all

Sunday, December 9, 2012

చికెన్‌ పచ్చడి

 

కావలసిన పదార్థాలు
బోన్‌లెస్‌ చికెన్‌ - అరకిలో
వెల్లుల్లి - ఒకటి (నూరుకోవాలి)
కారం - అరకప్పు
ఉప్పు - గరిటెడు
లవంగాలు - 2
యాలకులు: - 1
దాల్చిన చెక్క - 1 చిన్న ముక్క
(మసాలా దినుసులు పొడిగొట్టుకోవాలి)
నూనె - అరకిలో
నిమ్మకాయ - ఒకటి
తయారు చేసే విధానం
చికెన్‌ ముక్కలు కడిగి ఒక బట్టమీద వేసి కాసేపు ఆరనివ్వాలి. మూకుడులో నూనె పోసి చికెన్‌ ముక్కలు వేయించాలి. చికెన్‌ ముక్క నూనెలో ఉడికిందీ లేనిదీ చూసుకొని (మరీ గట్టిపడకుండా) చిల్లుల గరిటెతో గిన్నెలోకి తీసుకోవాలి. స్టౌ ఆర్పివేయాలి. మూకుడులో ఒక కప్పు లేదా కప్పున్నర నూనె మాత్రం ఉంచి మిగిలిన నూనె తీసివేయాలి. ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి ఇందులో నూరిన వెల్లుల్లి ముద్ద, ఇష్టమైతే కొద్దిగా కరివేపాకు, మసాలా పొడి, కారం, ఉప్పు వేసి గిన్నెలోకి తీసుకున్న చికెన్‌ ముక్కలను కూడా ఇందులో వేయాలి. గరిటెతో బాగా కలిపి వేడి తగ్గిన తరువాత నిమ్మకాయ రసం పిండాలి. ఇది బాటిల్‌లోకి తీసుకుని పెట్టుకుంటే నెల రోజులు నిల్వ ఉంటుంది.

వ్యక్తిగా ప్రతివారినీ గౌరవించు. కానీ పూజింపకు.


భారత్‌లో ఎఫ్‌డిఐల బేరం 120 కోట్ల ముడుపులు

 

  • వాల్‌మార్ట్‌ ఖాతాల్లో భాగోతం
  • అమెరికా సెనేట్‌కు సంస్థ నివేదిక
భారతదేశ చిల్లర వాణిజ్యంలోకి అడుగుపెట్టే అవకాశం సంపాదించడానికి వాల్‌మార్ట్‌ సంస్థ 125 కోట్ల రూపాయల ముడుపులు చెల్లించిన ఉదంతం బట్టబయలైంది. ఈ తతంగం నిజానికి 2008 నుంచే జరుగుతున్నది. అమెరికా సెనేట్‌కు వాల్‌మార్ట్‌ అందించిన లాబీయింగ్‌ నివేదికలోనే 2.5 కోట్ల డాలర్లు (సుమారు 125 కోట్ల రూపాయలు) ఖర్చు చేసినట్టు తెలియజేసింది. వ్యాపారాభివృద్ధి కోసం ఇలాంటి వ్యవహారాలు నడపడం అమెరికాలో నేరం కాదు!
భారతదేశంలో వ్యాపార పెట్టుబడుల అవకాశాల మెరుగుదల కోసం జరిపిన చర్యలతో సహా వివిధ లాబీయింగు కార్యకలాపాల్లో ఈ మొత్తం ఖర్చు చేసినట్టు వాల్‌మార్ట్‌ పేర్కొన్నది. 2012లో సెప్టెంబరుతో ముగిసిన చివరి త్రైమాసికంలో వివిధ రకాల వ్యవహారాలకు పది కోట్ల రూపాయల వరకూ ఖర్చుపెట్టినట్లు కూడా నివేదించింది. ఇవన్నీ అవినీతి ముడుపులకు ముసుగుల వంటి మాటలేనని చెప్పనవసరం లేదు. ఈ త్రైమాసికంలో వాల్‌మార్ట్‌ సంస్థ అమెరికా సెనేట్‌, ప్రతినిధుల సభ, ట్రేడ్‌ రిప్రజెంటేటివ్‌ (యుఎస్‌టిఆర్‌), విదేశాంగ శాఖలతో లాబీయింగ్‌ జరిపినట్లు తాజా త్రైమాసిక నివేదిక వెల్లడించింది. వ్యాపార పెట్టుబది అవకాశాల మెరుగుదల కోసం కంపెనీలు వివిధ శాఖలు, ఏజెన్సీలతో లాబీయింగ్‌ చేయడానికి అమెరికాలో అనుమతిస్తారు. అయితే ఈ నిమిత్తం చేసిన ఖర్చుల వివరాలను ప్రతి త్రైమాసికానికి అమెరికా సెనేట్‌కు ఆ కంపెనీలు సమర్పించాల్సి ఉంటుంది. వాల్‌మార్ట్‌ విషయానికొస్తే, 2009లో కొన్ని నెలలపాటు మినహాయిస్తే 2008 నుంచి నిరంతరం ఈ సంస్థ లాబీయింగ్‌ నడుపుతూనే ఉంది.
ప్రతిపక్షాల నుంచి వస్తున్న వ్యతిరేకతను పట్టించుకోకుండా మల్టీ బ్రాండ్‌ చిల్లర వర్తకంలోకి విదేశీ కంపెనీల పెట్టుబడులకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్షాల తీర్మానం ఇటీవల వీగిపోయిన విషయం తెలిసిందే. దీంతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించడానికి దీర్ఘకాలం నుంచి ఎదురుచూస్తున్న వాల్‌మార్ట్‌ సంస్థకు మార్గం సుగమమైంది. భారత
రిటైల్‌ మార్కెట్‌ ప్రస్తుత విలువ 50 వేల కోట్ల డాలర్లకుపైగా ఉంటుందని, ఇది 2020 నాటికి లక్ష కోట్ల డాలర్లను అధిగమిస్తుందని అంచనా. ప్రముఖ గ్లోబల్‌ కన్సల్టెన్సీ సంస్థ ఎటి కెర్నీ నివేదిక ప్రకారం, 2020 నాటికి మొత్తం మార్కెట్‌లో వ్యవస్థీకృత రిటైల్‌ మార్కెట్‌ 25 శాతానికి చేరుకుంటుంది. అంతర్జాతీయ రిటైల్‌ సంస్థలకు భారత్‌ అత్యంత అనువైన గమ్యస్థానంగా ఉంటుందని కూడా ఈ నివేదిక పేర్కొంది. వచ్చే ఐదేళ్లలో రిటైల్‌ మార్కెట్‌ వృద్ధి 15-20 శాతం ఉంటుందనీ ఈ నివేదిక తెలిపింది.

సాయికిరణ్

రజనీయే అన్నారు... నాది ఆర్టిస్ట్ ముఖమని
'అనగనగా ఆకాశం ఉంది .. ఆకాశంలో మేఘం ఉంది' పాట గుర్తుంటే చాలు ... మీరింకా ఆ హీరోని మర్చిపోలేదన్నమాటే. గాయకుడు వి.రామకృష్ణ కుమారుడిగా, బుల్లితెర, వెండితెరల హీరోగా అందరికీ తెలిసిన నటుడతను. 'నువ్వేకావాలి'తో చిత్రరంగ ప్రవేశం చేసి 'ప్రేమించు', 'సత్తా', 'డార్లింగ్ డార్లింగ్', 'వెంగమాంబ', 'శిరిడి శాయి' వంటి పలు చిత్రాల్లో నటించారు. అలాగే 'ఆటో భారతి', 'సుందరకాండ', 'అపరంజి' లాంటి బుల్లితెర సీరియల్స్‌లోనూ కనిపిస్తున్న ఆ యువ నటుడు సాయికిరణ్ హ్యాపీడేసే ఇవి.

అంజలీదేవిగారి ఇంటికి సత్యసాయిబాబాగారు వచ్చినప్పుడు, ఆయన చేతుల మీదుగా నా నామకరణం జరిగిందట. అమ్మానాన్నలు ఇద్దరూ గాయకులే కాబట్టి తరచూ ప్రోగ్రాంల్లో పాల్గొనడానికి ఊర్లు తిరుగుతూ ఉండడంతో, ఏడేళ్ల వరకూ అమ్మమ్మ వాళ్లింట్లో హైద్రాబాద్‌లోనే పెరిగాను. అమ్మమ్మ వాళ్లు అప్పట్లో ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవారు. ఆ ఇంటి పక్కనుండే ఫారెస్టు ఆఫీసరు ఒకాయన వికారాబాద్ అడవుల్లో గాయపడ్డ నెమళ్లనీ, జింకలను తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇవ్వడం నాకు బాగా జ్ఞాపకం. బహుశా అదే ఆ తర్వాత నేను జంతు ప్రేమికుడిగా మారడానికి దోహద పడిందేమో! సంక్రాంతి పండగ సందర్భంలో ఎగరేసే గాలిపటాల 'మాంజా' కోసుకుని ఎన్నో గద్దలు నేల రాలిపోతుండేవి.

అలా పడిపోయిన గద్దలపై ఒక టర్కీ టవల్ కప్పి, జాగ్రత్తగా కుక్కపిల్లని చంకలో పెట్టుకున్నట్టు పొదువుకొని, ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. అలా నేను కుక్కలు, ఉడుములు, పాములు, తాబేళ్లు, పావురాలు, లవ్ బర్డ్స్, గబ్బిలాలు, గద్దలు, చేపలు, ఊసరవెల్లులు, చిలకలు లాంటి ఎన్నో జంతువుల బాగోగులు చూసుకున్నాను. వీటికోసం ప్రత్యేకంగా పంజరాలను తయారుచేయించడం ... దెబ్బతిన్న వాటి ఆరోగ్యం కుదుట పడగానే యథావిధిగా వాటిని ప్రకృతిలోకి వదిలేయడం ఒక హాబీగా ఉండేది.

ఇంట్లోంచి పారిపోయాను
8వ తరగతిలో ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలిసినప్పుడు జరిగిన సంఘటన ఇది. లెక్కల్లో 90 శాతం తెచ్చుకోకపోతే తన్నులు తప్పవని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అయినా నాకు నూటికి 5 మార్కులే వచ్చాయి. ఇంటికి వెళితే తన్నులు ఎలాగూ తప్పవని రిక్షా రాకముందే సిటీ బస్సులో మద్రాసు సెంట్రల్‌కి వెళ్లి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (స్లీపర్‌లో) ఎక్కి దర్జాగా కూర్చున్నాను. రైలు గూడూరు దాటాక టి.సి. వచ్చి టికెట్ అడిగాడు. 'మా అమ్మానాన్నలు కూడా ఇదే రైల్లో ఉన్నారు. వాళ్లు ఏ బోగీలో ఉన్నారో తెలీదు. టికెట్ వాళ్ల దగ్గరే ఉంది' అని అబద్ధం ఆడేశాను. నా భుజానున్న స్కూల్ బ్యాగ్, చేతిలో లంచ్ బాక్స్ చూడగానే టి.సి.కి అనుమానం వచ్చి మెల్లగా కూపీ లాగాడు.

'నీవు రామకృష్ణగారి అబ్బాయివా? నేను మీ నాన్నగారి ఫ్యాన్‌ను తెలుసా' అనడంతో అసలు విషయం కక్కేసి ... అమ్మమ్మ వాళ్లింటికి హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పేశాను. రామకృష్ణగారి అబ్బాయిని కావడంతో టికెట్ విషయం మర్చిపోయి, 'అయ్యో ఒక్కడివీ ఎలా వెళ్తావు' అని బాధపడిపోయి, హైద్రాబాద్‌లో దిగగానే తనకు తెలిసిన మనిషికి నన్ను అప్పగిచ్చి మా అమ్మమ్మ వాళ్లింట్లో దిగబెట్టమన్నాడు. నేను సేఫ్‌గా అమ్మమ్మ వాళ్లింటికి చేరుకున్నాగానీ ... చెన్నైలో మా అమ్మానాన్నలు మాత్రం నిద్రాహారాలు మాని పోలీసుస్టేషన్ల వెంట తిరిగి, వాళ్లకు లంచాలిస్తూ, నా ఆచూకీ కోసం నానా హైరానా పడ్డారట. అమ్మమ్మ ఇంటినుండి వార్త అందిన తర్వాతగానీ వాళ్లు కుదుట పడలేదట. అంత తెగింపు నాకెలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే కానీ ఆ దెబ్బతో అమ్మానాన్నలు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చదువు, చదువు అని వెంటపడ్డం మానేశారు.

ఆ మాటతో హీరోనైపోయా!
మా చిన్న నాన్నమ్మ పి. సుశీలగారి అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి నాన్న వెంట నేనూ రజనీకాంత్‌గారి వద్దకు వెళ్లాను. అప్పుడాయన 'ఉలైపాళి' అనే తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. శుభలేఖ తీసుకుంటూ పక్కనే ఉన్న నన్ను చూసి 'ఎవరీ అబ్బాయి? ఆర్టిస్ట్ ముఖం. యాక్టర్‌ని చేయండి' అన్నారు. ఆ మాటతో నా చుట్టూ కెమెరా జూమ్‌తో రెడీగా ఉన్నట్టు, లైట్స్ ఒక్కసారిగా వెలిగినట్టు, ఎక్కడో యాక్షన్ అనే పిలుపు వినిపించినట్టు ఫీలయిపోయా. బయటకి రాగానే 'చూశారా, అందరి కళ్లకు రజనీకాంత్‌గారు యాక్టర్లా కనిపిస్తే ఆయన కళ్లకి నేను యాక్టర్లా కనిపించాను. చదువు మానేసి హీరోనైపోతా' అన్నాను నాన్నతో. ఆయన ముందు డిగ్రీ పూర్తి చేయమని కచ్చితంగా చెప్పేశారు. అదేంటో ఇంటర్మీడియట్ టైంలో గడిచిన ఒక్క సంఘటనా మెదడులో నిక్షిప్తం కాలేదు. ఆ రెండేళ్లూ ఎలా తుడిచి పెట్టుకుపోయాయో ఇప్పటికీ అర్థం కావట్లేదు. డిగ్రీలో ఈ కోర్స్, ఆ కోర్స్ అనీ చివరికీ దేనిమీదా ఇన్‌ట్రెస్ట్ లేక ఆ సంవత్సరం అంతా వృధా. చివరికి హైద్రాబాద్‌లో 'హోటల్ మేనేజ్‌మెంట్' చేస్తానని ఒప్పించి అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేశాను.

వాడికోసమే కరాటే నేర్చుకున్నాను
మొదట్లో మా కాలేజీ బేగంపేటలో ఉండేది. అందరూ సరదాకోసం ర్యాగింగ్ చేస్తే అమిత్ అనేవాడు మాత్రం వాడి అవసరానికి ర్యాగింగ్ చేసేవాడు. 'జేబులో ఎన్ని పైసలున్నయో తియ్' అంటూ దాదాగిరి చేసేవాడు. తిరగబడదామంటే నాకు శక్తి సరిపోయేది కాదు. వాడి పుణ్యమా అని సిటీబస్‌కు కూడా డబ్బులు లేక బేగంపేట నుండి జూబ్లీహిల్స్‌కి (అమ్మమ్మవాళ్లు అక్కడ ఉండేవాళ్లు) నడిచి వెళ్లేవాడ్ని. కాళ్లు నొప్పెట్టినప్పుడల్లా వాడిమీద కసి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగేది. వాణ్ని తన్నాలంటే నేను దృఢంగా అవ్వాలి అనుకుని, ఉదయం 5 గంటలకే నిద్రలేచి కరాటే క్లాసులకు వెళ్లేవాణ్ణి. సీన్ కట్ చేస్తే ....

సెకండియర్‌కి వచ్చేసరికి పుష్టిగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి కొట్టే బలం, ధైర్యం వచ్చేసింది నాకు. ఒక ఫైన్ ఈవినింగ్ వాడింటికి వెళ్లి బయటకి పిలిచి నన్ను నడిపించిన దృశ్యాలు నెమరేసుకుంటూ చితకబాదుతుంటే లోపల్నుంచి వాళ్ల నాన్న పరిగెత్తుకొచ్చి 'ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడ'ని అరిచాడు. వాడు చేసిన నిర్వాకం చెప్పగానే, కామ్‌గా ఇంట్లోకి వెళ్లిపోయి, 2 రోజుల పాటు వాడిని ఇంట్లోకి రానివ్వలేదట. ఆ తర్వాత నన్ను తన్నించడానికి మనుషుల్ని పెట్టాడని తెలిసింది. అప్పటికే మా కాలేజీ బేగంపేట నుండి కొంపల్లికి మారడంతో నాకోసం రెండ్రోజులు తిరిగి 'నీవిచ్చిన డబ్బులు రెండ్రోజులతో సరి' అని వాడికి చెప్పి వెళ్లిపోయారట. కొసమెరుపు ఏంటంటే ఆ టైంలో నేను కాలేజీకి వెళ్లలేదు.

అమ్మమ్మే నా బెస్ట్ ఫ్రెండ్
మా కాలేజీ పక్కనే ఒక డిగ్రీ కాలేజీ ఉండేది. ఈ రెండు కాలేజీలకు మ««ధ్యలో 'ఇగూ'్ల అనే రెస్టారెంట్. ఖాళీ దొరికితే టీ తాగడానికి అందులోకి వెళ్లేవాళ్లం. అప్పుడే నా కంట్లో పడిందొక నార్త్ ఇండియన్ (మిలట్రీ వాళ్ల) అమ్మాయి. బోయిన్‌పల్లి నుండి వచ్చేది తను. కేవలం ఆ అమ్మాయిని చూడ్డానికే ఇగ్లూకి వెళ్లేవాణ్ణి. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని అమ్మమ్మతో వెళ్లి చెప్పా ఒకసారి. 'వద్దురా, ఉత్తరాది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా ఉంటారు కానీ, పిల్లలు పుట్టగానే అమ్మమ్మల్లా అయిపోతార'ంది. నా మనసు మాత్రం ఊరుకునేది కాదు. అప్పట్లో నేను కాలేజీలో నేర్చిన ఫ్రెంచ్ లాంగ్వేజీని అప్పుడప్పుడు ఇంట్లోనే ట్యూషన్‌గా చెప్పేవాణ్ణి. ఒకరోజు నా క్లాసు వినడానికి తనూ వచ్చింది. అమ్మమ్మకి చూపించి 'చూడు ఎంత అందంగా ఉందో' అన్నాను, అప్పటికైనా మనసు మార్చుకుంటుందేమోనని. 'వయసులో గాడిద పిల్ల కూడా ముద్దుగానే ఉంటుందిరా' అని క్లాసు పీకింది.
మళ్లీ సీన్ కట్ చేస్తే -13 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి నా ఫేస్‌బుక్‌లో కనిపించింది, అమ్మమ్మ మాటని నిజం చేస్తూ. ఈ విషయం అమ్మకి చెబితే 'అందుకేరా, పెద్దల మాట వినాలి' అని మరోసారి క్లాసు పీకడానికి రెడీ అయ్యింది.

డిగ్రీ అవగానే ఉషాకిరణ్ మూవీస్ పిలుపు - 'శివలీలలు' సీరియల్ కోసం మేకప్ టెస్ట్ చేస్తామంటూ. ముందు మన్మథుడి పాత్రకు పిలిచి, తర్వాత శివుడి మేకప్ వేశారు. చివరికి విష్ణుమూర్తి వేషానికి సెలక్టు చేశారు. అలా శివలీలలతో బుల్లితెరంగేట్రం చేశాను. 'నువ్వేకావాలి' చిత్రం కోసం విజయభాస్కర్‌గారు రెండో హీరో కోసం వెతుకుతుంటే కృష్ణవంశీగారు 'రామకృష్ణగారి అబ్బాయిని ట్రై చేయమ'ని సలహా ఇచ్చారట. అలా మరోసారి ఉషాకిరణ్ మూవీస్‌తోనే సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పట్నించీ జీవితాన్ని నాకు నచ్చినట్టే గడిపాను కాబట్టి రోజులన్నీ నాకు హ్యాపీడేసే. అంతేకాదు, రాబోయి రోజులు కూడా కచ్చితంగా హ్యాపీడేస్ అనే నమ్మకం నాది.

'కిడ్నాప్' నుండి తప్పించుకున్నాను
హైద్రాబాద్‌లో చదివింది 2వ తరగతి వరకే గాని టీచర్లని మూడు చెరువుల నీళ్లు తాగించేవాణ్ణి. చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. హోంవర్కు చేయడమంటే యమ బద్ధకం. పూర్వ జన్మలో డాక్టర్నేమో ... నా రాత అర్థం చేసుకోలేక టీచర్ల బుర్ర గిర్రున తిరిగిపోయేది. అయితే చిత్రలేఖనంలో అందె వేసిన చెయ్యి నాది. పొద్దస్తమానం బొమ్మలు గీస్తూ గడిపేవాణ్ణి. టీచర్ కొట్టబోయినప్పుడల్లా 'మాడమ్ మీ శారీ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు' లాంటి మాటల్ని చెప్పేసి తప్పించుకునే వాణ్ణి. పొగడ్తకంటే తీయనిదేముంది? చుట్టంచూపుగా వచ్చే అమ్మానాన్నల్ని పరాయి వాళ్లలా చూస్తుండడంతో ఇక లాభం లేదని బలవంతంగా చెన్నై తీసుకెళ్లిపోయారు. అమ్మమ్మ నుండి నన్ను విడదీశారని వాళ్లిద్దరిపై మొదట్లో కోపంగా ఉండేది.

స్కూల్‌లో నన్ను దించటానికి, మళ్లీ తీసుకురావడానికి ఒక రిక్షా ఉండేది. ఒకరోజు స్కూల్ వదిలేసి అరగంటైనా రిక్షా రాలేదు. అప్పటికే పిల్లలంతా వెళ్లిపోయారు. ఒక్కడ్నే గేటు బయట అరుగు మీద కూర్చుని రిక్షా కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలో నాకు ఎదురుగా ఒక పొడవాటి కారు ఆగింది. అందులోంచి ఒకడు దిగి, 'ఏం పేరు నీది? చాలా బొద్దుగా ఉన్నావు' అంటూ ప్రేమగా మాట కలిపాడు. బెరుకుగానే సమాధానం చెప్పాను. 'అరే నువ్వు సింగర్ రామకృష్ణ అబ్బాయివా? మీ నాన్న నేను మంచి మిత్రులం తెలుసా?' అంటూ మామిడి ముక్కలు కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంతలో మా రిక్షా అతడు వచ్చాడు. 'నీవు వెళ్లిపో, నేను బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే. వీళ్ల నాన్న నేను ఫ్రెండ్స్' అన్నాడు వాడు. నేను కూడా సరే అనడంతో మా రిక్షా వెనక్కి తిరిగింది.

తర్వాత వాడు జేబులోంచి 'స్ప్రే' తీసి 'ఇది చూడు. ఎంత మంచి వాసన వేస్తుందో' అంటూ నా చేతిలో పెట్టబోయాడు. అంతకు ముందురోజే స్ప్రే కొట్టి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందని, జాగ్రత్తగా ఉండమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి 'వద్దు' అంటూ భయంగా వెనకడుగు వేశాను. ఇంతలో మా రిక్షా అతను వెనక్కి వచ్చి 'బాబు ఇల్లు ఎక్కడో మీకు తెలుసా?' అని అడిగాడు అతన్ని. 'తెలుసు తెలుసు. నీ వెళ్లు' అంటాడేగానీ అడ్రుసు చెప్పట్లేదు. మా రిక్షా అతడికి డౌటొచ్చి కేకలేయడంతో పలాయనం చిత్తగించాడు వాడు. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాన్నో?!

మిక్స్చ్‌ర్ పొట్లం


పోయిన చోటే వెతుక్కున్నా!


"లంచం తీసుకుంటుండగా పట్టుబడి, ఉద్యోగం పోగొట్టుకున్నానన్నావు కదరా! మళ్లీ అదే ఉద్యోగం ఎలా సంపాదించావు?'' ఆశ్చర్యంగా అడిగాడు శేషాద్రి. "పై ఆఫీసరుకి లంచం ఇచ్చి'' ఠపీమని చెప్పాడు సింహాద్రి.

ఇన్నాళ్ళకొచ్చింది మరి!
"పదేళ్ల వాడికి ఎల్.కే.జీలో సీటెలా ఇమ్మంటావయ్యా? కుదరదు'' చెప్పాడు ప్రిన్స్‌పాల్. "అడ్మిషను తీసుకోడానికి క్యూలో నిల్చున్నప్పుడు వాడికి ఐదేళ్లే నండి .. '' చెప్పేడు గుర్నాథం.

సోమరి సోంబేరి
అర్ధరాత్రి దొంగలొచ్చిన అలికిడికి మెలకువ వచ్చింది సోంబేరయ్యకి. విలువైన సామాన్లను గోనె సంచెలో వేసుకుంటున్న దొంగల కేసి అర నిమిషం తేరిపార చూసి, "ఇదిగో, మీరు ఏం పట్టుకెళ్తున్నారో లిస్టు రాసి టేబుల్‌మీద పెట్టి మరీ వెళ్లండి. లేదంటే రేపు స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు పోలీసోళ్లకి సమాధానం చెప్పలేక చావాలి'' అని, అటు తిరిగి గుర్రుపెట్టాడు.

అది మాత్రం సాధ్యపడదు
"మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి డాక్టర్'' కంగారుగా ఫోన్ చేసింది సుశీల. "గాభరా పడకండి, నేను వచ్చేలోపు మంచం పైన పడుకోబెట్టండి'' చెప్పాడు డాక్టర్. "ఛీ ఛీ, పిచ్చికుక్కని మంచంపైన ఎలా పడుకోబెట్టమంటారండి .. మీకేమైనా పిచ్చా?'' ఠపీమని అనేసి, నాలుక కరుచుకుంది సుశీల.

'విజయం వచ్చేవరకూ తప్పదండి!
"ఏమయ్యా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటావా? నేరం అని తెలీదూ?'' అడిగాడు జడ్జి. "ప్రతి మగవాడి 'విజయం' వెనకా ఒక స్త్రీ ఉంటుందంటారు కదండి. ఒకటీ, రెండులతో విజయం రాలేదండి'' నిజాయితీగా సమాధానమిచ్చాడు ముద్దాయి మన్మథరావు.
బొమ్మలు: ఎన్.రాజశేఖర్‌రెడ్డి

మటన్‌తో మరిన్ని


దాల్చ
కావలసిన పదార్థాలు: సొరకాయ - అరకేజీ, (లేత) మటన్ - అరకేజీ, శనగపప్పు - 1 కప్పు, టమోటా తరుగు - 2 కప్పులు, ఉల్లి తరుగు - పావు కప్పు, పచ్చిమిర్చి -6, ఉప్పు - రుచికి తగినంత, కారం, పసుపు - అర టీ స్పూను చొప్పున, నూనె - 1 టేబుల్ స్పూను, అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీ స్పూను, కరివేపాకు - 4 రెబ్బలు.
తయారుచేసే విధానం:శనగపప్పులో కొద్దిగా ఉప్పు, పచ్చిమిర్చి వేసి మెత్తగా ఉడికించి, మెదిపి పక్కనుంచాలి. మటన్‌లో తగినంత నీరు పోసి కుక్కర్లో ఉడికించాలి. సొరకాయ క్యూబ్స్‌గా తరిగిపెట్టుకోవాలి. లోతైన కడాయిలో ఉల్లితరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, సొరకాయ ముక్కలు, టమోటా తరుగు, ఉప్పు, పసుపు, కారం ఒకటి తర్వాత ఒకటి వేసి కొద్దిసేపు వేగించాలి. ఉడికించిన మటన్, గ్లాసు నీరు కలిపి ఐదు నిమిషాల తర్వాత పప్పు మిశ్రమం, కరివేపాకు వేసి కొద్దిగా చిక్కబడ్డాక కొత్తిమీర చల్లి దించేయాలి. పలావు అన్నంతో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉండే కూర ఇది.

లివర్ ఫ్రై
కావలసిన పదార్థాలు: లివర్ (ముక్కలు) - అరకేజీ, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, దనియాల పొడి - 1 టేబుల్ స్పూను, (ఇష్టమైతే) మిరియాల పొడి - అర టీ స్పూను, ఉల్లి తరుగు - అరకప్పు, టమోటా - 1, అల్ల వెల్లుల్లి పేస్టు - 1 టేబుల్ స్పూను, దాల్చినచెక్క - అంగుళం ముక్క, లవంగాలు - 3, కరివేపాకు - 4 రెబ్బలు, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 2 టేబుల్ స్పూన్లు.
తయారుచేసే విధానం:నూనెలో దాల్చినచెక్క, లవంగాలు, ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి వేసి వేగించాలి. తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు కలపాలి. ముక్కలు మెత్తబడ్డాక కారం, దనియాలపొడి, కరివేపాకు, పసుపు వేసి, రెండు నిమిషాల తర్వాత లివర్ ముక్కలు వేసి, పావు కప్పు నీరు పోసి మూత పెట్టి చిన్న మంటపై ఉడికించాలి. పదిహేను నిమిషాల తర్వాత (నీరు ఆవిరయ్యాక) కొత్తిమీర చల్లి దించేయాలి (ఎక్కువ సేపు ఉడికిస్తే ముక్కలు గట్టి పడిపోతాయి). పరాటాలతో పాటు, అన్నంతో నంజుకోడానికి కూడా బాగుండే ఫ్రై.

తలకాయ కూర
కావలసిన పదార్థాలు: తలకాయ మాంసం - పావుకేజీ, ఉల్లిపాయలు - 3 (ఒకటి పేస్టు చేయాలి, రెండు తరగాలి), టమోటాలు (తరుగు) - 2, పచ్చిమిర్చి - 3, అల్లం - అంగుళం ముక్క, వెల్లుల్లి రేకలు - 6, పసుపు - అర టీ స్పూను, కారం - 1 టీ స్పూను, గరం మసాల పొడి - 1 టీ స్పూను, ఉప్పు - రుచికి తగినంత, నూనె - 1 టేబుల్ స్పూను.
తయారుచేసే విధానం: తలకాయ మాంసంలో పసుపు, కారం, ఉప్పు కలిపి కుక్కర్లో తగినంత నీరు పోసి పది నిమిషాలు ఉడికించి దించేయాలి. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ కలిపి పేస్టు చేసుకోవాలి. నూనెలో ఉల్లి, పచ్చిమిర్చి తరుగు వేగాక ఉల్లి పేస్టు, టమోటా తరుగు వేసి మరో రెండు నిమిషాలు వేగించి, గరం మసాల పొడి కలపాలి. ఇప్పుడు ఉడికించిన మాంసం (కుక్కర్లో మిగిలిన నీరుతో పాటు) కలిపి చిక్కబడేవరకు ఉంచాలి. తర్వాత కొత్తిమీర చల్లి దించేయాలి. ఈ కూర అన్నంలోకి, పరాటాలలోకి కూడా బాగుంటుంది.

పీరియడ్స్ లో పొట్ట నొప్పిని పోగొట్టే అద్భుతమైన చిట్కాలు...!

అడవాళ్లను ముఖ్యంగా వేధించే సమస్య పిరియడ్‌ ప్రాబ్లమ్‌... ప్రతినెల నెలసరి సమయంలో తప్పకుండా వచ్చే కడుపు నొప్పి తట్టుకోలేక విలవిలాడుతారు. ఏవేవో చిట్కాలు పాటిస్తుంటారు. ఆ మూడు రోజులు ఏ పని చేయలేరు. చాలా అవస్థపడతారు.. ఆడపిల్లల్లో 21 ఏళ్లదాకా శారీరక ఎదుగుదల కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఎత్తు, బరువు, శరీరఛాయ, శరీరాకృతి అనేవి జన్యుపరంగా నిర్ధారించబడి ఉంటాయి.
కొంత మందికి నెలసరికీ నెలసరికీ మధ్యలోనూ రక్తస్రావం అవుతుంది. నెలసరి సమయంలో గానీ లేదా అంతకు ముందు గానీ తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. కొంతమందిలో నెలసరి ఈ నొప్పి మరింత తీవ్రదశలో ఉంటుంది.ఋతువు ప్రారంభానికి ఒక రోజు ముందు పొత్తికడుపులో కండరాలు ఎవరో గట్టిగా పట్టుకుని సలుపుతు ఉన్నట్లుగా మొదలై అది ఋతు సమయంలో మరింత ఎక్కువగా ఏర్పడుతుంది. దీనితో పాటే కడుపులో వికారం, సొమ్మసిల్లిపోవడం వంటి లక్షణాలు ఏర్సడుతాయి. ఇవి ఎపుడైతే ఏర్పడుతాయో అపుడే మీరు ఈ నొప్పి చాలాతీవ్రంగావుంది అని గ్రహించాలి. వెంటనే తగు చికిత్స కోసం వైద్యులను సంప్రదించాలి.
మహిళలకు వచ్చే నెలసరి రుతుక్రమంలో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరోన్ స్ధాయిలు తగ్గుతాయి. ఈ సమయంలో వీరికి కడుపులో నొప్పులు, కోపతాపాలు అధికమవుతాయి. ఎంతో చికాకుగా వుంటారు. క్షణ క్షణానికి మూడ్ మారుతూంటుంది. దీనికి కారణం హార్మోన్లలో వచ్చే మార్పులు. హాయిని కలిగించే సెరోటోనిన్ తగ్గిపోవటం. ఎండార్ఫిన్లు మాయమవటం. తీవ్ర మనోవేదన కలిగి వుంటారు. మరి వీరి పరిస్ధితిని అదుపులో వుంచి ఆనందపరచాలంటే...కొన్ని చిట్కాలు చూడండి.
ఈ అంశంపై విదేశాల్లో సైతం పరిశొధనలు జరిగాయి. తాజాగా నిర్వహించిన సర్వేలో నెలసరి నొప్పిని తట్టుకోవడానికి, బాధ నుంచి ఉపశ మనం ఇంట్లో ఉన్న వస్తువులతోనే పొందవచ్చు అన్న విషయం స్పష్టమైంది. నొప్పిని ఎదుర్కోవడానికి మహిళలు ఉపయోగిస్తున్న చిట్కాలు వారికి త్వరగా ఉపశమనం కలిగిస్తున్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. మరి ఆ చిట్కాలు ఏంటో చూద్దాం...


హెర్బల్‌ టీ: టీ పోడితో కాకుండా ఆకులతో చేసిన టీ తాగితే నొప్పి నుంచి ఉపశమనాన్ని పొందవచ్చు.



వేడి నీళ్ల స్నానం: వేడి నీళ్లతో స్నానం చేయడంవల్ల వెన్ను నొప్పి, ఒంటి నొప్పులను ఎదుర్కొనవచ్చు. ఇదే కాకుండా ఒత్తిడి నుంచి రిలాక్స్‌ అవ్వటానికి ఏదైన మంచి చిత్రం చూడటం లేదా ఏదైనా చిక్సిత తీసుకుంటేనొప్పి నుంచి కొంత రిలాక్స్‌నెస్‌ పొందవచ్చు.



మసాజ్‌: వెన్ను మర్దన వల్ల వెన్ను, కడుపు నొప్పి చాలా వరకు తగ్గుతుంది.



వేడి నీళ్ల కాపడం: వేడి నీళ్లు ఒక సంచిలో పోసి దానితో వెన్ను, కడుపు చుట్టూ పెట్టడంవల్ల నొప్పి వల్ల కలిగే అసౌకర్యాన్ని దూరం చేయడంలో సహాయపడుతుంది.


చాక్లెట్‌: చాక్లెట్‌ బార్‌ తినడం వల్ల కూడా ఈ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.



వ్యాయామం: కొన్ని యోగా భంగిమలు కమలాసనం, సీతాకోకచిలుక ఆసనం వంటివి పీరియడ్‌వల్ల కలిగేనొప్పిని, అసౌకర్యాన్ని దూరం చేస్తాయి.

కర్జూరంలో 7 అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు...!

ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. అతి తేలికగా జీర్ణం అయిపోతుంది. శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది. పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి. ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు. ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు. దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు.


గుండె ఆరోగ్యానికి: గుండె కండరాలు సమర్థవంతంగా పనిచేయడానికి ఇందులోని పొటాషియం చాలా ఉపయోగపడుతుంది. రక్తపోటును నివారించే సామర్థ్యంకూడా దీనికి ఉందట. ఆల్కహాల్ లేదా ఇతర మత్తుపదార్ధాల ప్రభావం నుండి బయటపడాలంటే ఖర్జూరాలు మంచి ఔషధం. గింజతీసివేసి ఈ రసం ప్రతిరోజూ రెండు పూటలా తాగితే గుండె జబ్బులు రాకుండా కూడా చేస్తుంది.



మలబద్దకం: మలబద్దకాన్ని నివారించడానికి ఖర్జూరం ఒక దివ్వఔషదం. మలబధ్దకంతో బాధపడే వారు ఈ కర్జూరం పండ్లును రాత్రంతా నానబెట్టి, ఆ నీటితోఉదయం పరగడున తాగితే ఈ సమస్య నుండి బయట పడవచ్చు. కర్ఝూరంలో ప్రోటీనులు, ఫైబర్ మరియు అవసరమైన పోషకాలు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కర్జూరం నుండి మలబద్దకం సమస్య అధిగమించేందుకు బాగా సహాయపడుతుంది.



రేచీకటి: కర్జూరంలో అధికంగా విటమిన్ ఎ తో పాటు ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ రేచీకటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. కాబట్టి కర్జూరం నుండి ఎ విటమిన్ తీసుకోవడం చాలా అవసరం.



గర్భిణీకి: గర్భిణీలకు ఫోలిక్‌యాసిడ్‌ చాలా అవసరం. అది ఇందులో మెండుగా ఉంది. కాబట్టి గర్భణీ స్త్రీలు కర్జూరం ను తరచూ తీసుకొంటుండాలి. ముఖ్యంగా గర్భిణీలు ఖర్జూరాలు తింటే ఐరన్‌ బాగా దొరుకుతుంది. ఎందుకంటే 100 గ్రాముల ఖర్జూరాల్లో 7.3 మిగ్రా ఐరన్‌ ఉంది. ఇంకా హీమోగ్లోబిన్ తక్కువగా ఉన్న మహిళలకు కూడా కర్జూరం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. కర్జూరం పండులో క్యాల్షియం, మాంగనీస్, ఫాస్పరస్, మరియు సెలీనియం పుష్కలంగా ఉంటుంది. ఈ కనిజలవణాలు, గర్భంలోని పిండి పెరుగుదలకు చాలా అవసరం.


బోలు ఎముకల వ్యాధి నిరోధానికి: ఈ రోజుల్లో అనేక మంది కీళ్ళ నొప్పితో మరియు బోలు ఎముకల వ్యాధి బాధపడుతున్నారు. శరీరంలో కాల్షియం స్థాయిలు అతితక్కువగా ఉండటం చేత ఈ ఆరోగ్య సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి కర్జూరంలో క్యాల్షియం అధిక శాతంలో కలిగి ఉండటం చేత వీటిని తరచూ తినడం వల్ల కీళ్ళ నొప్పి చికిత్సకు సహాయపడుతుంది. ఎముకలు బలంగా, పటుత్వంగా ఉండాలంటే, ఖర్జూర పండు తరచుగా ఎక్కువగా తినాలి.



పెద్ద ప్రేగు రుగ్మతలు: జీర్ణశక్తిని మెరుగుపర్చేశక్తి ఖర్జూరాల్లోని ఫైబర్‌కు వుందనేది వైద్య పరిశోధనల్లో తేలింది. పెద్దపేగులోని సమస్యలకు ఈ పండులోని టానిన్‌ చక్కగా ఉపయోగపడుతుంది.



దంత క్షయం: చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. చాలా మంది దంత క్షయంతో బాధ పడుతుంటారు. కర్జూరం తినడం వల్ల దంత క్షయాన్ని మరియు డెంటల్ ప్లాక్ నిరోధించవచ్చు. ఈ పండులో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వల్ల, మినరల్స్ పుష్కలంగా ఉండటం చేత ఆరోగ్యకరమైన దంత నిర్వాహనకు చాలా అవసరం.

పిల్లలనుండి పెద్దలదాకా ఎంతో ఇష్టంగా తినే పండు ఖర్జూరాలు. చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఇవి రెండూ ఒకే జాతికి చెందినా ఖర్జూరంలో కండ ఎక్కువగా ఉంటుంది. సామాన్యంగా దొరికే పండులోనూ అదే రుచి ఉంటుంది. కాకుంటే, ఖరీదు ఎక్కువగా ఉండే ఖర్జూరాలు మరింత మృదువుగా, అప్పుడే చెట్టునుండి తెంపినట్లుగా, కమ్మగా ఉంటాయి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి కావడంతో ఖర్జూరాలు అందరూ ఇష్టపడతారు.
నేడు ఖర్జూరాలను స్వీట్ల తయారీలో కూడా వాడుతున్నారు. పంచదారకు బదులుగా ఖర్జూరాలను వాడితే ఆరోగ్యానికి హాని కలుగకుండా తియ్యదనం వస్తుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే వీటిలో ఉన్నది సహజసిద్ధమైన తియ్యదనం.

ఈ చలికాలంలో మీ కురులను కాపాడే 5 హెయిర్ ప్యాక్స్

చలికాలంలో చాలా మందికి ఏదో ఒకటి ఇష్టంగా ఫీలవుతారు. చల్లని ఉష్ణోగ్రత లేదా చలికాలంలో వచ్చే వెచ్చని సూర్య కిరణాలంటే చాలా మంది ఇష్టం. అయితే ఇష్టం లేనివి కూడా ఉన్నాయి. చలిగాలికి చర్మం, పగుళ్ళు, జుట్టు రాలడం పెద్ద సమస్యగా ఏర్పడుతుంది. కాబట్టి చలికాలంలో చర్మంతోపాటు జట్టు సంరక్షణ కూడా చాలా అవసరం. లేకపోతే చుండ్రు, జిడ్డు సమస్యలు అధికమై జట్టుబలహీనమై, జీవం కోల్పోయి పీచులా తయారవుతుంది. అందుకనే.. జుట్టు పట్టుకుచ్చులా జాలువారాలంటే కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తే సమస్యలనుంచి కురులకు రక్షణ కల్పించుకోవచ్చు.
homemade hair packs winter

ఈ కాలంలో శిరోజాల రక్షణకు నీరు తగినంత తీసుకోవడం ద్వారా శిరోజాలు పొడి బారకుండా ఉంటాయి. శిరోజాలు చిట్లడానికి చలికాలం అనువైన వాతావరణం కాబట్టి జుట్టు కొసలను తరచూ కత్తిరించుకుంటూ ఉండాలి. జుట్ట రాలడానికి, చిట్లడాన్ని నివారించడంతో పాటు జుట్టు మెరుస్తూ, దట్టంగా పెరగాలంటే అందుకు శీతాకాలంలో ఇంట్లోనే కొన్ని హెయిర్ ప్యాక్స్ ను ప్రయత్నించవచ్చు. మనకు ఇష్టం లేనివి కెమికల్ హెయిర్ ప్యాక్స్ మార్కెట్లో బోలెడెన్ని దొరుకుతున్నాయి. వాటిని ఉపయగించడం కంటే ఇంట్లో తయారు చేసుకొని హెయిర్ ప్యాక్స్ అప్లై చేయడం చాలా సులభం మరియు ఇతర సైడ్ ఎఫెక్ట్ ఏమీ ఉండవు...
పొడి మరియు చిట్లిన(చిక్కుబడిన) జుట్టు: బాగా పొడిబారిన జుట్టుకోసం బనానా హెయిర్ ప్యాక్ బాగా పనిచేస్తుంది. బనానాలో కొద్దిగా తేనె మరియు నిమ్మరసం కలిపి తలలో చర్మానికి మొదళ్ళకు పట్టే విధంగా అప్లై చేయాలి. అప్లై చేసిన తర్వాత అరగంట అలాగే వదిలేసి తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేయడం వల్ల తల వెంట్రుకలు సున్నితంగా, మంచి షైనింగ్ తో మొరుస్తుంటాయి.
డ్యామేజ్డ్ హెయిర్: జుట్టు మధ్యలోని తెగిపోవడం ఈ సీజన్ లో సహజం. అందుకోసం రెండు గుడ్లను పగులగొట్టి అందలోని పచ్చ సొన మరియు ఒక ఎగ్ వైట్ కలిపి బాగా మిక్స్ చేయాలి ఇప్పుడు అందులో కొద్దిగా తేనె, నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అలాగే మరో గిన్నెలో ఒక కప్పు పెరుగు తీసుకొని తలకు పట్టించి పదిహేను నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి.
స్టాటిక్ హెయిర్: స్టాటిక్ హెయిర్ కోసం చాలా సింపుల్ మార్గం ఉంది. ఈ సీజన్ లో జుట్టు పోషణకు మెంతి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఒక కప్పు మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం నీటితో సహా మెత్తగా పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు పట్టించాలి. ఇది బాగా తడి ఆరిన తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వ్యత్యాసం మీకే తెలుస్తుంది.
నిర్జీవమైన కురుల కోసం: ఒక కప్పులో గోరువెచ్చని నీటిని తీసుకొని అందులో వెనిగర్, తెనె రెండూ సమపాళ్ళలో మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడవం వల్ల కురులకు అధిక శక్తినందిస్తుంది. కురుల పెరుగుదలకు ఉపయోగపడే శక్తినిస్తుంది. అయితే ఈ హెయిర్ ప్యాక్ ను వెంటవెంటనే ఉపయోగించకూడదు. వెనిగర్ ఎక్కువ సేపు తలలో ఇంకడం వల్ల కురులకు చెడు ప్రభావం కలిగిస్తుంది.
హెయిర్ బ్రేకేజ్: ఒక గుడ్డులోని పచ్చసొన మరియు రెండు చెంచాలా తేనె, రెండు చెంచాలా క్యాస్ట్రో ఆయిల్. ఒక బౌల్లో వేసి బాగా మిక్స్ చేసి తలకు పట్టించి ఒక గంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఈ మిశ్రమాన్ని రెగ్యులర్ గా తలకు పట్టించడం వల్ల ఈ వింటర్ సీజన్ లో హెయిర్ బ్రేకేజ్ కాకుండా అరికడుతుంది. కాబట్టి ఈ చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి వింటర్ లో కురులను సంరక్షించుకోండి..

సహజమైన పుదినా మసాజ్ ఆయిల్ ని తయారు చెయ్యడం ఎలా?

మర్దనా లేక మసాజ్ ద్వారా శరీరానికి ఉపశమనం కలుగుతుంది. ఎంతో శక్తిని, ఉత్తేజాన్నితిరిగి మన శరీరం పొందుతుంది. అటువంటి శక్తి ఉన్న మర్దనాకి వాడే నూనె ని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మన అవసరాలకి తగినట్టుగా కొన్ని సుగంధతైలాలని చేర్చడం ద్వారా వాటిలో ఉండే ఔషద గుణాలని మనం పొందవచ్చు. అంతే కాకుండా, మనం ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవడం వల్ల మర్దనా కి వాడే పదార్ధాలు తాజాగా, పరిశుభ్రంగా ఉంటాయి.
how make natural mint massage oil

ఈ వ్యాసంలో మీరు పుదినా లేదా పుదినా రకానికి చెందినా మూళిక (Mentha piperita) యొక్క మర్దనా నూనె ఎలా తయారు చెయ్యాలో తెలుసుకుంటారు. పుదినా నూనెకి ఏకాగ్రతని, జీర్ణవ్యవస్థని పెంపొందించే గుణం ఉంది. కండరాల నొప్పులు, పాదాల నొప్పులు, తల నొప్పి, అజీర్ణం మరియు అపానవాయు సమస్యలు, కడుపు నొప్పి, వికారం, సైనసైటస్, ప్రయాణంలో కదలిక వలిగే అస్వస్థత లు మరియు మాములు జలుబుకు పుదినాలో ఉండే శీతలీకరణ గుణం మరియు ఉత్తేజ పరిచే గుణం వల్ల ఏంతో ఉపశమనం కలుగుతుంది.
తయారు చేసే పద్దతి:
1. పది టేబుల్ స్పూన్ల ద్రాక్ష విత్తనాల నూనె ని ఒక గిన్నెలో కి తీసుకోండి. ద్రాక్ష విత్తనాల నూనె సులభంగా మనకి అందుబాటులో ఉండటమే కాకుండా ఎటువంటి వాసనా కలిగి ఉండకపోవడం ఈ నూనెని మనం ఎంచుకోవడానికి కారణం.
2. నాలుగు చుక్కలు రోజ్ మేరీ నూనె, మూడు చుక్కలు యూకొలిప్టస్ నూనె, రెండు చుక్కలు పుదినా నూనె కలపడానికి ముఖ్యమైన నూనెలు. యూకొలిప్టస్ మరియు పుదినా నుండి వచ్చే సువాసనలకి జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడం మరియు సాధారణ జలుబు ద్వారా కలిగే ముక్కు దిబ్బడకి ఉపశమనం కలిగించే గుణాలు ఉన్నాయి. ఉదయం పూట మర్ధనాకి ఈ మిశ్రమం చాలా ఉపయోగపడుతుంది. చర్మంలోని నిగారింపు పెంచడానికి, మనస్సుని ఉత్తేజపరచడానికి, కండరాల మర్ధనాకి ఏంతో సహాయపడుతుంది. ఎన్నో రకాల ఆరోగ్య సమస్యల నుండి రక్షించే గుణం పుదినాకి ఉంది.
3. ద్రాక్ష విత్తనాల నూనె కి ఈ మిశ్రమాన్ని బాగా కలపండి. తయారైన పుదినా మర్దనా నూనె ని ఒక ముదురు రంగు గాజు సీసాలో పోయండి. నూనె త్వరగా ఆక్సీకరణ చెందకుండా ఉండేందుకు ముదురు రంగు గాజు సీసా ఉపయోగపడుతుంది.
4. అవసరమైన చోట మర్దనా కి ఈ నూనెని వాడండి.
5. పిల్లల నుంచి దూరంగా ఈ నూనె ని భద్రపరచండి. వెలుతురు లేని ప్రదేశంలో, చల్లగా ఉండే చోట ఈ నూనె ని భద్రపరచండి.
6. మీరు ఈ నూనెని నాలుగైదు సార్లు ఉపయోగించవచ్చు. వృధా చెయ్యకుండా మీరు దీనిని మొదటిసారే ఎంతైనా మర్ధనాకి వాడుకోవచ్చు.
7. విశ్రాంతి పొందడానికి మర్దనా ని ఏంతో మంది కోరుకుంటారు. అంతే కాదు మర్దనా ద్వారా ఆనందం కూడా పొందుతారు. ఎంతో సులభమైన పద్దతిలో తయారుచేసుకోబడిన ఈ నూనె ని మర్ధనాకి ఉపయోగించి ఆనందంతో పాటు ఆరోగ్యం కుడా పొందండి.

ఆంధ్రా స్టైల్ స్పైసీ ఖీమా ఫ్రై - సండే స్పెషల్

ఖీమా ఫ్రై, డ్రై సైడ్ డిష్. వివిధ ప్రదేశాల్లో వివిధ రకాలుగా తయారు చేస్తారు. కాబట్టి ఆంధ్రా స్టైల్లో ఖీమా ఫ్రై ఎలా తయారు చేస్తారో ఇక్కడ ఇస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రాస్టైల్ వంటలకు కొంచెం ప్రత్యేకత ఉంది. అదేమిటంటే కారంగా ఉంటాయి. ఎక్కువ మసాలాలు దట్టించడంతో ఆ స్పైసీ రుచులు అద్భుతమైన టేస్ట్ తో, ఘుభాళిస్తుంటాయి. ఈ ఖీమా ఫ్రై ప్రత్యేకత ఏమిటంటే ఇందులో మెంతి ఆకులను చేర్చడంతో మరో అద్భుతమైన టేస్ట్ ను కలిగి ఉంటుంది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కాబట్టి ఈ ఖీమా ఫ్రైను ఎలా తయారు చేయాలో చూద్దాం....
andhra style kheema fry sunday special

కావల్సిన పదార్థాలు:
మృదువైన గొర్రె మాంసం లేదా ఖీమా: 500gms
పసుపు: 1tsp
కరివేపాకు ఆకులు: 10
ఉల్లిపాయ: 1(chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
పచ్చిమిర్చి: 4 (chopped)
టమోటో: 1 (chopped)
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
గరం మసాలా: 1/2tsp
మెంతులు కొన్ని లేదా మెంతి ఆకులు: 1cup (without stems)
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2sprigs (chopped)
తయారు చేయు విధానం:
1. ముందుగా ఖీమాను శుభ్రం చేసి అందులో కొద్దిగా ఉప్పు, పసుపు, ఒక కప్పు నీళ్ళు వేసి కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. అంతలోపు స్టౌ మీద పాన్ పెట్టి అందులో కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
3. తర్వాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు వేసి తక్కువ మంట మీద రెండు మూడు నిముషాలు వేగనివ్వాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో ఐదు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు టమోటో ముక్కలను, రుచికి సరిపడా ఉప్పు, కారం, ధనియాలపొడి వేసి బాగా కలుపుతూ ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. ఈ వేపుడు అంతా బాగా వేగిన తర్వాత అందులో ఉడికించి పెట్టుకొన్న ఖీమాను పోయాలి.
5. వేపుడులో నీరంతా ఇమిరి పోయి, పొడిపొడిగా తయారయ్యేంత వరకూ వేయించాలి.
6. ఇప్పుడు అందులోనే మెంతి ఆకులు, గరం మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మరో పది నిముషాలు తక్కువ మంట మీద ఉడికించుకోవాలి. అంతే ఆంధ్రా స్టైల్ ఖీమా ఫ్రై రెడీ దీనికి కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి. దీన్ని రోటీ లేదా సాంబార్ రైస్ సైడ్ డిష్ గా తినవచ్చు.

స్పైసీ చికెన్ తంగ్డి కబాబ్

చికెన్ మాసాంహార రుచిల్లో చాలా పాపులర్. చికెన్ తో చేసే ఏ వంటైనా సరే నోరూరించాల్సిందే. గ్రేవీ, కర్రీ, ఫ్రై, కబాబ్స్ ఇలా... కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో చేయడం తక్కువే. తంగ్డి చికెన్ కబాబ్ చూడటానికి జ్యూసీగా ప్లేట్ మీల్ లా ఉంటుంది. దీన్ని చూడగానే ఎవ్వరికైనా సరే నోట్లో నీరూరాల్సింది. ఫ్యామిలీ మెంబర్స్ ను, ఫ్రెండ్స్ ను టెంప్ట్ చేసే ఈ చికెన్ తంగ్డి కాబాబ్ మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది. మారినేషన్ తయారు చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...
delicious tangri chicken kebab

కావలసిన పదార్థాలు:
చికెన్‌ డ్రమ్‌స్టిక్స్‌(తొడలు): 8
అల్లంతురుము: 4tsp
వెల్లుల్లితురుము: 6tsp
పండుమిర్చిపేస్ట్: 2tsp
కారం: 2tsp
కొత్తిమీర తురుము: 4tsp
మిరియాలపొడి: 1tsp
గరంమసాలాపొడి: 2tsp
పసుపు: 1/2tsp
నీళ్లు లేకుండా పొడివస్త్రంలో వడకట్టిన పెరుగు: 4tsp
మొక్కజొన్నపిండి: 4tsp
శెనగపిండి: 100grms
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. చికెన్‌ తొడలకు పదునైన కత్తితో గాట్లు పెట్టుకోవాలి.
2. తరవాత అల్లం, వెల్లుల్లి పట్టించాలి.
3. ఓ చిన్న పాత్రలో మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని డ్రమ్‌ స్టిక్స్‌ కు దట్టంగా పట్టించి ఓ గంటసేపు అలా ఉంచాలి.
4. తర్వాత ఒక పాన్ లో నూనె పోసి, కాగాక చికెన్‌ డ్రమ్‌ స్టిక్స్‌ ను బాగా వేయించి తీయాలి.
5. చివరగా ఉల్లిముక్కలు, నిమ్మముక్కలతో గార్నిష్ చేస్ సర్వ్ చేయాలి అంతే...

పిల్లలకు ఇష్టమైన ఆనియన్ చిల్లీ దోసె

మీ పిల్లలు బ్రేక్ ఫాస్ట్ చేయకుండా మారాం చేస్తున్నారా?అయితే ‘మమ్మీస్ క్లబ్ లో జాయిన్ అయిపోండి'. బ్రేక్ ఫాస్ట్ అనేది పెద్దలకు మాత్రమే కాదు పిల్లలకు కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే రోజంగా హుషారుగా ఉండాలంటే పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి. కాబట్టి వారు బ్రేక్ ఫాస్ట్ తినకుండా తప్పించుకోకుండా చూడాల్సిన బాధ్యత పెద్దవారిదే. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినడానికి మంచి బ్రేక్ ఫాస్ట్ ను ఎలా తయారు చేయాలని ఆలోచిస్తున్నారా..?చిల్లీ దోసె పిల్లలకు ఇష్టమైన బ్రేక్ ఫాస్ట్ ముఖ్యంగా ఇందులో పచ్చిమిర్చి, క్యాప్సికమ్ వేయడం వల్ల దీన్ని చిల్లీ దోసె అంటాం. ఈ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలకు ఇష్టమైన చట్నీతో అందించండి...
chilli dosa recipe kids

దోసె పిండి: 2 cups(100 grams)
ఉల్లిపాయ: 1(chopped)
క్యాప్సికమ్: 1 (chopped finely)
టమోటో: 1 (chopped finely)
పచ్చిమిర్చి: 2 (chopped finely)
కొత్తిమీర తరుగు: 2 sprigs (chopped)
సోయా సాస్: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా తయారు చేసుకొన్న దోసె పిండిలో లేదా మిగిలిన దోసె పిండిలో పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగును వేసి బాగా మిక్స్ చేయాలి.
2. తర్వాత దోసె పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తర్వాత అందులో చేతి నిండుగా ఉల్లిపాయ ముక్కలు వేసి రెండు మూడు నిముషాలు వేయించాలి.
3. అందులోనే క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి బాగా వేగించాలి.
4. దాని తర్వాత కట్ చేసిని టమోటో ముక్కలను, సోయా సాస్ ను కూడా వేసి ఒక నిముషం తర్వాత పచ్చిమిర్చి, కొత్తిమీర తరుగుతో కలిపి పెట్టుకొన్న దోసె పిండిని దోసెలా పాన్ మొత్తం పోయాలి.
5. దోసె పిండి మీద మరికొంత ఆయిల్ వేయడం వల్ల కరకరలాడుతూ దోసె బ్రౌన్ కలర్ లో కాలుతుంది. మీడియం మంట మీదు మూడు నాలుగు నిముషాలు ఫ్రైచేసి తర్వాత తీసేయాలి. దీన్ని ఏదైనా చట్నీతో పిల్లలకు బ్రేక్ ఫాస్ట్ గా అందించడం వల్ల చాలా ఇష్టంగా తింటారు.

Saturday, December 8, 2012

ఎంఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు

 

ఎంటెక్ (క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
-శివ, నల్గొండ.
ఎంటెక్ (క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సు పూర్తి చేసిన వారికి హాస్పిటల్స్, మెడికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీలు, డయోగ్నస్టిక్ సెంటర్లు, బయో మెడికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్స్‌లో అవకాశాలు ఉంటాయి. వీరు ఆస్పత్రుల్లో, మెడికల్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉపయోగించే పరికరాల నిర్మాణ-నిర్వహణ,వినియోగం సంబంధిత విభాగాల్లో విధులు నిర్విహ స్తుంటారు. ఎంటెక్(క్లినికల్ ఇంజనీరింగ్) కోర్సులో బయో మెటీరియల్స్,మాలిక్యులర్,సెల్ బయాలజీ, బయో మెకానిక్స్, ఫంక్షనల్ అనాటమీ, ఫిజియాలజీ, బయో మెడికల్ ఇమేజింగ్ సిస్టమ్స్, మెడికల్ డివైజ్ టెక్నాలజీ, క్రిటికల్ కేర్ ఇన్‌స్ట్రుమెంటేషన్ వంటి టాపిక్స్ ఉంటాయి.

ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
వివరాలకు: www.iitm.ac.in
క్రిష్టియన్ మెడికల్ కాలేజ్ (సీఎంసీ)-వెల్లూరు
వివరాలకు: www.cmchvellore.edu

న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
-రవి, మిర్యాలగూడ.
న్యూక్లియర్ ఫిజిక్స్ కోర్సు పూర్తి చేసిన వారికి.. పరిశోధన రంగంలో పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. వీరు న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, వేస్ట్ మేనేజ్‌మెంట్, ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధిత పరిశ్రమలలో మెడికల్ ఫిజిక్సిస్ట్, రేడియోగ్రాఫర్ వంటి హోదాల్లో స్థిర పడొచ్చు. అమెరికా, యూరప్‌లలో కూడా అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-కాన్పుర్
వివరాలకు: www.iitk.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
కోర్సు: ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్)
అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్,ఫిజిక్స్)
ప్రవేశం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా.
వివరాలకు: www.andhrauniversity.info
యూనివర్సిటీ ఆఫ్ పుణే-పుణే
కోర్సు: ఎంఎస్సీ(ఫిజిక్స్-న్యూక్లియర్ టెక్నిక్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా).
అర్హత: బీఎస్సీ(ఫిజిక్స్/ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్). సంబంధిత బ్రాంచ్‌లో బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే.
ప్రవేశం: వర్సిటీ నిర్వహించే రాత పరీక్ష ఆధారంగా.
వివరాలకు:www.unipune.ac.in
మద్రాస్ యూనివర్సిటీ
కోర్సు: ఎంఎస్సీ(న్యూక్లియర్ ఫిజిక్స్)
వివరాలకు: www.unom.ac.in

ఎంఎస్సీ(ఎన్విరాన్‌మెంటల్ సైన్స్)కోర్సును అందిస్తున్న యూనివర్సిటీలేవి?
-బాబు, తుని.
ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ పరిశ్రమలు, ప్రభుత్వ సంస్థల్లో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రధానంగా ఆటోమొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, అగ్రికల్చర్, ఫెర్టిలైజర్స్, టెక్స్‌టైల్స్, మైనింగ్, ఫార్మాస్యుటికల్, కెమికల్ పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలను దక్కించుకోవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, పర్యావరణ సంస్థలు, అర్బన్ ప్లానింగ్, వాటర్ కన్జర్వేషన్ వంటి ప్రభుత్వ సంస్థలతోపాటు వివిధ ఎన్‌జీఓలు, వివిధ పరిశోధన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి.

ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం.
వెబ్‌సైట్: www.andhrauniversity.info
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.svuniversity.in

మన రాష్ట్రంలో ఎంఎస్సీ(హోమ్ సైన్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న వర్సిటీలేవి?
- రవి, నిర్మల్.
హోమ్ సైన్స్ కోర్సు చేసిన అభ్యర్థులకు ఫుడ్ ఇండస్ట్రీ, రెస్టారెంట్, హోటళ్లు, రిసార్‌‌ట్స, టూరిజం సంబంధిత సంస్థల్లో ప్రొడక్షన్, సర్వీసెస్ విభాగాల్లో అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా వివిధ ఆహార ఉత్పత్తులకు సంబంధించిన పరిశ్రమల్లో న్యూట్రిషన్ కన్సల్టెంట్లుగా, రీసెర్చ్ అసిస్టెంట్లు, ఫుడ్ సైంటిస్టులు, ఫుడ్ అనలిస్ట్‌లుగా కూడా స్థిర పడొచ్చు. ఫుడ్ ప్రొడక్ట్స్, బేబీ ఫుడ్స్, రేడీ టూ కుక్‌ఫుడ్ వంటి ఉత్పత్తులకు చెందిన సేల్స్ విభాగంలో కూడా వీరికి అవకాశాలు ఉంటాయి.
ఆఫర్ చేస్తున్న వర్సిటీలు:
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి.
వెబ్‌సైట్: www.svuniversity.in
ఆచార్య ఎన్‌జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.angrau.net
శ్రీ సత్యసాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ - అనంతపూర్ క్యాంపస్.
వెబ్‌సైట్: http://sssihl.edu.in

ఎంఎస్సీ (డెయిరీ సైన్స్) కోర్సు అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి?
- నవీన్, విశాఖపట్నం.
డెయిరీ సైన్స్ కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులకు డైరీ ఫార్మ్స్, కో-ఆపరేటివ్ ఆర్గనైజేషన్స్, రూరల్ బ్యాంకులు, పాల ఉత్పత్తుల సంబంధిత పరిశ్రమల్లో డైయిరీ టెక్నాలజిస్ట్‌గా అవకాశాలు ఉంటాయి. మిల్క్ ప్లాంట్, ఐస్‌క్రీమ్ వంటి యూనిట్లకు కన్సల్టెంట్‌గా కూడా సేవలందివచ్చు.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: www.vetversitytirupati.gov.in
శామ్ హిగ్గిన్‌బాథమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్, టెక్నాలజీ అండ్ సైన్స్-అలహాబాద్.
వెబ్‌సైట్: www.aaidudec.org
ఇందిరాగాంధీ అగ్రికల్చర్ యూనివర్సిటీ, రాయ్‌పూర్-ఛత్తీస్‌గఢ్.
వెబ్‌సైట్: www.igau.edu.in


బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సుల వివరాలు?
- శ్రీకాంత్, తిరుపతి.
బ్యాంకింగ్ స్పెషలైజేషన్‌తో మేనేజ్‌మెంట్ కోర్సును చేసిన వారికి వివిధ బ్యాంకులు రిక్రూట్‌మెంట్‌లో ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఒక బ్యాంక్‌ను ముందంజలో ఉంచేందుకు ఒక ఎగ్జిక్యూటివ్‌కు కావల్సిన నాలెడ్జ్, అనుసరించాల్సిన వ్యూహాలు, తదితర అంశాలను ఈ కోర్సులో బోధిస్తారు. కోర్సు పూర్తి చేసిన వారికి వివిధ బ్యాంక్‌లలో ఎగ్జిక్యూటివ్, మేనేజీరియల్ స్థానాల్లో అవకాశం ఉంటుంది.

ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్.
కోర్సు: పీజీ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్
అర్హత:50శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం:క్యాట్/మ్యాట్/ఏటీఎంఏ/ఎక్స్‌ఏటీ/జీమ్యాట్ స్కోర్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల కు నిర్వహించే గ్రూప్ డిస్కషన్,ఇంటర్వ్యూ ద్వారా

వివరాలకు: www.ipeindia.org
సింబయాసిస్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్-పుణే
కోర్సు: ఎంబీఏ(బ్యాంకింగ్ మేనేజ్‌మెంట్)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వివరాలకు: www.ssbm.edu.in
అమిటీ స్కూల్ ఆఫ్ ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ అండ్ అక్చూరియల్ సైన్స్-నోయిడా
కోర్సు: ఎంబీఏ(ఇన్సూరెన్స్ అండ్ బ్యాంకింగ్)
అర్హత:50శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ
ప్రవేశం: క్యాట్/మ్యాట్/ఇన్‌స్టిట్యూట్ నిర్వహించే రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా
వివరాలకు: www.amity.edu/asias

క్షణిక వైరాగ్యం-kids story

 
ఒకరోజు మిట్టమధ్యాహ్నం ఒక ముసలాయన పెద్ద కట్టెల మోపును మోసుకువస్తున్నాడు. అసలే వార్ధక్యం పైగా బలహీనుడు. ఎండ మండిపోతున్నది. నెత్తిమీది బరువు భారంగా ఉన్నది. అందుకే అతనొక చెట్టునీడకు చేరాడు. మోపు కింద పడేసి చతికిలపడ్డాడు.

అప్పటివరకూ బరువును మోయడంతో ఆయాసపడ్డాడు. ఇక కట్టెల మోపును మోయలేననిపించింది. ఎవరైనా కనపడితే బావుణ్ణనుకున్నాడు. అటూ ఇటూ చూశాడు, ఎవరూ కనపడలేదు. ఎండ మాత్రం మరింత మండిపోతోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇంటికి త్వరగా వెళ్లాలనుకున్నాడు. దానికి తోడు విపరీతమైన ఆకలి, దాహం! దాంతో చాలా బాధపడ్డాడు. ‘పాడు జీవితం’ అనుకున్నాడు.

ఆ కోపంతో ‘ఓ మృత్యుదేవతా, వచ్చి నన్ను తీసుకుపో! ఈ ఎండకీ, వేడికీ తాళలేకపోతున్నాను’ అని గట్టిగా అరిచాడు. అంతే! మరుక్షణం నిజంగానే యమధర్మరాజు ప్రత్యక్షమయ్యాడు. ముసలాయన ధర్మరాజును చూసి భయంతో వొణికిపోయాడు.
‘‘ఎవరు నువ్వు?’’ అని అడిగాడు భయంగా చూస్తూ.

‘‘నేను యమధర్మరాజుని. నువ్వేగా పిలిచావ్. చచ్చిపోతానన్నావుగా. మరి వస్తావా? తీసికెళతా’’ అన్నాడు.

‘‘అయ్యో నాకు చావాలని లేదు. కాకపోతే ఈ కట్టెలభారం భరించలేక అలా అన్నానంతే. మంచి సమయానికి ప్రత్యక్షమయ్యావ్.. ఈ కట్టెలమూటను ఇంటివరకూ తెస్తావా?’’ అని ఆశగా అడిగాడు ముసలతను.
ఎదుటివారిని మార్చాలని కాకుండా తమను తాము ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి.- టాల్‌స్టాయ్

అందమె ఆనందం

బాదంపప్పును రాత్రి నీళ్లలో నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్ చేయాలి. దీంట్లో మీగడ కలిపి ముఖానికి, కళ్ల చుట్టూ రాసుకోవాలి. వేళ్లతో వలయాకారంగా రుద్దుతూ మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో శుభ్రపరుచుకోవాలి. పొడిబారిన చర్మం మృదువుగా తయారవుతుంది.

‘క్రిష్’ణం వందే నవతరం!

 
 
వెతుకు!
సముద్రాల లోతుల్లో బడబాలనం దొరుకుతుంది.
వెతుకు!
కఠిన గండ శిలల గుండెల్లో నీటి చెమ్మ దొరుకుతుంది.
వెతుకు!
క్రిక్కిరిసిన మూర్ఖుల నడుమ ఒక జ్ఞాని దొరుకుతాడు.
వెతుకు!
సిద్ధాంతాల క్రాస్‌రోడ్ల మధ్య ఒక జీవనపార్శ్వం దొరుకుతుంది.
వెతుకు! ఒక గురువును.
వెతుకు! నీలోని గురువును.
కృష్ణం వందే జగద్గురు! క్రిష్‌ణం వందే జగద్గురు!!
కొందరు సినిమావాళ్లు పల్స్‌ను మాస్‌లో వెతుకుతారు.
క్రిష్.... ఇంకో చోట.
ఇది అతని వెతుకులాట. అతడి అదర్‌సైడ్.


ఇందిర పరిమి, ఎడిటర్, ఫీచర్స్

ఇందిర: చిన్నతనమంతా ఎక్కడ గడిచింది?
క్రిష్: పుట్టి పెరిగిందంతా గుంటూరు. తాతగారు జాగర్లమూడి రమణయ్యగారు పోలీసాఫీసర్. ఆయనకి ఆరుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి. మాది ఉమ్మడి కుటుంబం. మనవళ్లు మనవరాళ్లందరిలోకి నేనే పెద్దవాడినవడంతో తాతగారితో ఎక్కువ అనుబంధం నాకే ఉండేది. ఆయన నాకు పొద్దున్నే న్యూస్‌పేపర్ ఇచ్చి, ఎడిటోరియల్ దగ్గర్నుంచి ప్రతి ఆర్టికల్‌నీ తిరగ రాయించేవారు. ఇక చందమామ పుస్తకం వచ్చిందంటే... పుస్తకమంతా తిరగరాయడమే కాకుండా, ఆయన ఇంటికి వచ్చాక కథలన్నీ వినిపించాలి. నేను కూడా అప్పుడప్పుడు ఉపకథలు రాసి ఆయనకు వినిపించేవాడిని. అవే నాకు ఇప్పుడు ఉపయోగపడుతున్నాయి. ఇక అత్త కృష్ణవేణి... సినిమా చూసి వచ్చాక, పిల్లలందర్నీ మెట్లమీద కూర్చోబెట్టుకుని, టైటిల్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వరకు కథ అంతా చెప్పేవారు. కథ చెప్పే అలవాటు నాకు ఆవిడ దగ్గరనుంచే వచ్చింది. ఇక ఒక బాబాయి హేతువాద పుస్తకాలు తెచ్చేవారు... ఇంకొక బాబాయి తనతోపాటు నన్ను సినిమాలకు తీసుకెళ్లేవారు... నాన్నగారు (జాగర్లమూడి సాయిబాబా) గురించి చెప్పాలంటే... ఆయనకు సినిమాలంటే చాలా ఇష్టం. ఒక ఊరిలో సినిమా థియేటర్ రన్ చేసి, వర్కవుట్ కాక వదిలేశారు. అలా... నేను గమ్మత్తయిన వాతావరణంలో పెరిగాను. అంతమంది ఒక్కచోట ఉండడంతో నాకు సమాజాన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేకపోయింది. ఇక నా ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలంటే... టీచరైన మా పెదనాన్న భాస్కరరావు గారు నన్ను బాగా గైడ్ చేశారు. నేనీరోజు ఈ స్థితిలో ఉన్నానంటే వీళ్లందరూ కారణం!

ఇందిర: తర్వాత లైఫ్...
క్రిష్: ఇంటర్ తర్వాత, ఫార్మసీ చదవడానికి విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో జాయినయ్యాను. అక్కడ నాకు ఇంకో ప్రపంచం పరిచయమయ్యింది. ‘‘విజయవాడలో చదవకపోతే ‘శివ’ సినిమా తీసేవాడిని కాదు’’ అని రామ్‌గోపాల్‌వర్మ అన్నట్టు ... విజయవాడలో అంతా గ్రూపిజం! చేరిన రోజున ఓరియెంటేషన్ ప్రోగ్రాంలో ఒకచోట కూర్చున్నవాళ్లం, సెమిస్టర్ అయ్యేసరికి గ్రూపులుగా విడిపోయాం. ఎందుకు గొడవపడతారో ఎందుకు కొట్టుకుంటారో తెలీదు కానీ, ప్రతివాడూ తెలీకుండా ఏదో ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ మెంబర్ అయిపోయేవాడు. ఉమ్మడి కుటుంబంలో కలిసిమెలసి తిరిగిన నాకు ఈ కొట్లాటలు నచ్చలేదు. అనీజీగా ఫీలయ్యేవాణ్ణి... అయినా రెండేళ్లు భరించాను. ఇక లాభం లేదని నాదైన ప్రపంచాన్ని సృష్టించుకున్నాను... పుస్తకాలు చదవడం మొదలుపెట్టాను. రావిశాస్త్రి, తిలక్, శ్రీశ్రీ, వడ్డెర చండీదాస్, బలివాడ కాంతారావు... ఎవరినీ వదల్లేదు. అలా ఇంకో రెండేళ్లు! ఆ తర్వాత జీఆర్‌ఈ, టోఫెల్ రాసి ఎంఎస్ ఫార్మసీ చదువుకోవడానికి అమెరికా వెళ్లిపోయాను.

ఇందిర:సినిమా మీద ఇంట్రస్ట్ ఎప్పుడు మొదలైంది?
క్రిష్: నాకు మొదటినుంచీ పుస్తకాలన్నా, సినిమాలన్నా ఇంట్రస్టే కానీ, అమెరికా వెళ్లాక అది మరింత ఎక్కువైంది. మదర్‌కి, మదర్‌లాండ్‌కి దూరమైనప్పుడు, మనల్ని దగ్గరగా ఉంచగలిగేది పుస్తకాలు, సినిమాలే అనుకుంటా! అందుకే వాటికి మరింత దగ్గరయ్యాను. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి... విజయవాడలో ఉన్నప్పుడు గాంధీనగర్‌లో పాత పుస్తకాలు అమ్మేవాళ్లు. వాటిని నా పాకెట్ మనీతో కొని చదివేవాడిని. అక్కడ నా రూమ్మేట్ సత్యనారాయణకి పుస్తకాల పిచ్చి. ఇంకో రూమ్మేట్ వినోద్‌కి సినిమాల పిచ్చి. వేర్వేరు ప్రాంతాలు... వేర్వేరు కులాలు... కానీ మా కామన్ అంశం పుస్తకాలు, సినిమా! అమెరికాలో కూడా అలాంటి రూమ్మేట్సే దొరికారు. రాజీవ్‌రెడ్డి (గమ్యం ప్రొడ్యూసర్), కాట్రగడ్డ సిద్ధార్థ (సారథి స్టూడియోస్ పాపయ్యగారి అబ్బాయి), శ్యామ్ చింతా, దేవా... నలుగురం సినిమాలు, పుస్తకాల గురించి చర్చించుకునేవాళ్లం. నా ఇంటర్ క్లాస్‌మేట్ కల్యాణ్ (డాక్టర్) కూడా అమెరికా వచ్చాడు. అతను నా కథలు ఎప్పుడు విన్నా ‘నువ్వు సినిమాలు బాగా తీస్తావురా’ అని వెన్నుతట్టేవాడు. అలా నేను ఎక్కడికెళ్లినా నాలాంటి ఆసక్తి కలిగినవాళ్లే నాకు ఫ్రెండ్స్‌గా దొరకడం నిజంగా నా అదృష్టం.

ఇందిర: డెరైక్టర్ కావాలన్న బీజం ఎప్పుడు పడింది?
క్రిష్: ఒక్కోసారి మనకు తెలిసేముందే మన ఫ్రెండ్స్ ‘నువ్వు ప్రేమలో పడ్డావ్... పడ్డావ్’ అంటే నిజంగానే పడ్డానేమో అనుకున్నట్టు, ‘నువ్వు బాగా రాస్తావ్ రాస్తావ్’ అని ఫ్రెండ్స్ అందరూ అంటుంటే ‘నిజంగానే బాగా రాస్తాను’ అన్న ఫీలింగ్ నాలో కూడా మెల్లమెల్లగా కలిగింది. ఆ మైండ్‌సెట్‌తోనే అమెరికాలో ఉన్నప్పుడు ఓ కథ రాశాను... క్యాంపస్‌లో జరిగే స్టోరీ అది. అందరూ బాగుంది అనడంతో దాన్ని అక్కడే సినిమాగా తీయాలని అనుకున్నాను. కానీ వర్కవుటవ్వలేదు. అలా ఒకటిరెండుసార్లు జరగడంతో, ఇక లాభంలేదని ఇండియా వచ్చేసి, సినిమా తీయాలని స్ట్రాంగ్‌గా డిసైడైపోయాను. కానీ సేఫ్‌సైడ్‌గా రాజీవ్‌తో కలిసి ‘ఫస్ట్ బిజినెస్ సొల్యూషన్స్’ అనే కంపెనీ స్టార్ట్ చేశాను. అది బాగా రన్ అవుతున్న టైంలో, బిజినెస్ తనకు అప్పగించి నేను సినిమా ప్రయత్నాలు మొదలెట్టాను.

అదే టైంలో రసూల్ ‘ఒకరికొకరు’ సినిమా తీస్తున్నారు. అసిస్టెంట్ డెరైక్టర్‌గా చేరాను. పేరుకు అసిస్టెంట్ డెరైక్టర్ననే కానీ చేయని పని లేదు... ఆఫీస్‌బాయ్ లేకపోతే టీలు పెట్టి, సర్వ్ చేయడం దగ్గర్నుంచి అన్నీ చేశాను. ఆ అనుభవం బాగానే ఉండింది కానీ, లోపల ఏదో రాయాలని, ఎంతో చెప్పాలన్న తపన! బాలీవుడ్‌కని బయల్దేరాను. ‘అఖండ్ భారత్... బట్ ఇండియా డివెడైడ్’ అనే స్క్రిప్ట్ రాయడం మొదలెట్టాను. అది గాంధీ - గాడ్సేల కథ! ఆ క్రమంలో రిసెర్చ్‌కని పూణే, నాగపూర్, సాంగ్లి... అన్ని ప్రదేశాలు తిరిగాను. ఇక్కడ నేను మీకు ఓ వ్యక్తి గురించి చెప్పాలి... అతను కారు డ్రైవర్ బుజీద్! అతనే నన్ను అన్నిచోట్లకూ తిప్పాడు. ఆ ప్రయాణమంతా నేను - ఏం చదవాలి? ఎవర్ని కలవాలి? ఏం అడగాలి? అని ఆలోచిస్తుంటే, అతను ఎంతసేపూ నేను ఎక్కడ ఆపుతాను? ఏ దాబాలో భోజనం పెట్టిస్తాను? ఏ హోటల్లో స్టే చేస్తాం? అనే ఆలోచించేవాడు. ఇద్దరం కలిసే ప్రయాణిస్తున్నాం.. ఇద్దరం మధ్యలో ఒకేచోట ఆగుతున్నాం.. ఒకేచోటికి రీచ్ అవ్వాల్సిన వాళ్లం.. కానీ, ఇద్దరివీ ఎంత భిన్నమైన ఆలోచనలు? అనిపించేది నాకు.

ఇదిలావుండగా సాంగ్లిలో ఓరోజు ఎంత వెతికినా మినరల్ వాటర్ దొరకలేదు. ఒకటే దాహం! రోడ్డుమీద బోరింగ్ పంపు కనిపించగానే అతను ఆగి తాగేశాడు... నన్ను కూడా తాగమన్నాడు. తాగనన్నాను సరికదా, హెల్త్ గురించి కాస్త జ్ఞానం కూడా ఇచ్చాను. చివరికి అతను ఒక్క మాటన్నాడు - ‘బాటిల్ వాటర్ లేనిదే నడవని జీవితం... అదేం జీవితం సార్’ అని! ఎంతో తెలివైన వాణ్ణనుకుని ఆ ప్రయాణమంతా అతనితో ఎంతో జ్ఞానాన్ని పంచుకున్న నేను, ఒక్కసారిగా అజ్ఞానిగా ఫీలయ్యాను! ఒక్క మాటతో అతను జీవిత సారాన్ని చెప్పేశాడనిపించింది. అందుకే నా ఆలోచనలను మార్చిన వ్యక్తుల జాబితాలో అతను కూడా ఉంటాడు. డ్రైవర్ చెప్పిన ఆ డైలాగ్... అతనితో మరచిపోలేని ఆ ప్రయాణం... నాలో ఎన్నో ఆలోచనలు రేకెత్తించింది. బాలీవుడ్ డ్రీమ్స్‌ని పక్కన పెట్టేసి, హైదరాబాద్ తిరిగి రావాలని నిర్ణయించుకున్నాను. మార్గమధ్యంలో ఉన్నట్టుండి షోలాపూర్‌లో ఆగిపోయి, తెల్లపేపర్లు తెప్పించుకుని, డ్రైవర్‌ను వెనక్కి పంపించేశాను. ఓ చిన్నహోటల్లో బసచేసి, ‘గమ్యం’ స్టోరీ మొదలెట్టాను.

ఇందిర: మంచి సినిమా తీశాక కూడా విడుదలకు ఎందుకంత కష్టపడ్డారు?
క్రిష్: సినిమా అంటే కళాత్మకమైన వ్యాపారం కాదు... వ్యాపారాత్మకమైన కళ! ముందు వ్యాపారం... తర్వాతే కళ. కొన్ని కోట్ల వ్యవహారంలో కొత్త వ్యక్తి అనేసరికి ఆమాత్రం భయం ఉండదా! అంతేకాదు, నా కథను నేనెలా తెరకెక్కించగలనో, నా ఐడియా ఎంత సక్సెస్ అవుతుందో నాకు తెలుసు కానీ బయటివాళ్లకు తెలియదు కదా! అందుకే ఎవరూ ముందుకు రాలేదు. తమ్మారెడ్డి భరద్వాజగారి సాయంతో ఎలాగో దాన్ని బయటికి తీసుకురాగలిగాం. ఆ సినిమా వర్కవుట్ అవ్వకపోతే నేను అమెరికా తిరిగి వెళ్లిపోవాలనేది మా పేరెంట్స్‌తో అగ్రిమెంట్.

ఇందిర: రెస్పాన్స్ చూశాక ఏమనిపించింది?
క్రిష్: దేవి థియేటర్లో సినిమా చూడ్డానికి వెళ్లినప్పుడు సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు వేసిన ఈలలు, కొట్టిన చప్పట్లు సంగతి పక్కన పెట్టి, ఒక సంఘటన గురించి చెప్తాను. సినిమా అయిపోయాక నేను, హరి అనుమోలు గారు బయటికి వస్తున్నాం. అప్పుడు నేను తిరుపతి మొక్కు తీర్చుకుని గుండుతో ఉన్నాను. ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. పక్కనుంచి వెళ్తూ ఓ ప్రేక్షకుడు - ‘వీడెవడో భలే తీశాడ్రా సినిమా... పుస్తకాలు తెగ చదివాడ్రా... భలే చెప్పాడ్రా మడిసంటే ఏంటో’ అన్నాడు. ఇప్పటికీ నాకొచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్లలో అదొకటి!

ఇందిర: మీ సినిమాల్లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువుంటాయెందుకు?
క్రిష్: ఎందుకంటే, నేను బయట చూసిన వాటినే సినిమాల్లో చూపిస్తాను కాబట్టి! ఉదాహరణకి గమ్యం సినిమా... దానిలోని పాత్రలు, సన్నివేశాలు చాలా వరకు కల్పించినవి కాదు... నేనెదుర్కొన్న అనుభవాలు! నేనో పెద్ద యాక్సిడెంట్‌కు గురయ్యాను. గమ్యం సినిమా యాక్సిడెంట్‌తోనే మొదలవుతుంది. అందులో గిరిబాబుగారు పేద పిల్లలకు చదువు చెబుతుంటారు. అలాంటి వ్యక్తి నాకు నిజజీవితంలో తెలుసు. పూర్ణచంద్రరావు గారనీ... మా బావగారి కంపెనీలో పని చేసేవారు. ఆయన భార్య కూడా అక్కడే పనిచేసేవారు. భార్య సంపాదనతో చిన్న కుట్టియెస్ట్ రూంలో వుంటూ, ఆయన మొత్తం జీతంతో అనాధ పిల్లలను పెట్టుకుని చదివించేవారు. ఆయన నాకు ఎంత ఇన్‌స్పిరేషన్ అంటే... సినిమాలో ఓ డైలాగ్ పెట్టాను - ‘పూర్ణాగాడి’ ఇల్లెక్కడరా అని ఎవరో అడిగితే, ‘పూర్ణాగాడు కాదురా, పూర్ణ గాడే’ అని! ఆయన దగ్గర చదువుకునే ఒక అమ్మాయి క్యారెక్టరే జానకి. అలాగే, ఆ కథ రాస్తున్నప్పటికి నక్సలైట్లకు, ప్రభుత్వానికి మధ్య చర్చలు నడుస్తున్నాయి. వాటినీ పెట్టాను. అలానే వేదంలో కూడా చాలా క్యారెక్టర్లు ఇన్‌స్పైర్ అయినవే. నిజ జీవిత పాత్రల నుంచి స్ఫూర్తి పొందడం వల్లే ఎమోషన్స్ పక్కాగా, నిజాయితీగా కనిపిస్తాయి.

ఇందిర: సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని నమ్ముతారా?
క్రిష్: ఎందుకు చేయవు... మంచికైనా, చెడుకైనా తప్పకుండా చేస్తాయి. చిన్నప్పుడు... నేను ట్యూషన్ ఎగ్గొట్టి ‘శివ’ సినిమాకి వెళ్లాను. ఇంటికొచ్చాక అందరం కలిసి భోజనం చేస్తుంటే నాన్న ‘సినిమా ఎలా ఉంది?’ అన్నారు. ‘బాగుందట’ అన్నాను నేను. ‘అట ఏమిటి, చూసొచ్చావు కదా’ అన్నారు. ఎవరో చూసి చెప్పేసి ఉంటారని అనుకున్నాను. భయమేసి ఇంకెప్పుడూ అలా చేయను అని ఏడవడం మొదలెట్టా. ఆయన తలమీద మొట్టారు. అయితే తర్వాత తెలిసింది, ఆయన కొట్టింది సినిమాకి వెళ్లినందుకు కాదు, నేను చొక్కా మడత పెట్టినందుకని! చాలా షాకయ్యాను. ఎందుకంటే నాగార్జునలా చొక్కా ఎప్పుడు మడతపెట్టానో నాకే తెలీదు. అలా ఉంటుంది సినిమా ప్రభావం!

ఇందిర:కానీ ‘శివ’ తీసిన వర్మగారే ఓసారి అన్నారు... సినిమాలు చూసి ఎవరూ ప్రభావితం కారని...
క్రిష్: ఆయనలా అనుకున్నారేమో కానీ నేను అలా అనుకోవడంలేదు. ఆయన సినిమా చూసి నేనే సైకిల్ చెయిన్ పట్టుకున్నాను! శక్తిమాన్ చూసి హీరోల్లా ఫీలవుతున్నప్పుడు, సినిమాల్లో పాత్రలు చూసి ఎందుకు నేర్చుకోరు! రివర్స్‌లో... వేదం క్లయిమాక్స్‌లో ఆస్పత్రిలోకి తీవ్రవాదులు నలుగురు వచ్చి కాల్పులు జరిపినట్టు, కొందరు చనిపోయినట్లు సీన్లు పెట్టాను. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే... సినిమా వేరు, సమాజం వేరు కాదు. సమాజంలో జరిగేదే సినిమాలో చూపిస్తాం. సినిమాలో చూపించేవి కొన్నిసార్లు సమాజంలో జరుగుతుంటాయి. ఇరువైపులా ఆ ఇంపాక్ట్ ఎప్పుడూ ఉంటుంది!

ఇందిర: మీ ఇండస్ట్రీకి సంబంధించి అప్పుడప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూ ఉంటుంది కదా... వాటిల్లో కలుగజేసుకుంటారా?
క్రిష్: (నవ్వుతూ) తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అని చిన్నప్పుడు చదువుకున్నాను... అందుకే అనవసరమైన విషయాల్లో తలదూర్చను, కామెంట్లు చేయను.

ఇందిర:కానీ మీలాంటి వాళ్లు కూడా మాట్లాడకపోతే ఎలా?
క్రిష్: అసలు మనకు వాక్ స్వాతంత్య్రం ఉందనుకుంటున్నారా? ఫేస్‌బుక్‌లో తమ భావాలను వ్యక్తం చేసినవాళ్లను జైల్లో పెట్టడం స్వతంత్రం అంటారా? అక్కడిదాకా ఎందుకు.. సినిమాలనే తీసుకుందాం... ‘మాలపిల్ల’ లాంటి సినిమా ఇప్పుడు తీయగలమా! తీస్తే జనాలు ఊరుకుంటారా? ఒక ‘మిస్సమ్మ’ను మనమిప్పుడు తీయగలమా? అందులో ‘తన మతమేదో తనది, మన మతమనసలే పడదోయ్’ అన్న ఒక్కపాట చాలదా రభస కావడానికి ఈరోజుల్లో! మిస్సమ్మ తక్కువ సినిమానా? మిస్సమ్మను సెన్సార్ చెయ్యాలా? ఇప్పుడు ప్రజలు చాలా సెన్సిటివ్ అయిపోయారు. సెన్సిటివ్ కూడా కాదు... సెన్సేషనలిజంకు అలవాటుపడుతున్నారు అనాలేమో!

ఇందిర:సిరివెన్నెల గారితో మీకున్న అనుబంధం....
క్రిష్: గురుశిష్యుల సంబంధం ఆనుకోండి... తండ్రీకొడుకులది అనుకోండి; నా ఆలోచనా విధానాన్ని మార్చినవాడనుకోండి... నన్ను మలచినవాడు అనుకోండి; గ్రేట్ థింకర్, ఫిలాసఫర్ అనుకోండి... గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అనుకోండి... ఏదైనా ఆయనే! మొదటిసారి ఆయన్ని కలిసినప్పుడు నేను గమ్యం కథ చెప్పాను... వినగానే ఆయన ‘అరే అబ్బాయి... ఒక మనిషి గురించి చెబుదామని నీకెందుకంత తాపత్రయం...’ అంటూ డిస్కషన్ స్టార్ట్ చేశారు. చివరికాయన ఆ కథ సినిమాకు తగదని, కొన్ని మార్పులు చేయాలని సూచించారు. దాంతో కొన్ని మార్పులు చేసి, 9 నెలల తర్వాత మళ్లీ వినిపించాను. అది ఆయనకు చాలా నచ్చి, ముందుకెళ్లమని చెప్పారు. ఆ క్రమంలోనే ఓసారి నేను ఆయనతో ‘నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవండీ... ఒక్క పాట రాయండి’ అడగ్గానే ఆయన,‘ఇది ఒక మనిషి గురించి ఒక మనిషి చెప్తున్న కథరా... ఆ మనిషి కథ కోసం ఈ మనిషి రాస్తున్న పాటలురా ఇవి’ అంటూ, ఒక్క పాటకాదు... ఆ సినిమాలో అన్ని పాటలు తానే రాస్తానని... వాటికి తను ఒక్క పైసా తీసుకోనని కూడా చెప్పారు. ‘మానవ సంబంధాలే ఆర్థిక సంబంధాలు’ అనుకునేదానికి విరుద్ధంగా ఆ మనిషి ఆరోజు నా దగ్గర నుంచి డబ్బులు తీసుకోకపోవడమే కాకుండా నాకు ఎప్పుడు అవసరమైనా ఎదురు ఇచ్చారు.

సినిమా పూర్తయింది... కొనడానికి ఎవరూ ముందుకు రాలేదు. ప్రివ్యూ వేశాను. మొదట చూసింది ఆయనే. బయటకు రాగానే ఆయన ‘ప్లెబిసైట్ పెట్టొద్దు... సినిమా తీశావు... నాకు చెప్పినదానికన్నా బాగా తీశావు... యువార్ ఎ మేకర్! ఇవ్వాళ నేనొక మాట చెప్తున్నానురా, ఎప్పటికీ గుర్తుంచుకో! నేనొక కోడిని... సూర్యుడిలా నువ్వు వస్తున్నావన్న విషయాన్ని ముందుగా గమనించి కొక్కొరకో అంటూ లోకానికి తెలియచేస్తున్నాను’ అన్నారు. ఆ మాటలు జీవితంలో మరచిపోలేను. ఆ సినిమాలో ఆయన ‘గమనమే నీ గమ్యమైతే, బాటలోనే బ్రతుకు దొరుకు... ప్రశ్నలోనే బదులు ఉంది, గుర్తుపట్టే గుండెనడుగు...’ అని రాశారు. ఆ గుర్తుపట్టిన గుండే సీతారామశాస్త్రిగారు!

ఇందిర: గురువు అవసరం లేనట్టుగా ‘నీకు నువ్వే గురువు’ అన్న డైలాగ్ ‘కృష్ణం వందే జగద్గురుం’లో ఎందుకు పెట్టారు?
క్రిష్:అది ప్రతిసారీ వర్తించదు... మనకు ఒకే గురువు ఉండరు! గురువు అంటే ఎవరు... ఎరుకపరిచేవాడు. తల్లి, తండ్రి, ఆదిశంకరాచార్యులు, జగద్గురువైన కృష్ణుడు... ఇలా మనకెంతమంది గురువులున్నారు? ‘నీకు నువ్వే గురువు’ అన్నదానికి నా ఉద్దేశం... ‘నరుడి లోపల పరునిపై (పరుడు అంటే పరాయివాడని కాదు దేవుడని అర్థం) దృష్టిపరుపగ, తలను వంచి, కైమోడ్చి నీ శిష్యుడవు నీవెతై, నీ ఆర్తి కడతేర్చు నీ ఆచార్యుడవు నీవె’ అని!

ఇందిర: (నవ్వుతూ) ఇంతకీ ఇంకా పెళ్లెందుకు చేసుకోలేదు?
క్రిష్: (నవ్వేసి) ప్రస్తుతం మా అమ్మకు అత్యంత ఆప్తులైన వ్యక్తులు ఎవరంటే మీరే... ఈ ప్రశ్న అడిగినందుకు! బట్ సీరియస్లీ, నాకు భారతీయ వివాహ వ్యవస్థ మీద గొప్ప గౌరవం ఉంది. కానీ, పెళ్లి అనేది పెద్ద విషయం. జీవితాంతం హ్యాపీగా ఉంచగలననుకున్న అమ్మాయికోసం వెయిట్ చేస్తున్నాను.

ఇందిర: ఇన్నాళ్లు ఒక్కళ్లు కూడా దొరకలేదంటారా?
క్రిష్: దొరికీ దొరకనట్టు... కొన్ని స్వయంకృతాపరాధాలతో... కుదరలేదు!

ఇందిర: కమిట్ అవ్వడానికి భయపడి కాదుకదా?
క్రిష్: కాదు... రైట్ పర్సన్‌తో కమిట్ అవ్వడానికి!

ఇందిర: మీరలా అనగానే నాకొక బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సేయింగ్ గుర్తొచ్చింది... ‘డోంట్ మ్యారీ సమ్ వన్ యు కెన్ లివ్ విత్... బట్ మ్యారీ సమ్‌వన్ హు యు కెనాట్ లివ్ వితౌట్’ (జీవితాంతం కలిసి బతకగలనని అనుకునేవాళ్లని కాదు పెళ్లి చేసుకోవాల్సింది... ఎవరు లేకపోతే నువ్వు జీవితంలో బతకలేవో వాళ్లని చేసుకో) అని!
క్రిష్: యాబ్సల్యూట్లీ ట్రూ! అందుకే ఈ వెయిటింగ్!

నేను పక్కా మాస్...

మీరు ఎప్పటికీ తీయలేను అనుకునే సినిమా...
క్రిష్: ఈగ, అరుంధతి. అలాంటి సినిమాలు తీయడానికి దమ్ముండాలి! అది రాజమౌళికి, శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి లాంటి ఫిల్మ్‌మేకర్స్‌కే సాధ్యం!

ఫేవరెట్ డెరైక్టర్..
క్రిష్: ద గ్రేట్ డెరైక్టర్ రాజ్‌కపూర్! ‘జిస్ దేశ్‌మే గంగా బెహతీ హై’ వందసార్లయినా చూసుంటాను.

మిస్ అవ్వాలనుకోని టీవీ షో...
క్రిష్: ప్రస్తుతం స్టార్ వరల్డ్‌లో ప్రసారమయ్యే ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’... ఒక సింహాసనం కోసం కొట్టుకునే షో... చాలా ఎగ్జైటింగ్‌గా ఉంటుంది.

జాతకాలు నమ్ముతారా...
క్రిష్: చెప్పించుకోను కానీ, నమ్ముతాను, చదువుతాను.

మీ గురించి ఎదుటివారు తప్పుగా అనుకునేది...
క్రిష్: తెలివైన వాణ్ణని, క్లాస్ డెరైక్టర్నని! కానీ, నేను పక్కా మాస్! లేకపోతే గాలి శీను, కేబుల్ రాజు, బిటెక్ బాబులు లాంటి క్యారెక్టర్లు పుట్టవు.

చూడగానే మనిషిలో నచ్చేవి...
క్రిష్: ఇంటలిజెన్స్, కాన్ఫిడెన్స్!

మీరు అన్నీ చెప్పుకునే వ్యక్తి..
క్రిష్: మా బావ బీబో శ్రీనివాస్. నా గురించి తనకు పూర్తిగా తెలుసు.

దేవుడంటే భయమా, భక్తా..?
క్రిష్: ఇష్టంతో కూడిన భక్తి. ప్రతి పుట్టినరోజుకి తిరుపతి వెళ్తాను. రెగ్యులర్‌గా గుడికి వెళ్తుంటాను.

మీలో నచ్చేవి/నచ్చనివి?
క్రిష్: చాలా మొండివాడ్ని. ఏదైనా చేద్దామనుకుంటే చేసి తీరతాను. అంతేకాదు, ఎమోషనల్ కూడా! ఈ రెండూ నా మైనస్‌లు. అయితే, అవే నా ప్లస్‌లు కూడా! ఎందుకంటే, అవి లేకపోతే గమ్యం తీసుండేవాడిని కాదు.

వీళ్లు లేకపోతే నేను లేను అనుకునేవాళ్లు... పర్సనల్లీ, ప్రొఫెషనల్లీ?
క్రిష్: పర్సనల్లీ... ముందు తల్లిదండ్రులు, తర్వాత స్నేహితులు. ప్రొఫెషనల్లీ... సీతారామశాస్త్రిగారు. ఆయన లేకపోతే నా గమ్యం ఇలా ఉండేది కాదు.

ఫ్రీ టైమ్ ఎలా గడుపుతారు?
క్రిష్: పుస్తకాలు చదువుతాను, వాలీబాల్ ఆడతాను, ఫ్రెండ్స్‌తో కాఫీషాప్స్‌కి వెళ్తాను..

దేనికి భయపడతారు?
క్రిష్: ప్రేమించేవాళ్లు దూరమవుతారేమో అన్న భయం తప్ప ఇంకే భయాలూ లేవు.

కోపం...
క్రిష్: ఒకప్పుడు బాగా ఉండేది... సెల్‌ఫోన్లు అవీ విసిరికొట్టేవాడ్ని. అయితే ఇప్పుడు చాలా తగ్గిపోయింది. ఎప్పుడైనా వచ్చినా 30 సెకన్లకన్నా ఉండదు.

సారీ చెప్పాల్సిన వ్యక్తులు, సందర్భాలు...
క్రిష్: మా గురువుగారు సీతారామశాస్త్రి గారికి!
‘...అమేయం అనూహ్యం అనంత విశ్వం
ఆ బ్రహ్మాండపు సూక్ష్మస్వరూపం... ఈ మానుషరూపం
కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే... అల్పప్రమాణం
ముజ్జగాలను మూడడుగులతో కొలిచే తైవిక్రమ విస్తరణం...’
అంటూ రాసిన అద్భుతమైన దశావతార రూపకాన్ని... 12 నిమిషాల నిడివి వుందని, అంత పెద్ద పాటను ప్రేక్షకులు వినరేమోనన్న అజ్ఞానంతో, మూర్ఖత్వంతో... శాస్త్రిగారు, మణిశర్మగారు ఎంత పట్టుపట్టినా వినకుండా... తొమ్మిదిన్నర నిమిషాలకు కుదించాను. దశావతార రూపకమైనా, దేవుని గురించి కాకుండా, ఒక మనిషి గురించి రాసిన అంత గొప్ప సాహిత్యాన్ని కిల్ చేసినందుకు ఆయనకు క్షమాపణ చెప్పుకుంటున్నాను. అంతేకాదు, మిగతాదంతా బాలు గారిచేత మళ్లీ పాడించి, దాన్ని షూట్‌చేసి, ఒక బ్యాలేగా రిలీజ్‌చేసి ఆ తప్పుని సరిదిద్దుకోవాలని కూడా అనుకుంటున్నాను..

మరచిపోలేని రోజు...
క్రిష్: గమ్యం సినిమాకు డెరైక్టర్‌గా నేను, ప్రొడ్యూసర్‌గా నాన్న... ఒకే స్టేజి మీద ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నాం. అలానే ‘వేదం’కి షోబు, నేను, అనుష్క, అల్లు అర్జున్ - నలుగురం నాలుగు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నాం. అవి నేను మరచిపోలేని రోజులు!

అందరూ మిమ్మల్నెలా గుర్తుపెట్టుకోవాలనుకుంటారు?
క్రిష్: మంచి కథకుడిగా, మంచి వ్యక్తిగా, ‘వాడి పనేదో వాడు చేసుకుపోయాడు... ఎవ్వరికీ చెడు చెయ్యలేదు’ అనుకునేలా!

మీరు నిత్యం వల్లించే వేదం...
క్రిష్: నిన్న అనేది లేదు... అనుభూతుల సారం మాత్రమే దాచుకోగలం. అందుకే, సీజ్ ద మూమెంట్! ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి!

మీ గమ్యం...
క్రిష్:జీవితానికి పరమార్థం ఏముంటుంది... మంచిగా జీవించడమే! మా గురువుగారు చెప్పినట్టు... గమనమే గమ్యం!

ప్రిపరేషన్‌లో ఫెయిలైతే ఫెయిలవడానికి ప్రిపేరవ్వండి!

నన్ను అత్యంత ప్రభావితం చేసినవి తిలక్ రచనలు. ‘నా ఆశయాలేమో అభ్యుదయ దీపికలు... నా అక్షరాలేమో వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలు’ అన్న ఆయన సిద్ధాంతమే నా సినిమా సిద్ధాంతం కూడా!

చలం తెలుగులోకి అనువదించిన రవీంద్రనాథ్ టాగూర్ ‘గీతాంజలి’లోని - ‘శివా నువ్వు ఎక్కడున్నావయ్యా అని మొత్తం వెతుకుతుంటే.. దేశ దేశాలు తిరిగివచ్చిన తర్వాత అర్థమయింది... నువ్వు నా హృదయాంతరంగాలయంలో కొలువై ఉన్నావని’ అన్న మాటలు నాకు గొప్ప స్ఫూర్తి! గుంటూరు - హైదరాబాద్ (వయా) అమెరికా, బాంబే... ప్రయాణం చేయకపోయుంటే నాకు జీవితమంటే ఏంటో అర్థమయ్యేది కాదు!

శ్రీరమణగారు ఓచోట - ‘మనిషి జిరాఫీగా మారుతున్నాడు... హృదయానికీ మెదడుకీ మధ్య దూరం రోజురోజుకీ పెరుగుతోంది’ అన్నారు. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నాలో కూడా ఆ దూరం ఎక్కువే ఉన్నా, ఒకప్పటికన్నా తగ్గింది... థ్యాంక్స్ టు సినిమా!

ఎవరైనా నన్ను ‘ఎందుకు అన్నన్ని రాస్తావు, అంత టైం తీసుకుంటావు‘ అని అడిగితే...నేను చెప్పే సమాధానం ఒక్కటే... ‘ఇఫ్ యువార్ ఫెయిలింగ్ టు ప్రిపేర్... యు షుడ్ బి ప్రిపేర్డ్ టు ఫెయిల్’ (ప్రిపరేషన్‌లో ఫెయిలైతే ఫెయిలవడానికి ప్రిపేరవ్వండి).

రామ్‌గోపాల్‌వర్మ ‘శివ’ తీశారు... ఆయనే ‘ఆగ్’ కూడా తీశారు. అయితే అది సరైన కంటెంట్ కాదు. సరైన స్క్రిప్ట్ దొరికితే మళ్లీ ఆయన మొనగాడు డెరైక్టరే! అందుకే అంటారు - ‘వియ్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ అవర్ కంటెంట్’ అని!

చిన్నారుల మీద లైంగిక వేధింపులు చేసే టీచర్లున్నారు... పేషెంట్ల మీద అరాచకం చేసే డాక్టర్లున్నారు... బ్లాక్‌మెయిల్ చేసే మీడియా సంస్థలున్నాయి... లంచాలిచ్చి బతికే సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయి... ఇలా ఎన్ని లేవు! మేం ఆడియన్స్‌కి లంచమిచ్చి సినిమాలు చూపించగలమా? లైంగిక సంబంధాలు మా ఒక్క ఇండస్ట్రీలోనే ఉన్నాయా... బయట లేవా? సినిమావాళ్లం భూతద్దాల మేడల్లో బతుకుతున్నాం కాబట్టి అందరికీ కనిపిస్తాం కానీ, నా దృష్టిలో ఎన్నో విషయాల్లో సినిమా ఇండస్ట్రీనే అన్నిటికన్నా బెటర్! ఆర్ద్రత, తపన, అన్నిటికంటే ముఖ్యంగా... ఒక్క ‘బాగుంది’ అనే పదం కోసం తహతహలాడతాం!

కసబ్ అనేవాడు ఒక ఆయుధం మాత్రమే! అతన్ని ఉరితీసి ఇక్కడ అందరం చంకలు గుద్దుకుంటున్నాం కానీ, 26/11 రోజు కసబ్ కూడా చనిపోయి వుంటే, ఎవరిని బాధ్యులను చేసేవాళ్లం? అసలు ఆ ఆయుధాన్ని ప్రయోగించినవాళ్లెవరు? ఆ మూలాలను నిర్మూలించడానికి మనం ఏం చేస్తున్నాం?

ఎన్నాళ్లు సినిమాలు తీయగలిగితే అన్నాళ్లు తీస్తా! వీలు కుదిరితే నాకిష్టమైన పుస్తకాలు కూడా రాస్తాను. ఇష్టముంటే డాక్యుమెంటరీలు కూడా తీస్తాను. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే అయామ్ ఎ స్టోరీ టెల్లర్!!

చట్టానికి కళ్లు లేవా?

 
పశ్చిమ దేశాల పెద్దలు న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో త్రాసుతో నిల్చుని ఉన్నట్లు ఏనాడో చిత్రీకరించారు. ఇప్పటికీ అదే చిత్రం వాడికలో ఉంది
 
పశ్చిమ దేశాల పెద్దలు న్యాయ దేవత కళ్లకు గంతలు కట్టుకుని, చేతిలో త్రాసుతో నిల్చుని ఉన్నట్లు ఏనాడో చిత్రీకరించారు. ఇప్పటికీ అదే చిత్రం వాడికలో ఉంది. న్యాయ దేవత -అంటే, చట్టమే- నిష్పక్షపాతంగానూ, నిస్వార్థంగానూ వ్యవహరిస్తుందని చెప్పడానికి ఈ చిత్రాన్ని ప్రతీకగా వాడతారు. నార్వేలో శిశు సంక్షేమ సేవల చట్టం తీరుతెన్నులను పరిశీలిస్తే ఆ చట్టానికి కళ్లే కాదు, ఏ జానేంద్రియమూ లేదనిపిస్తుంది. మంగళవారం నాడు -డిసెంబర్ నాలుగో తేదీన- నార్వేలో నివసిస్తున్న తెలుగు జంట వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలకు 18 నెలలూ 15 నెలల శిక్ష పడిన నేపథ్యంలో, నార్వే చట్టానికి హృదయమనేదే లేదనిపిస్తుంది. 2011 ఫిబ్రవరిలో మొదలయి, ఈ ఏడాది మార్చ్‌లో విషాదాంతంగా ముగిసిన భట్టాచార్య దంపతుల కథ చూసినా ఇదే అభిప్రాయం కలుగుతుంది. ఇంతవరకూ ఈ రెండు కథలే రచ్చకెక్కాయి. అక్కడ మరెందరు మనవాళ్లు ఎన్నెన్ని యాతనల పాలవుతున్నారో ఏమో అనిపించడం సహజం.

భారతదేశానికి చెందిన విద్యాధికులను సొంత పిల్లలను పెంచుకోవడమే తెలియని ‘అనాగరకులు’గా పరిగణించడం ద్వారా నార్వే ఒక తరహా పాశ్చాత్య జాత్యాహంకార వైఖరిని ప్రదర్శించిందనే చెప్పాల్సి ఉంటుంది. పెపైచ్చు, స్వీడెన్‌లో శిశు సంక్షేమ సేవలు మరింత కఠినంగా ఉంటాయని మనల్ని భయపెట్టే ప్రయత్నం చెయ్యడం క్షంతవ్యం కాదు! ఈ పోకడ వల్ల నార్వేలో నివసించే భారతీయ సంతతి బాలలకు ఏం ఒరిగిపడుతుందో ఏమో గానీ, ఇక్కడ ఉండే వారి తాతలకూ, అవ్వలకూ తీవ్రమయిన మనోవేదన కల్గుతోందనడంలో సందేహం లేదు. మన విదేశాంగ శాఖ ఇప్పటికయినా ఈ విషయంలో కచ్చితమయిన వైఖరి ప్రదర్శించి, జాతి గౌరవాన్నీ, తల్లితండ్రుల ప్రేమాభిమానాలనూ నిలబెట్టేలా ప్రవర్తించాల్సి ఉంది.

ఇంతకీ చంద్రశేఖర్- అనుపమల నేరమేమిటి?

వాళ్ల కుమారుడు తరగతి గదిలోనూ, స్కూలు బస్సులోనూ మూత్రవిసర్జన చేసినందుకు ఆ కుర్రాడిని తల్లిదండ్రులు బెదిరించారట. తానలా చెయ్యలేదని కుర్రాడు బుకాయించబోగా ‘అబద్ధాలు చెప్తే నాలిక మీద వాతలు పెడతా’నని తండ్రి బెదిరించారట. ఒకసారి బెదిరించడానికి చెమ్చాను వేడిచూసి చూపించానంతే మొర్రో అని చంద్రశేఖర్ మొత్తుకున్నారు. అయితే, కోర్టు విచారణ సందర్భంగా కుర్రాడి ఒంటిమీద వాతలూ, కాల్చిన మచ్చలూ కనపడ్డాయని ప్రాసిక్యూషన్ పేర్కొనడం గమనార్హం. అదంతా అబద్ధమనీ, తరచు తమ కుమారుడిని పరీక్షించే వైద్యులు ఇలాంటిదేమన్నా జరిగివుంటే ఊరుకునేవారా? అని చంద్రశేఖర్ దంపతులు నిలదీశారు. అయినప్పటికీ నార్వే ‘న్యాయ’ స్థానం చెక్కుచెదరలేదు- పదేపదే హెచ్చరించినా ప్రయోజనం లేకపోవడంతో తల్లితండ్రుల పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకుని, శిక్షలు వేశామని నార్వే అధికారులు కోర్టుకే కాదు- మన దౌత్య కార్యాలయానికి సైతం తెలియచేయడం విశేషం.

మన సమాజంలో క్రమశిక్షణకూ, కర్రపెత్తనానికీ తేడా లేకుండా పోయినమాట వాస్తవమే. అది గృహసంబంధాల్లో సైతం తరచు ప్రతిఫలించే మాటా వాస్తవమే. ఇక్కడ పిల్లలను గొడ్లను బాదినట్లు హింసించి వేధించే తల్లితండ్రులు ఉన్న మాటకూడా ఓ చేదు నిజమే. అయితే, అలాంటి అనాగరకులు -చదువూ సంస్కారాలున్న కుటుంబాల్లో- అల్ప సంఖ్యాకులనే చెప్పాలి. మహా రచయిత చలం తన ఆత్మకథలో పేర్కొన్నటువంటి హిరణ్య కశిపుడి బ్రాండ్ తల్లిదండ్రులు మనకు ఇప్పుడు ఎక్కడోగానీ కనిపించరు. ఏదో మాటవరసకు ‘తాటవలుస్తా’, ‘డొక్క చించేస్తా’, ‘చంపేస్తా’లాంటి మాటలు వాడినంత మాత్రాన తల్లిదండ్రులను ఇడీ అమీన్ ప్రతిరూపాలుగా పరిగణించడం అన్యాయం. అయినా, ఒకవేళ మనవాళ్ల ప్రవర్తన నార్వే చట్టాల ప్రమాణాల మేరకు లేనట్లయితే, వాళ్లను ఉద్యోగాల్లోంచి తొలగించే హక్కు అక్కడి అధికారులకు ఎలాగూ ఉంటుంది. లేదా, వారి వీసాలు రద్దు చేసి తిప్పి పంపగల సావకాశం వారికి ఉండనే ఉంది. అలా చెయ్యకుండా, తమ చట్టాల ప్రకారం ఇతర దేశాల పౌరులను ఇష్టారాజ్యంగా విచారించి శిక్షించడం ఏ ప్రమాణం ప్రకారం చూసినా భావ్యం కాదు.

అసలు లోపం మన పాలకుల్లో ఉందనిపిస్తోంది. నిన్నగాక మొన్న, ఐర్లండ్‌లో మన ఆడపడుచు సవితా హాలప్పనవర్ అన్యాయంగా బలయిపోయినప్పుడు కూడా మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏవో సన్నాయినొక్కులతో సరిపెట్టిందే తప్ప గట్టిగా నిలదీయలేదు. ఐర్లండ్‌ను నిలదీయడానికి జంకిన విదేశాంగ శాఖ నార్వేని కడిగేస్తుందని ఆశించడం అత్యాశే అవుతుందేమో! కానీ, చేతులు కాలాకా కూడా ఆకులు పట్టుకోకపోతే జనం మన విదేశాంగ శాఖను క్షమిస్తారా? అలా క్షమించాలని మనం ఆశించగలమా??

నార్వే కోర్టు తీర్పు ఓ హెచ్చరిక

 
కన్నబిడ్డను మందలించిన కేసులో తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో జిల్లా కోర్టు విధించిన శిక్ష మనకు ఓ హెచ్చరిక. ముందు వెనుక ఆలోచించకుండా విదేశాలకు వెళ్లేవారికి కనువిప్పు కలిగించే తీర్పు ఇది.
 
కన్నబిడ్డను మందలించిన కేసులో తెలుగు దంపతులకు నార్వేలోని ఓస్లో జిల్లా కోర్టు విధించిన శిక్ష మనకు ఓ హెచ్చరిక. ముందు వెనుక ఆలోచించకుండా విదేశాలకు వెళ్లేవారికి కనువిప్పు కలిగించే తీర్పు ఇది. కన్నబిడ్డను మందలించిన కేసులో ప్రవాసాంధ్ర దంపతులు వల్లభనేని చంద్రశేఖర్, అనుపమలను దోషులుగా నిర్ధారించిన ఓస్లో జిల్లా కోర్టు మంగళవారం వారికి శిక్షను ఖరారు చేసింది. తండ్రి చంద్రశేఖర్‌కు 18 నెలలు, తల్లి అనుపమకు 15 నెలల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పుపై ఎగువ కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు వారికి రెండురోజుల సమయం ఇచ్చింది. ఈ తీర్పు ఇక్కడ మనల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. కాని అక్కడ చట్టప్రకారం కోర్టు ఆ శిక్ష విధించింది. ఇటువంటి విషయాలలో మనకు అన్యాయం అనిపించింది వారికి న్యాయం అనిపిస్తుంది.

సంస్కృతీ సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లతోపాటు చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. ఇతరుల సంస్కృతీ సంప్రదాయాలను, భాషలను మనం ఎలా గౌరవిస్తామో అదేవిధంగా చట్టాలను గౌరవించాలి. అది తప్పనిసరి. అక్కడి అలవాట్లు, కట్టుబాట్లను అనుసరించి మనం నడుచుకోవాలి. ఇక్కడ నేర ప్రవృత్తి ఎక్కువ. అవినీతి అంతకంటే ఎక్కువ. మన దేశంలో మాదిరి అక్కడ వ్యవహరిస్తే కుదరదు. ఏ దేశంలోనైనా అక్కడి ఆచారాలు, అలవాట్లు, కట్టుబాట్లు, అవసరాలు, పరిస్థితులు, సంప్రదాయాలు, మానవసంబంధాలు, జనాభా ఎక్కువ, తక్కువ..... ఇలా అనేక అంశాలపై ఆధారపడి చట్టాలను రూపొందిస్తారు. అలాగే వాటిని ఎంతో గౌరవిస్తారు. తప్పనిసరిగా చట్టప్రకారం నడుచుకుంటారు. మనకు ఆ అలవాటు లేదు. అందు వల్ల విదేశాలకు వెళ్లినప్పుడు మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మన దేశంలోనూ చట్టాలు ఉన్నాయి. శిక్షలూ విధిస్తారు. అయితే ఇక్కడ వాటిని అమలు చేసే తీరువేరు. నియమ నిబంధనలను, చట్టాలను అతిక్రమించడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ అవినీతి ఎక్కువ. దాంతో ఏ పనైనా చిటికలో అయిపోతుంది. ఇక్కడ చట్టాలను అంతగా గౌరవించరు. కొన్ని దేశాలలో చట్టం పట్ల పౌరులకు ఎంతో గౌరవం ఉంటుంది. చట్టాలను అతిక్రమించడం అంటే వారు పెద్ద నేరంగా భావిస్తారు. చట్టం చేసుకున్నది దేనికి? తప్పనిసరిగా అనుసరించడానికి అనేది వారి సమాధానం.

ఉన్నత చదువుల కోసం, ఉద్యోగం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లేవారు అక్కడి చట్టాలను తప్పనిసరిగా తెలుసుకోవలసిన అవసరాన్ని ఈ తీర్పు గుర్తు చేస్తోంది. అలాగే విదేశాలకు వెళ్లేవారికి ఆయా దేశాల సంప్రదాయాలు, చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరాన్ని విదేశాంగ శాఖ గుర్తించాలి. చట్టాలను వారు ఎంత గౌరవిస్తారో కూడా తెలియజెప్పవలసి అవసరం ఉంది. అలాగే విదేశాలలోని ప్రవాసభారతీయుల హక్కులను కాపాడటంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వారికి న్యాయసహాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు అంతర్జాతీయ కంపెనీలు (ఎంఎన్ సి) తమ ఉద్యోగులను ఉద్యోగ రీత్యా కొద్ది కాలం విదేశాలకు పంపడం ఎక్కువయింది. చంద్రశేఖర్‌,అనుపమలు కూడా అలా వెళ్లినవారే. ఈ విధంగా తమ ఉద్యోగులను విదేశాలకు పంపించే సమయంలో ఆయా కంపెనీలు వారికి ఆయా దేశాల సంస్కృతీ సంప్రదాయాలతోపాటు అక్కడి చట్టాలపై అవగాహన కలిగించవలసిన అవసరం ఉంది. చట్టాలు ఒక్కో దేశంలో ఒక్కోరకంగా ఉంటాయి. గల్ఫ్ దేశాలలో శిక్షలు కఠినంగా ఉంటాయి. మహిళల పట్ల ఏమాత్రం అమర్యాదగా ప్రవర్తించినా కఠినంగా శిక్షిస్తారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన ప్రవాస భారతీయులు అనేక మందికి అక్కడి చట్టాల గురించి తెలియదు. దాంతో మనం చిన్నచిన్నవి అనుకునే తప్పులు చేసి కఠిన శిక్షలు అనుభవించారు. ఇంకా అనుభవిస్తున్నారు. అక్కడ సంప్రదాయాలు, చట్టాలు తెలియక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇతర దేశాలలోని చట్టాలకు, మన దేశంలోని చట్టాలకు చాలా వ్యత్యాసం ఉంటుంది. మన చట్టాల ప్రకారం చిన్నచిన్న తప్పులు అనుకునే విషయాలు, అక్కడ వారు పెద్ద నేరాలుగా పరిగణిస్తారు. ఇప్పుడు నార్వేలో జరిగింది అదే. చిన్న పిల్లలను మందలించడం, అదుపులో పెట్టడం ఇక్కడ నేరంకాదు. కానీ అక్కడ నేరం. అందువల్ల మనం ఏ దేశం వెళ్లాలనుకున్నా ముందుగా అక్కడి ఆచారాలు, అలవాట్లు, పద్దతులు, చట్టాలు తెలుసుకొని వెళ్లడం మంచిది. విదేశాలకు వెళ్లడం తప్పుకాదు. విజ్జాన సముపార్జనకు, ఉపాధి కోసం విదేశాలకు వెళ్లడం తప్పనిసరి అయింది. ప్రసార మాధ్యమాలు, ప్రయాణ సౌకర్యాలు, కమ్యూనికేషన్ ... అందరికీ అందుబాటులోకి రావడంతో ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయినప్పటికీ కొన్ని దేశాలలో ఆచారాలు, కట్టుబాట్లు, చట్టాలు చాలా పురాతనమైనవే ఉంటాయి. ఆ చట్టాలలో మార్పు రావడానికి ఇంకా ఎన్నో ఏళ్లు పడుతుంది. అందువల్ల మన జాగ్రత్తలో మనం ఉండాలి.