికీ రాయి దానంతట అది పడిపోకపోతే తప్పనిసరిగా ఆపరేషన్ చేయించాలి. లేకపోతే రాయి వల్ల ఇన్ఫెక్షన్ పాకి మూత్రపిండాలు దెబ్బతినే అవకాశాలుంటాయి
 

ఆరోగ్యబింబం మూత్రపిండం

 

మన శరీరం కూడా ఒక యంత్రం. అందులో కోటానుకోట్ల జీవక్రియలు ప్రతిరోజూ జరుగుతాయి. ఆ ప్రక్రియల్లో శరీరానికి ఒనగూరాల్సిన ప్రయోజనాలతో పాటు... కీడు చేసే వ్యర్థాలూ విడుదలవుతాయి. ఆ వ్యర్థాలను, విషాలనూ, హానికారక పదార్థాలను నిత్యం వడగడుతూ, బయటకు పంపిస్తూ ఒక కీలక వ్యవస్థను నడిపించే ప్రధాన అవయవాలే మన మూత్రపిండాలు. సగం దెబ్బతినేవరకూ మనిషి ఆరోగ్యంలో ఎలాంటి లక్షణాలూ చూపకుండా పనిచేస్తాయి. అందుకే అవి పూర్తిగా దెబ్బ తినకముందే కాపాడుకోవాలి. అంతటి కీలకమైన మూత్రపిండాలకు వచ్చే కొన్ని ప్రధాన సమస్యలు, వాటి నివారణ, చికిత్స వంటి అనేక అంశాలు తెలుసుకోవడానికి ఉపయోపడేదే ఇవ్వాళ్టి కథనం.

మూత్రపిండాలు రక్తంలోని విషపదార్థాలను, అదనంగా ఉన్న నీటిని క్రమంగా తొలగిస్తుంటాయి. మనకిడ్నీలు ప్రతిరోజూ 200 లీటర్ల రక్తాన్ని వడపోస్తాయి. ఇంతగా పనిచేసే ఈ మూత్రపిండాల పనితీరు క్రమంగా తగ్గడాన్ని దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి (క్రానిక్ కిడ్నీ డిసీజ్-సీకేడీ) అని అంటారు. ఇది చాపకిందనీరులా విస్తరించి, తాను సోకిన విషయమే తెలియకుండా రోగిని దెబ్బతీస్తుంది. అందుకే దీన్ని ‘సెలైంట్ డిసీజ్’ అని కూడా అంటారు. ఇలా వాటి పనితీరు క్రమంగా తగ్గుతూ ఒక దశలో పనిచేయకుండా పోతాయి. దీన్నే కిడ్నీ ఫెయిల్యూర్‌గా పేర్కొంటారు.

దీర్ఘకాల మూత్రపిండాల వ్యాధి... కారణాలు

దీనికి మొదటి కారణం మధుమేహం, రెండో కారణం దీర్ఘకాలికంగా ఉండే రక్తపోటు. ఇక సీకేడీకి మూడో కారణం గ్లోమరూలార్ డిసీజ్. ఇది ఉన్నవారిలో మూత్రంలో ప్రోటీన్ ఎక్కువగా పోతుంటుంది. ఫలితంగా కాళ్లవాపు, ముఖం వాచినట్లుగా ఉండటం, మూత్రం నురగలా రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో ఎలాంటి కారణాలు లేకుండానూ కిడ్నీలు దెబ్బతింటాయి. కిడ్నీలోని మూత్రనాళాలను దెబ్బతీసే ఇంటస్టిషియల్ వ్యాధులు, వంశపారంపర్యమైన జబ్బులు, ఇన్ఫెక్షన్లు, కిడ్నీలో రాళ్లు సైతం సీకేడీకి కారణం.

లక్షణాలు: కాళ్లవాపులు ముఖం వాపు ఆకలి తగ్గడం ఆగకుండా వాంతులు ఎప్పుడూ నీరసంగా ఉండటం ఆయాసం రావడం రాత్రివేళ మూత్రం కోసం ఎక్కువగా నిద్రలేవాల్సి రావడం, అప్పుడు మూత్రం చుక్కలు చుక్కలుగా తక్కువగా రావడం మూత్రంలో రక్తస్రావం... వంటి లక్షణాలు ఉంటాయి. ఈ లక్షణాలన్నీ కిడ్నీలు 50 శాతం దెబ్బతిన్న తర్వాతే బయటపడతాయి.

చికిత్స: రోగి కిడ్నీ పూర్తిగా దెబ్బతిన్నా కిడ్నీ చేసే విధులను నిర్వహించే డయాలసిస్ అనే ప్రక్రియను నిత్యం చేయించుకోగలిగినప్పుడు కిడ్నీ రోగి సైతం ఒక సాధారణ వ్యక్తి జీవించినంత కాలం, కిడ్నీ వ్యాధిగ్రస్తులూ జీవించవచ్చు. డయాలసిస్‌లో రెండు రకాలు. మొదటిది హీమో డయాలసిస్; రెండోది పెరిటోనియల్ డయాలసిస్.

కిడ్నీల రక్షణకు తేలికైన పరీక్షలు...

చిన్నప్పుడే వచ్చిన (టైప్-1) మధుమేహ బాధితులు, ఆ వ్యాధి బారిన పడిన ఐదేళ్ల నాటి నుంచి ప్రతి ఏటా కిడ్నీపరీక్షలు ఏవైనా ఉన్నాయేమోనని సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే పెద్దయ్యాక వచ్చిన (టైప్-2) మధుమేహ బాధితులు దాన్ని గుర్తించిన తక్షణమే కిడ్నీ పనితీరును తెలుసుకునే పరీక్షను చేయించుకోవాలి. ఆ తర్వాతినుంచి ప్రతి ఏడాది ఒక్కసారైనా క్రమం తప్పకుండా కిడ్నీ పరీక్ష చేయించుకుంటూనే ఉండాలి. ఆ తేలికైన పరీక్షలివి...

మూత్రంలో ఆల్బుమిన్:

ఇది ఒక రకం ప్రోటీన్. ఇది మూత్రంలో సుద్దలా పోతుందంటే కిడ్నీల వడపోత సామర్థ్యం తగ్గినట్లే. అందుకే మధుమేహ బాధితులు ప్రతిఏటా ఈ పరీక్ష చేయించుకోవాల్సిందే.

రక్తంలో సీరమ్ క్రియాటినిన్:

మన కిడ్నీల వడపోత సామర్థ్యం ఎలా ఉందో చెప్పేందుకు ఈ పరీక్ష కీలకం. దీని ఆధారంగానే కిడ్నీల వడపోత సామర్థ్యాన్ని (ఎస్టిమేటెడ్ గ్లోమెరూలార్ ఫిల్టరేషన్ రేట్-ఈజీఎఫ్‌ఆర్)ను లెక్కించి, కిడ్నీ సమస్య తలెత్తే అవకాశాన్ని అంచనా వేస్తారు. సాధారణంగా ఇది 110 మి.లీ. ఉంటుంది. ఇది 60 మి.లీ. కంటే తక్కువగా ఉంటే కిడ్నీ సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ. కిడ్నీ వ్యాధులపై అవగాహన పెంచుకుని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలు చేయిస్తూ ఉంటే మూత్రపిండంతో పాటు మనమూ గట్టిపిండంలా ఉంటాం.

కిడ్నీలను కాపాడుకోవాలంటే...

మధుమేహం, అధిక రక్తపోటు ఉన్నవారు కచ్చితంగా వాటిని నియంత్రణలో ఉంచుకోవాలి. చక్కెరవ్యాధిగ్రస్తులు ప్రతి మూడు నెలలకోసారి క్రమం తప్పకుండా హెచ్‌బీ1సీ (గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్) అనే పరీక్షను మూడు నెలలకు ఒకసారి చేయిస్తూ దాని ఫలితం 6.5 కంటే తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. అలాగే రక్తపోటు ఉన్నవారు బీపీని నిత్యం 130/80 ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమీ తినకముందు షుగర్ 110 ఎంజీ/డీఎల్ లోపల ఉండాలి. తిన్న తర్వాత 160 ఎంజీ/డీఎల్ ఉండేలా చూసుకోవాలి.

- రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు పెరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే... మాంసాహారం, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకుంటూ, ఆకుపచ్చని రంగులో ఉండే ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవాలి.
- ఆహారంలో ఉప్పును పరిమితం చేసుకోవాలి. ఉప్పు పాళ్లు ఎక్కువగా ఉండే బేకరీ ఆహారాన్ని, పచ్చళ్లు, అప్పడాలు, నిల్వ ఉండే ఆహారాన్ని తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరిగా తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.
- విసర్జన సమయంలో మూత్రంలో సుద్దలా పోతున్నట్లు అనిపిస్తే వెంటనే డాక్టర్‌ను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి.