all

Thursday, December 6, 2012

అందమె ఆనందం

కీరా ముక్కను గుజ్జు చేసి, పల్చని క్లాత్‌తో రసాన్ని వడకట్టాలి. ఆ మిశ్రమాన్ని దూదితో అద్దుకొని కంటి చుట్టూ తుడవాలి. తర్వాత ఆ దూదిని కనురెప్పల మీద పెట్టుకొని పది నిమిషాలు విశ్రాంతి పొందాలి. ఇలా చేయడం వల్ల కళ్ల కింద నల్లని వలయాలు తగ్గుముఖం పడతాయి.

గుడ్ లుకింగ్

మాది విజయనగరం. విశాఖపట్నంలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేస్తున్నాను. రోజూ అప్ అండ్ డౌన్ ప్రయాణించాలి. మొదట్లో నా జుట్టు చాలా బాగుండేది. ఈ మధ్య బాగా డ్రై అవడమే కాకుండా, విపరీతంగా ఊడిపోతోంది. ఈ సమస్యకు ఇంట్లోనే చేసుకోదగ్గ పరిష్కారం సూచించగలరు.
- రేవతి, ఈమెయిల్


ముందుగా మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. ఎక్కువగా ప్రయాణిస్తుంటాను అని మీరే చెప్పారు. ప్రయాణం చేసే సమయంలో దుమ్ము, ధూళి, ఎండ బారినపడకుండా జుట్టును క్యాప్‌తో లేదా మఫ్లర్‌తో కవర్ చేసుకోండి. తలంటుకోవడానికి ముందురోజు రాత్రి గోరువెచ్చని నూనెను జుట్టుకు పట్టించి మర్దనా చేసుకోండి. మంచి కండిషనర్ షాంఫూను ఉప యోగించండి. అలాగే షాంపూ చేసుకున్న తర్వాత కండిషనర్‌ను వాడండి. రోజూ పోషకాహారం మీద దృష్టిపెట్టండి. వారానికి ఒకసారైనా పెరుగు లేదా గుడ్డుతో తలకు ప్యాక్ వేసుకోండి. టెన్షన్లు తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. అయినా సమస్య అలాగే ఉంటే వైద్యుని సంప్రదించి హార్మోన్ టెస్ట్ చేయించుకొని, వారి సూచనలు పాటించండి.

నాది పొడి చర్మం. మూతి చుట్టూ నల్లగా అయ్యింది. అది పోవడానికి ట్యాన్ క్లీనర్‌ని ఉపయోగిస్తున్నాను. కాని ఫలితం లేదు. సరైన సలహా ఇవ్వగలరు.
- సౌజి, ఈమెయిల్


రోజులో చాలాసార్లు మనకు తెలియకుండా చేతులతో ముఖాన్ని రుద్దేస్తుంటాం. దీనివల్ల చర్మం పొడిబారడమే కాదు, నల్లబడుతుంది. చర్మం పై రబ్ చేయాలంటే టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. రాత్రి పడుకునేముందు మూతి చుట్టూ బ్రైట్‌నింగ్ సీరమ్ రాస్తే నలుపు తగ్గుతుంది.

నా వయసు 22. నా తలలో చుండ్రు ఎక్కువగా ఉంది. దీనివల్ల జుట్టు కూడా రాలుతోంది. మొటిమలు ఎక్కువగా వస్తున్నాయి. యాంటీ డాండ్రఫ్ షాంపూలనే వాడుతున్నాను. అయినా ఫలితం లేదు. చుండ్రు, మొటిమలు తగ్గే ఉపాయం చెప్పగలరు.
- శ్రీ, రామ్‌నగర్


చుండ్రు సమస్య నివారణకు ఎన్నో యాంటీ డాండ్రఫ్ షాంపూలు వచ్చాయి. అయినా సమస్యలో ఏ విధమైన మార్పూ లేదు. మీరు బయోడిగ్రేడబుల్ షాంపూని వాడి చూడండి. అయినప్పటికీ చుండ్రుసమస్య అలాగే ఉంటే ఒకసారి డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించండి. మొటిమల నివారణకు ఉప్పు నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటూ ఉండండి. అలాగే బయటకు వెళ్లి వచ్చిన తర్వాత ఫేస్‌వాష్‌తో ముఖాన్ని కడగండి.

నాది జిడ్డుచర్మం. ముక్కు మీద మొటిమల తాలూకు నల్లమచ్చలు ఉన్నాయి. ఇంకా పెదవులు, మెడ చుట్టూ నల్లగా ఉంది. కళ్ల కింద నల్లని వలయాలు ఏర్పడ్డాయి. వీటివల్ల ఉన్న వయసు కన్నా ఎక్కువగా కనిపిస్తున్నాను. పరిష్కారం చెప్పగలరు.
- అనన్య, మహబూబ్‌నగర్


మొటిమల తాలూకు నల్లమచ్చలు తగ్గాలంటే మంచి బ్రాండెడ్ కంపెనీ యాస్ట్రిజెంట్‌తో రోజుకు మూడుసార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. అలాగే పాలపొడిలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకోవడానికి ముందు ముఖానికి ప్యాక్‌లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. 

నిజమైన జ్ఞానం


ఒక ఊరిలో ఇద్దరు ప్రాణస్నేహితులు ఉండేవారు. వారిలో ఒకరు సన్యాసిగా మారారు. రెండోవాడు ధనికుడు అయ్యాడు. చాలాకాలం తర్వాత ధనికుడు తన స్నేహితుడిని చూశాడు. స్నేహితుడు జ్ఞానం పొంది ప్రశాంత జీవనం సాగించడాన్ని చూసి సంతోషించాడు. తన ఇంటికి ఒక పూట భోజనానికి రావలసిందిగా కోరాడు. అతను సన్యాసి గనుక ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండాలని వీధి గేటు దగ్గరే తివాచీలు పరచమని ఆజ్ఞాపించాడు.

రెండురోజుల తర్వాత సన్యాసి వెళ్లాడు. ప్రధానద్వారం దగ్గరకి రాగానే సేవకుడు ఆపి ‘‘అయ్యా! మీ స్నేహితుడు మిమ్మల్ని చిన్నచూపు చూడ్డానికే పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాడేగాని మీ మీద అభిమానంతో కాదు’’ అని హెచ్చరించాడు. సన్యాసికి కోపం వచ్చింది. పరుగున వెనక్కి వెళ్లి బురద నీళ్లలో కాళ్లు ముంచి మరీ వచ్చాడు. మురికి అయిందని తన సేవకుల్ని తిట్టాడు ధనికుడు.

‘‘వాళ్లని తిట్టకు. ఆ మురికి నా వల్లనే అయింది. నీకంటే ఎంతో గొప్పవాడిని. నీవు ధనికుడివి మాత్రమే. నేను ఎంతో జ్ఞానాన్ని, ఆధ్యాత్మికతను సాధించాను’’ అంటూ తన గర్వాన్ని ప్రదర్శించాడు సన్యాసి. ధనికుడు ఆశ్చర్యపోయాడు. ‘‘నువ్వు సన్యాసం స్వీకరించి ఎంతో ఉన్నతుడవయ్యావని, ఎంతో జ్ఞానం సంపాదించావని, ప్రశాంత జీవనం సాగిస్తున్నావని నేను ఈర్ష్యపడ్డాను. నీకు, నాకు మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని గ్రహించాను.

నాకు ధనార్జన వ్యామోహం, నీకు సన్యాసి అనిపించుకోవాలని వ్యామోహం. నువ్వు సాధించినదంతా కోల్పోయావు. అహం కారంతో ఎక్కువకాలం ఉండలేవు. ఎవరు ఏది సాధించినా, పొందినా అది దేవుని అనుగ్రహమే అనుకోవాలి. కానీ ‘నేను’ అనేదే భయంకరమైన శత్రువు. దాన్ని నువ్వింకా వదులుకోలేదు’’ అన్నాడు. సన్యాసి స్నేహితుడు మారుమాట్లాడకుండా వెళ్లిపోయాడు.

విజయ రహస్యం


జింగో అనే కుర్రాడు కారు ప్రమాదంలో తన ఎడమచేతిని పోగొట్టుకున్నాడు. కానీ అతనికి జూడో నేర్చుకోవాలన్న పట్టుదల ఉండేది. ఇంట్లోవారు, గురువు ఎంత కాదన్నా మొండికేశాడు. తప్పని పరిస్థితిలో గురువు శిక్షణ ఇవ్వడానికి అంగీకరించాడు.

గురువు దగ్గరికి వెళ్లిన జింగో ఏడాదిపాటు శిక్షణ తీసుకున్నాడు. కానీ చిత్రంగా తన గురువు ఒకే పట్టు నేర్పించాడు. అందులోనే గట్టివాడిని చేశాడు. ఒకరోజు ఉండబట్టలేక ఆ సంగతి అడిగాడు. గురువు నవ్వి, ‘‘నీకు చాలా తెలుసు, ఇదొక్కటే తెలీదు. అందుకనే ఈ పట్టే శ్రద్ధగా నేర్పాల్సి వచ్చింది’’ అన్నాడు. రెండు మాసాల తర్వాత పోటీకి గురువుతో వెళ్లాడు. మొదటి రెండు రౌండ్లలో ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించాడు. జింగో ఆశ్చర్యపోయాడు. సెమీస్‌లో కాస్తంత కష్టపడాల్సి వచ్చింది. చివరగా జింగోనే గెలిచాడు.

ఇక టోర్నీ ఫైనల్ ఉన్న ప్రత్యర్థి బలశాలి, వయసులోనూ పెద్దవాడు. అతన్ని చూడగానే ఎలా గెలవగలననుకున్నాడు. కాస్తంత భయపడి రిఫరీతో, పోటీ అతనే గెలిచాడని ప్రకటించమన్నాడు. ఈలోగా రింగ్‌లోకి అతని గురువు వచ్చి పోటీ జరిపించమని పట్టుపట్టాడు. మొత్తానికి పోటీ ప్రారంభమైంది.

ప్రత్యర్థి మొదటి రెండు రౌండ్లలో జింగోను అధిగమించాడు. తర్వాత రెండురౌండ్లలో అనూహ్యంగా జింగో అతడిని చిత్తుచేసి గెలిచాడు. జింగోను టోర్నీ విజేతగా ప్రకటించారు. ఇలా గెలవడానికి కారణమేమిటని గురువును అడిగాడు.‘‘జూడోలో అతి క్లిష్టమైన పట్టులో నువ్వు ఆరితేరావు. ఆ పట్టులోంచి ప్రత్యర్థి బయటపడాలంటే అతడు నీ ఎడమ చేతిని ఒడిసి పట్టుకోవడం తప్ప మరో మార్గం లేదు!’’ అని నవ్వాడు గురువు.

పోలీస్ లడ్లు!


  

కూల్ హెల్త్

చక్కటి ఆరోగ్యం కోసం..చల్లటి పండు

పుచ్చకాయను చాలామంది వేసవిలో మాత్రమే తినాల్సిన పండుగా పొరబడుతుంటారు. వేసవిలో అది తాపం తీర్చడంతో పాటు మిగతా సీజన్‌లలో ఆరోగ్యాన్నీ పంచుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీళ్లే ఉన్నందున అది దాహం తీర్చుతుంది. మిగతా ఎనిమిది శాతం పదార్థాల్లో ఆరోగ్యాన్నిచ్చే అనేక అంశాలు కూరి కూరి ఉన్నాయి. టొమాటోలో ఉండే లైకోపిన్ ఇందులోనూ పుష్కలంగా ఉంటుంది. లైకోపిన్ ప్రోస్టేట్, రొమ్ము, ఎండోమెట్రియల్, ఊపిరితిత్తుల, పెద్దపేగుల క్యాన్సర్లను హరిస్తుంది. అందుకే దీన్ని ఎల్లవేళలా తింటుండటం మంచిది.

శరీరంలోని విషపదార్థాలను హరించే గుణం ఉండటం వల్ల డయాలసిస్ ప్రక్రియను కనుగొనకముందర దీన్నే శరీరంలోని ప్రమాదకరమైన రసాయనాలను తొలగించడానికి కిడ్నీ రోగులకు ఇచ్చేవారు. ఇందులో పొటాషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల ఇది రక్తపోటు రోగులకూ మంచిదే. ఇక ఆస్తమా, అథెరోస్క్లీరోసిస్, డయాబెటిస్, ఆర్థరైటిస్ రోగులకు ఇది వరప్రసాదిని అనుకోవచ్చు. పుచ్చకాయ గుండెకూ మేలు చేస్తుందని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ పేర్కొంది. ఇన్ని లాభాలు ఉన్నందున దీన్ని వేసవికే పరిమితం చేయకుండా అన్ని సీజన్‌లలోనూ తినడం మంచిదే.

డబుల్ హెల్త్ బెనిఫిట్స్!

ఇళ్లు, ఆఫీసులను చల్లబరిచే ఏసీ వంటి యంత్రాలు వాతావరణంలోని స్ట్రాటోస్ఫియర్ పొరను దెబ్బతీసి పర్యావరణ అసమతౌల్యానికి దారితీస్తుంది. ఏసీ వాడకాన్ని నియంత్రించుకుంటే పర్యావరణ ఆరోగ్యంతో పాటు వ్యక్తిగత ఆరోగ్యం కూడా మెరుగవుతుంది.

ఇటీవల మనలో చాలామందికి ఆరోగ్య స్పృహ పెరిగింది. అలాగే పర్యావరణ స్పృహ కూడా. దాంతో ఒకే చర్యతో అటు మనిషి ఆరోగ్యం, ఇటు పర్యావరణ ఆరోగ్యం... ఈ రెండు ఆరోగ్యాలూ సమకూరితే... అంతకన్నా కావాల్సిందేముంది? అందుకే అటు మనుషులకూ, ఇటు వాతావరణానికీ ఈ రెండు విధాలైన ఆరోగ్య ప్రయోజనాలూ సమకూరే కొన్ని పనులను కొందరు నిపుణులు సూచిస్తున్నారు. అవి...

మీ రవాణాకు సైకిల్ లేదా నడకే బెస్ట్ 

మనదేశంలో ఇటీవల దగ్గరి దూరాలకు సైతం మోటార్ వాహనాన్ని ఉపయోగిస్తున్నారు. ఒకస్థాయి వ్యక్తులు సైకిల్ ఉపయోగించడాన్ని స్థాయికి తగనిపనిగా పరిగణిస్తున్నారు. ఇది పర్యావరణానికి మేలు చేసే అంశమని విస్తృత ప్రచారం చేస్తే, అటు వ్యక్తులకూ, ఇటు పర్యావరణానికీ మేలు జరుగుతుంది. వ్యాయామానికి తీరిక లేనివారు తమ రవాణా కోసం సైకిల్ లేదా నడకను ఎంచుకుంటే మంచిది. మోటారు వాహనాన్ని ఉపయోగించకపోవడం వల్ల ఇంధనం ఆదా అవుతుంది. కర్బన కాలుష్యాల నివారణ వల్ల పర్యావరణానికి మేలు జరుగుతుంది.

త్వరగా నిద్రకు ఉపక్రమించండి 

గతంలో మనం ఎనిమిది లేదా తొమ్మిది గంటల లోపే నిద్రకు ఉపక్రమించేవారం. పదిగంటల వరకు మేల్కొని ఉన్నారంటే అది చాలా ఆలస్యంగా నిద్రపోవడంగా పరిగణించేవారు. అయితే ఇప్పుడు రాత్రి ఒంటిగంటకు నిద్రపోవడం అన్నది సాధారణంగా మారిపోయింది. దీనివల్ల ఆరోగ్యంపై కలిగే దుష్పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వ్యక్తుల ఆరోగ్యంతో పాటు పర్యావరణం సైతం దెబ్బతింటోంది. ఒంటిగంట లేదా రెండు వరకూ మేల్కొని ఉండటం వల్ల విద్యుత్ వినియోగం అధికమవుతుంది. ఫలితంగా ఆ విద్యుత్తుకు ప్రధాన వనరులైన బొగ్గు, గ్యాస్ వినియోగం పెరగడం, దాంతో పర్యావరణంపై భారం కూడా సాధారణమే.

నిద్రగంటలు తగ్గడం స్థూలకాయానికి దారితీస్తోంది. ఫలితంగా కీళ్లనొప్పులు, రక్తపోటు, డయాబెటిస్ వంటి అనేక అనారోగ్యాలకు కారణమవుతోంది. నిద్రగంటలు తగ్గడం వల్ల మెదడులో స్రవించే లెప్టిన్ వంటి హార్మోన్లస్థాయి తగ్గుతుంది. లెప్టిన్ అనే హార్మోన్ మనకు శక్తిని ఇస్తుంది. ఆ శక్తిలో వినియోగించే సామర్థ్యం ఎంత, ఆకలి నియంత్రణ, అనేక జీవక్రియల నిర్వహణకు ఉపయోగపడుతుంది. దాంతో జీవక్రియల్లో సమతౌల్యం దెబ్బతింటుంది. ఇక ఘ్రెలిన్ అనే మరో హార్మోన్ స్రావం పెరుగుతుంది. ఇది ఆకలిని పుట్టిస్తుంది. నిద్రపోయే గంటలు తగ్గినప్పుడు ఆకలి పెరిగి అనవసరమైన చెత్త తింటూంటాం. దాంతో ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే త్వరగా నిద్రపోవడం వల్ల వ్యక్తుల ఆరోగ్యాన్ని, పర్యావరణ ఆరోగ్యాన్ని... రెంటినీ కాపాడినట్లే.

ఎయిర్ కండిషన్ వినియోగాన్ని తగ్గించండి 

రక్తం వేడిగా ఉండే క్షీరదాలైన మిగతా అన్ని జీవుల్లాగే... మనిషికీ ఒక స్థిరమైన శరీర ఉష్ణోగ్రత ఉంటుంది. వ్యక్తులలో జరిగే జీవక్రియలు, పరిసరాలను బట్టి దాన్ని పెంచుకోవడం లేదా తగ్గించుకోవడమనేది మనిషికి స్వాభావికంగానే ఉంటుంది. ఉదాహరణకు పరిసరాలు బాగా చల్లగా ఉన్నప్పుడు జీవక్రియలను వేగవంతం చేసి శరీరాన్ని వెచ్చబరుచుకునే గుణం, పరిసరాలు వేడిగా ఉన్నప్పుడు చెమటలు పుట్టించి శరీరాన్ని చల్లబరుచుకునే గుణం ప్రకృతి మనకు ఇచ్చిన వరం. అయితే మనం ఒక స్థిరమైన ఉష్ణోగ్రత దగ్గర దీర్ఘకాలం పాటు ఉంటున్నామనుకుందాం. దానివల్ల పరిసరాలకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతను మార్పు చేసుకునే ఆ స్వాభావిక శక్తి మనలో క్షీణిస్తుంది. నిత్యం ఏసీలో ఉండే వారికి విటమిన్-డి లోపం కారణంగా అనేక న్యూరలాజికల్ సమస్యలు వస్తున్నాయి. ఎక్కువసేపు ఏసీల్లో ఉండేవారు మందకొడిగా మారిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దానివల్ల స్థూలకాయం వంటి ఆరోగ్యసమస్యలు వచ్చి, ఇతర అనారోగ్యాలకు దారితీస్తున్నాయి.

అబార్షన్లు... నివారణ

పండంటి బిడ్డ పుట్టాలన్నది గర్భం ధరించిన ప్రతి మహిళ కల. కానీ అది ఒక్కోసారి కల్ల అవుతుంది. గర్భస్రావం రూపంలో కల నెరవేరకపోవడం దురదృష్టం. చాలా సందర్భాల్లో నెలతప్పిన పది రోజులకే... అది గర్భం అని తెలిసేలోపే రుతుస్రావంలో రక్తస్రావం ఎక్కువగా జరగడం ద్వారా (బ్లీడింగ్ రూపంలో) గర్భస్రావం అయిపోతుంటుంది. ఇలాంటి అవాంఛిత పరిస్థికి కారణాలు, చేయించాల్సిన పరీక్షలు, తీసుకోవాల్సిన చికిత్సలు, గర్భస్రావం జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన సలహాలు, సూచనల సమాహారమే ఈ కథనం. 

మహిళల్లో రుతుస్రావం మొదలైన నాటి నుంచి లెక్కకడితే 11వ రోజు నుంచి 16వ రోజు లోపల అండం విడుదలవుతుంది. ఆ సమయంలో కలయిక జరిగినప్పుడు పురుషుని నుంచి విడుదలయ్యే వీర్యకణాలు, మహిళ గర్భాశయం ద్వారా ఫెలోపియన్ ట్యూబ్‌లోకి ప్రవేశించి, అక్కడ అండం లోపలకు చేరి ఫలదీకరణ ప్రక్రియ పూర్తవుతుంది. అలా ఫలదీకరణం చెందిన అండం అనేక కణాలుగా విభజన చెందుతూ, ఆరురోజుల తర్వాత హార్మోన్ల ప్రభావంతో గర్భాశయం లోపలిపొరల్లోకి ప్రవేశించి, అక్కడ పిండంగా రూపాంతరం చెంది, తొమ్మిది నెలల పాటు పెరుగుతుంది.

సాధారణంగా తొమ్మిది నెలలు నిండాక ప్రసూతి జరిగి పండంటి బిడ్డ పుట్టాలి. ఏ కారణంగానైనా ఏడో నెల కంటే ముందుగానే గర్భం నుంచి పిండం బయటపడితే గర్భస్రావం (అబార్షన్) అంటారు. ఇలాంటి సందర్భాల్లో శిశువు సాధారణంగా మృతిచెంది బయటపడటమో లేదా బయటపడి మృతిచెందడమో జరుగుతుంటుంది. (ఒకవేళ ఏడో నెలలో పిండం బయటపడ్డా శిశువు బతికే ఉంటే దాన్ని గర్భస్రావంగా పేర్కొనరు. అప్పుడు దాన్ని ప్రీ-మెచ్యూర్ డెలివరీ అంటారు).

కారణాలు: గర్భస్రావం కావడానికి అనేక కారణాలుంటాయి. సంక్షిప్తంగా...

జన్యుపరమైనవి: చాలా సందర్భాల్లో జన్యుపరమైన కారణాలే గర్భస్రావానికి దోహదపడతాయి. పిండం సరిగా ఏర్పడకపోవడం, ఒకవేళ ఏర్పడితే అది సరిగా ఎదగలేక చనిపోవడం సాధారణం. అండం లేదా వీర్యకణం లేదా పిండంలోని జన్యువు (క్రోమోజోము)ల్లో లోపాల కారణంగా ఇలా జరుగుతుంది. ఇది తొలిచూలు గర్భంలోనే కావచ్చు లేదా వరసగా ఇలాగే జరుగుతుండవచ్చు. తల్లి వయసు 35 ఏళ్లు దాటేకొద్దీ జన్యుపరమైన కారణాల వల్ల అబార్షన్లు ఎక్కువవుతాయి. సరిగా ఎదగలేని, లోపాలు ఉన్న పిండాన్ని ప్రకృతి సహజంగానే మొదట్లోనే బయటకు నెట్టేస్తుంది. తత్ఫలితంగా గర్భస్రావం జరుగుతుంది. జన్యుపరమైన కారణాల వల్ల అయ్యే గర్భస్రావాలకు ఏ చికిత్సా పనిచేయదు.

తల్లికి ఉండే వ్యాధులు: కాబోయే తల్లికి... అదుపులో లేని మధుమేహవ్యాధి, మూత్రపిండాల వ్యాధి, రక్తహీనత వంటి కండిషన్‌లు.

హార్మోన్ల సమస్య: అదుపులో లేని థైరాయిడ్ సమస్య, ప్రొజెస్టెరాన్ హార్మోన్ లోపం, పాలీసిస్టిక్ అండాశయాల వల్ల, హార్మోన్ సమస్యలతో

ఇన్ఫెక్షన్లు: హెర్పిస్, రుబెల్లా, వైరస్, టాక్సోప్లాస్మా, సిఫిలిస్ వంటి ఇన్ఫెక్షన్లతో తీవ్రమైన జ్వరం తీవ్రమైన మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ పోషకాహార లోపాలు కొన్నిరకాల మందుల వాడకం వల్ల... గర్భస్రావాలు జరుగుతాయి.

గర్భాశయంలో లోపాలు: తరచుగా కనపడే లోపం గర్భాశయ కంఠం (సర్విక్స్) వదులుగా అవ్వడం లేదా సర్విక్స్ పొడవు తక్కువగా ఉండటం. దీనివల్ల పెరిగే శిశువు తాలూకు బరువును మోయలేక, 4-7 నెలల మధ్య సర్విక్స్ తెరచుకుని పెద్దగా నొప్పి లేకుండానే శిశువు బయటకు జారిపోతుంది.

కొంతమందిలో పుట్టుకతోనే గర్భాశయంలో లోపాలు అంటే గర్భాశయం మధ్యలో చీలడం లేదా ఆకృతిలో తేడాల వల్ల గర్భాశయం లోపలి పొరల్లో కణుతులు (ఫైబ్రాయిడ్స్, పాలిప్స్) గర్భధారణ తర్వాత కవలలు ఏర్పడటం వల్ల (కొంతమందిలో మాత్రమే) గర్భధారణ తర్వాత తల్లి శరీరం శిశువును తిరస్కరించకుండా ఉంటేనే అది గర్భాశయంలో పెరుగుతుంది. అయితే కొంతమంది శరీరాల్లో ఉండే యాంటీ ఫాస్ఫోలిపిడ్ వంటి యాంటీబాడీల కారణంగా తల్లి శరీరం పిండాన్ని తిరస్కరించడం వల్ల, రక్తం గడ్డకట్టడానికి అవసరమైన పదార్థాలు లోపించడం వల్ల వరసగా గర్భస్రావాలు జరుగుతుంటాయి తల్లిలో లేదా తండ్రిలో లేదా ఇరువురిలో ఎవరికైనా జన్యుపరమైన లోపాలు ఉన్నా కూడా పిండం సరిగా పెరగకుండా గర్భస్రావాలకు దారితీయవచ్చు.

పరీక్షలు: ఒకటి రెండుసార్లు అబార్షన్లు అయిన వారందరికీ పరీక్షలు చేయించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అబార్షన్లు రెండు, మూడు లేదా అంతకంటే ఎక్కువసార్లు వరుసగా జరిగితే (అవి ఏ నెలలో అయ్యాయనే అంశాన్ని బట్టి) కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కొందరిలో ఎన్ని పరీక్షలు చేసినా ఎలాంటి లోపం కనిపించకపోవచ్చు కూడా. కారణం తెలుసుకోడానికి చేయించాల్సిన పరీక్షలివి...

కంప్లీట్ బ్లడ్ పిక్చర్ (సీబీపీ) బ్లడ్‌గ్రూప్ అండ్ టైప్ షుగర్ టెస్ట్ థైరాయిడ్, ప్రొలాక్టిన్ వంటి హార్మోన్ల పరీక్ష యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీస్ పరీక్ష అల్ట్రాసౌండ్ హిస్టెరోస్పాలింగోగ్రామ్ (హెచ్‌ఎస్‌జీ) తల్లిదండ్రులకు జన్యుపరీక్షలు (కారియోటైపింగ్) తల్లిలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నాయేమో తెలుసుకోడానికి చేసే రక్తపరీక్షలు (ఇన్ఫెక్షన్ స్క్రీనింగ్ టెస్ట్స్) గర్భస్రావంలో బయటపడ్డ ముక్కలను జన్యుపరీక్షకు పంపడం వంటివి చేస్తారు.

చికిత్స: కారణాలను బట్టి చికిత్సను నిర్ణయించాల్సి ఉంటుంది జన్యుపరమైన కారణాలతో అయ్యే అబార్షన్లకు ఎలాంటి చికిత్స చేసినా ఫలితం ఉండదు పౌష్టికాహారం, ఫోలిక్ యాసిడ్ వాడటం హార్మోన్ల అస మతౌల్యత ఉంటే... ప్రోజెస్టెరాన్ హార్మోన్‌ను ట్యాబ్లెట్లు లేదా ఇంజెక్షన్స్ రూపంలోనూ, హెచ్‌సీజీ ఇంజెక్షన్లు అవసరాన్ని బట్టి మొదటి మూడునెలలు తీసుకోవాల్సి ఉంటుంది థైరాయిడ్ సమస్య ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోడానికి అవసరమైన మందులు తప్పనిసరిగా తీసుకోవాలి సర్విక్స్ (గర్భాశయ కంఠం) వదులుగా ఉంటే... గర్భస్రావాన్ని నివారించడం కోసం గర్భధారణ జరిగాక 4 - 6 నెలల మధ్య సర్విక్స్‌కు కుట్లు వేయాలి యాంటీబాడీలు ఉంటే ఎకోస్ప్రిన్, హెపారిన్ వంటి మందులు వాడాలి.

మాతృత్వం అనే వరానికి అడ్డుపడే అబార్షన్లను నిలువరించడానికి, నివారించడానికి... డాక్టర్ సూచనలు, సలహాలు పాటించడం, వారు రాసిన మందులను క్రమం తప్పకుండా వాడటం, వారు చెప్పిన జాగ్రత్తలను అనుసరిస్తూ ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోవాలి.

సూచనలు 
గర్భవతిని మానసికంగా ప్రశాంతంగా ఉంచడం ...

గర్భధారణ తర్వాత మొదటి మూడునెలలూ దాంపత్య జీవితానికి దూరంగా ఉండటం వీలైనంతవరకు దూరపు ప్రయాణాలు చేయకపోవడం

అబార్షన్ అయిన కారణాన్ని బట్టి విశ్రాంతి తీసుకోవడం

వీలైనంతవరకు బరువైన పనులు చేయకపోవడం

కారణం తెలియకుండా అబార్షన్లు అవుతుంటే అలాంటి మహిళలకు అన్నిసార్లూ అబార్షన్లు అవ్వదంటూ భరోసా ఇచ్చి, వారికి ధైర్యం చెప్పడం... వంటి సూచనలు పాటించాలి.

అబార్షన్లలో రకాలు 

మిస్‌డ్ అబార్షన్: గర్భాశయంలో పిండం ఏర్పడి, గుండె కొట్టుకోకపోవడంతో లేదా కొన్ని రోజులు పిండం పెరిగాక గుండె కొట్టుకోవడం ఆగిపోవడం వల్ల జరిగే గర్భస్రావాన్ని ‘మిస్‌డ్ అబార్షన్’ అంటారు. ఇలాంటి సందర్భంలో తల్లికి ఎలాంటి లక్షణాలూ కనిపించవు. ఇది కేవలం స్కానింగ్ తర్వాతే బయటపడుతుంది. కొందరిలో కొద్దిగా బ్లీడింగ్ లేదా స్పాటింగ్ లేదా నల్లగా మారిన రక్తస్రావం కావచ్చు. కొంతమందిలో పిండం ఏర్పడదు. దీన్ని ‘బ్లైటెడ్ ఓవమ్’ అంటారు.

ఇన్‌ఎవిటబుల్ అబార్షన్: దీనిలో పొత్తికడుపులో నొప్పి, బ్లీడింగ్ ఉండి, సర్విక్స్ తెరచుకుని, పిండం కిందికి జారుతుంది. ఈ కండిషన్‌లో ఏ చికిత్స చేసినప్పటికీ గర్భం నిలవదు.

ఇన్‌కంప్లీట్ అబార్షన్: ఇందులో బ్లీడింగ్ ముక్కలు ముక్కలుగా విపరీతంగా అవుతూ, కడుపునొప్పి ఉండి, గర్భం మొత్తం పూర్తిగా విడిపడకుండా, గర్భాశయంలోనే ముక్కలు ఉండిపోతా యి. దీనివల్ల ఒక్కోసారి విపరీతమైన రక్తస్రావమై ప్రాణాపాయస్థితికి వెళ్లే అవకాశం ఉంటుంది.

కంప్లీట్ అబార్షన్: కొంతమందిలో పొత్తికడుపులో నొప్పితో పాటు గర్భం మొత్తం బ్లీడింగ్‌లా ముద్దలా బయటపడిపోయి తర్వాత బ్లీడింగ్, నొప్పి తగ్గిపోతాయి.

సెప్టిక్ అబార్షన్: కొంతమందిలో అబార్షన్ సరిగా చేయించుకోకపోవడం, రక్తహీనత, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నప్పుడు రోగక్రిములు గర్భాశయంలోకి చేరి తద్వారా ఇన్ఫెక్షన్ వచ్చి, రక్తం ద్వారా అది శరీరమంతా వ్యాప్తి చెంది, ప్రమాదస్థితిలోకి వెళ్లడం జరుగుతుంది.

రికరెంట్ అబార్షన్: వరసగా మూడుసార్లు గర్భస్రావమైతే, వాటిని రికరెంట్ అబార్షన్స్‌గా చెప్పవచ్చు. ఇందులో 50 శాతం వాటికి కారణం తెలియదు. మూడునెలల లోపు అయ్యేవాటిలో చాలావరకు పిండంలో జన్యు లోపాలు కారణం కావచ్చు. మూడు నెలలు దాటాక అయ్యేవాటిలో తల్లికి సంబంధించిన సమస్యలు కారణం కావచ్చు.
 

అందమె ఆనందం

కప్పు నీళ్లలో పది గులాబీ రేకలు వేసి మరిగించి, చల్లారిన తర్వాత వడపోసి, టీ స్పూన్ రోజ్ వాటర్ కలిపి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఉదయం, సాయంత్రం ఈ నీటిలో దూదిని ముంచి దానిని ముఖానికి, చేతులకు అద్దుకొని, ఆరిన తర్వాత శుభ్రపరుచుకోవాలి. దీని వల్ల మలినాలు తొలగిపోయి, చర్మం కాంతివంతంగా తయారవుతుంది.

ఆయనది ఎన్‌కౌంటర్ కాదు!!

ఎవరి పేరు చెప్తే ఏనుగులు తొండం ముడుచుకుని కూచుంటాయో...
ఎవరి పేరు చెప్తే పండు వెన్నెల్లో కూడా అడవికి నిలువెల్లా చెమట పడుతుందో...
ఎవరి పేరు చెప్తే పోలీసులు పీడకలలతో ఉలిక్కిపడి లేస్తారో...
ఎవరి పేరు చెప్తే గంధపుచెట్లు సువాసనలీనడం మాని బిక్కచస్తాయో...
అతడే వీరప్పన్!!
ఎన్ని కథలు... ఎన్ని గాథలు...
ఎన్ని కల్పితాలు... ఎన్ని కథనాలు...
కాని నిజం ఏంటి?
సాక్షి ప్రతినిధులకు వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి ఇచ్చిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూలో తెలుసుకోండి...


కర్నాటక- తమిళనాడు సరిహద్దులోని గోపినత్తం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ‘మునుస్వామి వీరప్పన్’ అనే సాధారణ వ్యక్తి ఆవులు మేపే వృత్తి నుంచి గంధపు చెక్కల స్మగ్లర్‌గా ఎందుకు మారాడు? నేరప్రవృత్తితోనా? కాదు... వ్యవసాయంలో వచ్చే ఆదాయం సరిపోకపోవడం వల్ల... ఇది వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి సమాధానం. వీరప్పన్ గంధపు చెక్కల స్మగ్లింగ్‌తో వందల కోట్లు సంపాదించారనే ప్రచారం వుంది. అదే నిజమైతే ముత్తులక్ష్మి ప్రస్తుత జీవితం ఇంకోలా ఉండాలి. కాని ఆమె ధర్మపురి జిల్లా మేటూరు డ్యామ్‌కు సమీపంలోని గ్రామంలో నెలకు 2 వేల అద్దె ఇంట్లో కాపురం ఉంటున్నారు. మరి వాస్తవం ఏమిటి?

పెళ్లి ఇలా జరిగింది...

మాది ధర్మపురి జిల్లాలోని సింగాపురంలో మధ్యతరగతి కుటుంబం. 1990లో నాకు పదహారేళ్లప్పుడు వీరప్పన్ ఎక్కడో చూశాడట. పెళ్లి కోసం మా నాన్న అయ్యర్ దగ్గరికి వచ్చి అడిగాడు. అప్పటికి వీరప్పన్ వయస్సు 39. ఆవులు మేపేవాడు. ఐదెకరాల పొలం. వయసు ఎక్కువ వ్యత్యాసం ఉండటం, అతడి నేపథ్యం సరిగా లేకపోవడంతో మానాన్న ఈ పెళ్లికి ససేమిరా ఒప్పుకోలేదు. దీంతో వీరప్పన్ మా తాతను మధ్యస్తానికి తెచ్చి నాకు తనతో పెళ్లి జరిపించాలని తీవ్రమైన ఒత్తిడి తెచ్చాడు. ఒక దశలో బెదిరింపులకు కూడా దిగాడు. దీంతో మా నాన్న పెళ్లికి అంగీకరించాడు.

మూడేళ్ల కాపురం...

పెళ్లయిన మూడేళ్లు బాగానే ఉన్నాం. కాని ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడం, వ్యవసాయం గిట్టుబాటు కాకపోవడంతో అప్పటికే సత్యమంగళం అడవిలో అణువణువు తెలిసిన ఆయన, అడ్డదారి తొక్కాడు. గంధపు చెక్కలను కొట్టించి అమ్మడం మొదలుపెట్టాడు. ఇలాంటి బతుకు మనకొద్దనీ ఎక్కడికైనా వెళ్లి హాయిగా బతుకుదామని అనేకసార్లు ఒత్తిడి చేశాను. చెక్కలు అమ్మి 10 లక్షలు సంపాదించి అందరం అస్సాంకు వెళ్లి స్థిరపడదామని చెప్పాడు. ఊరు చూసొస్తానని వెళ్లి లక్షల రూపాయల విలువ చేసే గంధపు చెక్కలను నరికించి అడవిలో ఒక చోట డంప్ చేయించాడు.

ఆ సంఘటనే ఆయన్ను స్మగ్లర్‌గా స్థిరపరచింది!

అయితే ఆ విషయం ఫారెస్టోళ్లకు ఎలాగో తెలిసి, సరుకును సీజ్ చేశారు. అడవి దొంగ జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్న వీరప్పన్‌ను ఈ సంఘటన తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఫారెస్టు ఆఫీసులో ఉన్న గంధపు చెక్కలను తగలబెట్టి రావాలని ఆయన పంపిన టీంలోని ఒక సభ్యుడు, గంధపు చెక్కలకు బదులు ఫారెస్టు బస్సు తగులబెట్టి వచ్చాడు. ఈ సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం కలిగించింది. కర్నాటక, తమిళనాడు ప్రభుత్వాలు వీరప్పన్‌ను వేటాడటానికి ఎస్‌టీఎఫ్ బృందాలను అడవుల్లోకి పంపాయి. దీంతో ఆయనకు అడవుల నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. వంద మంది గ్యాంగ్‌తో అడవుల్లోనే ఉంటూ అటవీ గ్రామాల ప్రజల సహకారంతో జీవిస్తూ వచ్చాడు.

నా కోసం తొలి కిడ్నాప్...

వీరప్పన్ ఎక్కడున్నాడో చెప్పమంటూ 1993లో ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను నిర్భంధించారు. కర్నాటక పరిధిలోని బన్నారి అటవీ ప్రాంతంలోని ఎస్‌టీఎఫ్ బేస్ క్యాంపులో ఉంచి చిత్రహింసలు పెట్టారు. 1994లో వీరప్పన్ నన్ను విడుదల చేయించుకోవడానికి కోయంబత్తూరు డీఎస్‌పీని కిడ్నాప్ చేశాడు. నాకు తెలిసినంత వరకు ఆయన చేసిన మొదటి కిడ్నాప్ అదే! నన్ను విడుదల చేయాలని ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చాడు. ఈ విషయం తెలిసి మహిళా సంఘటన్ అనే స్వచ్చంద సంస్థ హైకోర్టులో కేసు వేసింది. కోర్టు ఆదేశం మేరకు ఎస్‌టీఎఫ్ పోలీసులు నన్ను కోర్టులో ప్రవేశ పెట్టారు. తాము ఎలాంటి చిత్ర హింసలు పెట్టలేదని కోర్టులో చెప్పాలనీ, లేకపోతే కుటుంబ సభ్యులందరినీ చిత్రహింసలు పెడతామని పోలీసులు బెదిరించారు. నేనలానే చెప్పడంతో నన్ను విడుదల చేశారు.

వందల మందిని చంపారు!!

రానురాను వీరప్పన్ పోలీసులకు పెద్ద సమస్యగా మారాడు. అతని ఆచూకీ చెప్పాలని పోలీసులు సత్యమంగళం అటవీ గ్రామాల్లో సాగించిన నరమేధం అంతాఇంతా కాదు! సుమారు 200 కుటుంబాలు దిక్కులేనివి అయ్యాయి. కానీ ఆయన ఆచూకీ మాత్రం ఎవరూ చెప్పలేదు. ఈ పరిస్థితులకు చలించిపోయిన వీరప్పన్ సినీనటుడు రాజ్‌కుమార్‌ను కిడ్నాప్ చేశాడు. ఆయన్ను విడుదల చేయడానికి, అటవీ గ్రామాల్లో పోలీసులు చంపిన కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి రూ 10 కోట్లు విడుదల చేయాలని కర్నాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు వీరప్పన్. దీంతో ప్రభుత్వం పోలీసులు చేసిన హత్యల మీద విచారణకోసం సదాశివ కమిషన్‌ను నియమించింది. పోలీసులు అమాయకులను హత్య చేయడమే కాకుండా, మహిళలను కూడా లైంగికంగా వేధించారని కమిషన్ నిర్ధారించింది. పోలీసు అధికారుల మీద చర్యలకు సిఫారసు చేసింది. కానీ ఏ పోలీసు అధికారి మీద చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం వారికి రివార్డులు ఇచ్చింది!

అది ఎన్ కౌంటర్ కాదు!!

వీరప్పన్ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించలేదు! కొందరు వ్యక్తుల ద్వారా పోలీసులు వీరప్పన్‌కు అన్నంలో మత్తు మందు కలిపి తినిపించారు. అన్నం తిన్న ఆయన మత్తులో ఉన్నప్పుడు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత చిత్ర హింసలు పెట్టి ఆయన వెనుక ఎవరెవరు ఉన్నారో తెలుసుకున్నారు. ఆయన్ను చెన్నయ్‌లోనో, బెంగుళూరులోనో కోర్టులో హాజరు పరిచేందుకు ప్రభుత్వాలతో మాట్లాడారు. ఆయన కోర్టుకొచ్చి నోరు విప్పితే అనేకమంది రాజకీయ నాయకుల పేర్లు బయటకు వస్తాయనే భయంతో ఆ రెండు ప్రభుత్వాలు వీరప్పన్‌ను కాల్చి చంపాలని సూచించాయి. దీంతో పోలీసులు ఆయన్ను అక్టోబర్ 18, 2004 కాల్చి చంపారు.

నా మీద కూడా హత్యకేసులు...

నేను వీరప్పన్‌తో కలసి ఐదు హత్యలు చేశానని నా మీద కేసులు పెట్టారు. గూండా యాక్ట్ కింద సెక్షన్లు నమోదు చేసి 2008లో నన్ను మైసూర్ జైల్లో పెట్టారు. ఇవన్నీ తప్పుడు కేసులని రుజువు కావడంతో 2011లో కోర్టు నన్ను నిరపరాధిగా విడుదల చేసింది. వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. ఇప్పుడు మీరు వచ్చిన విషయం కూడా వాళ్లు పసిగట్టే ఉంటారు. పోలీసుల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను. 

డబ్బు ఎక్కడుందీ?

వీరప్పన్ అడవులను కొల్లగొట్టి వందల కోట్లు సంపాదించారని ప్రచారం జరుగుతోందిగానీ ఆయన ఒక్క రూపాయి కూడా మా కుటుంబం కోసం ఇవ్వలేదు! అదే నిజమైతే ఈరోజు నేను, నా పిల్లలు ఊరొదిలి వచ్చి ఇక్కడ అద్దె ఇంట్లో ఉండాల్సిన ఖర్మ లేదు. వీరప్పన్‌కు పిత్రార్జితంగా వచ్చిన 5 ఎకరాల భూమిలో వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయంతోనే కష్టంగా బతుకు బండి లాగిస్తున్నాం. వీరప్పన్ తన గ్యాంగ్‌కు ఆహారం, బట్టలకు సరిపడేంత డబ్బు మాత్రమే సంపాదించుకునే ప్రయత్నం చేశారు. కాని ఆయన పేరు చెప్పుకుని కర్నాటక, తమిళనాడులోని అనేకమంది రాజకీయ నాయకులు కోట్లు సంపాదించారు. కొంతమంది పోలీసు అధికారులు కూడా కోట్లు దోచుకున్నారు. బయటి ప్రపంచానికి వీరప్పన్ స్మగ్లర్, క్రూరుడు కానీ సత్యమంగళం అటవీ గ్రామాల ప్రజలకు ఆయన ఒక హీరో! వారి బాగోగులు చూసిన దేవుడు! అందుకే ఆ గ్రామాల్లోని చాలా ఇళ్లలో ఇప్పటికీ వీరప్పన్ ఫొటోలు ఉంటాయి. అక్కడి ప్రజలకు ఆయనంటే ఎంత అభిమానమో దాన్నిబట్టే తెలుసుకోవచ్చు.

ఆయన్ను విలన్‌గా, హంతకుడిగానే ఎందుకు చూపుతారు?

వీరప్పన్‌ను విలన్‌గా, హంతకుడిగా చూపుతూ అనేకమంది సినిమాలు తీస్తున్నారు. కన్నడ దర్శకుడు ఎఎం ఆర్ రమేష్ అట్టహాస పేరుతో కన్నడంలోను, వనయుద్ధం పేరుతో తమిళంలోను సినిమా తీశాడు. పోలీసులనే హీరోలుగా చూపిస్తున్న ఆ దర్శకుడు ఆవులు మేపుకునే వీరప్పన్ ఎందుకు అడవులకు పోయాడు, దానికి కారణాలేంటి? ఆయన వల్ల ఎవరు లాభపడ్డారు? ఆయన్ను ఎవరు ఎలా ఉపయోగించుకున్నారు? అనే విషయాలను సినిమాలో చూపలేదు. దాంతో ఆ సినిమాలను నిలిపి వేయాలని కోర్టును ఆశ్రయించాను. ప్రస్తుతం జడ్జిమెంట్ పెండింగ్‌లో ఉంది. దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరప్పన్ గురించి హిందీలో సినిమా తీయడం కోసం ఓసారి నన్ను కలిశారు. వీరప్పన్ జీవితంలోని అన్ని సంఘటలను తెర కెక్కించేందుకు తెలుగులో కూడా ఎవరైనా ముందుకొస్తే వారికి సహకరిస్తాను.

- ఎస్. నగేష్, బ్యూరో ఇన్‌చార్జ్, తిరుపతి
(కుప్పం వెంకటేష్ సహకారంతో....)


పెద్ద కూతురిని మాత్రమే చూశాడు!

మాకు ఇద్దరు కూతుర్లు. ఆయన పెద్ద కూతురు విద్యారాణిని మాత్రమే చూశారు. చిన్న కూతురు ప్రభను చూడనే లేదు. ఆయన మీద పోలీసుల నిఘా ఎక్కువైనప్పటి నుంచి నేను ఆయన్ను తక్కువసార్లే కలిశాను. చూడాలనిపించినప్పుడు నన్ను పిలిపించుకునే వారు. చివరిసారిగా నేను ఆయన్ను 2000 సంవత్సరంలో చూశాను. నాక్కూడా అందరి లాగా భర్త, పిల్లలతో కలసి సరదాగా గడపాలనీ, హాయిగా ఉండాలనే కోరిక ఉండేది. అయితే ఆ దేవుడు నా తలరాత ఇందుకు భిన్నంగా రాశాడు. ఇప్పుడు పెద్దమ్మాయికి పెళ్లయ్యింది. చిన్నమ్మాయి బిఏ చదువుతోంది. నేను నా కూతురు, మానాన్న, మా అన్న, వదిన, వారి పిల్లలు కలసి ఉంటున్నాం.

వీరప్పన్‌ను చంపి ఎనిమిదేళ్లు గడిచినా నా చుట్టూ ఇంకా పోలీసు నిఘా తీసివేయలేదు. వాళ్ల వేధింపుల వల్ల ఇప్పటికీ నేను మా కుటుంబ సభ్యులతోగాని, బంధువులతోగాని స్వేచ్ఛగా ఎక్కడికీ వెళ్లలేకపోతున్నాను.
- ముత్తులక్షి, వీరప్పన్ భార్య
  

Tuesday, December 4, 2012

ఇంతిలోని శక్తి ఇంతింత కాదయా..!

‘ఆడవాళ్లు అబలలు.. బాహ్య ప్రపంచం ఏమీ తెలియని అజ్ఞానులు’-అనుకునే రోజులు పోయ దాదాపు రెండు దశాబ్దాలు గడిచాయ. అటు చదువుల్లోనూ, ఇటు ఉద్యోగాల్లోనూ కూడా మగవాళ్ళకంటే ఆడవాళ్లే ముందున్నారన్న విషయాన్ని, సంపాదనలో కూడా ఆడవాళ్లే ముందు వరసలో నిలబడ్డారని చార్టడ్ ఇనిస్టిట్యూట్‌కి చెందిన ఆర్థిక, గణాంక నిపుణులు ఓ సర్వేలో తేల్చి చెప్పారు. కొద్దికాలంలోనే ఈ పెరుగుదల మరింత అనూహ్యంగా ఉంటుందని కూడా చెప్పారు. భవిష్యత్‌లో- పురుషులు స్ర్తిలకన్నా ఎక్కువ సంపాదనాపరులనో లేక సరిసమానంగా సంపాదిస్తున్నారనో వింతగా చెప్పుకోవచ్చు. స్ర్తిలే ఎక్కువగా సంపాదిస్తున్నారన్న విషయం బాగా వ్యాప్తిలోకొస్తుంది. నిజంగా అలాగే జరిగితే- పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ ప్రభావం పెళ్లిళ్లమీదా పడుతుంది. పెళ్లిళ్ళ తంతులో పెనుమార్పులే రావొచ్చు!
అసలు మహిళల ప్రగతి ఎలా సాధ్యమైందని అని ఆలోచిస్తే ఎన్నో విషయాలు తెలుస్తాయ. సంవత్సరాల తరబడి మహిళా హక్కుల కోసం పోరాటాలు జరిగాయ. విద్యలో ఆడపిల్లలు మగపిల్లలతో పోటీపడడమే కాదు వారికన్నా ఎక్కువ శ్రద్ధతో చదివి, ఎక్కువ మార్కులతో ఉత్తీర్ణులవడం సాధ్యమైంది. మంచి ప్రవర్తనతోనూ, సామర్థ్యంతోనూ, నిజాయితీతోనూ, సరైన వ్యక్తిత్వంతో అమ్మాయలు రాణించగలుగుతున్నారు. ఇక మగపిల్లలు అనేకమంది దురలవాట్లకు లోనవుతున్నారు. ధూమపానం, తాగుడు, హుక్కా, డ్రగ్స్‌వంటి వ్యసనాల్లో పడడం, క్లబ్బుల్లో, పబ్బుల్లో పడి చదువుకునే వయస్సులో చదువునీ, ఉద్యోగం చేసే వయస్సులో ఉద్యోగాన్నీ కూడా నిర్లక్ష్యం చేస్తూ జల్సాగా తిరగడానికి అలవాటుపడి, జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మంచి కుటుంబాల్లో నుంచి వచ్చే పిల్లలు కూడా పిచ్చి పిచ్చి టైటిల్స్‌లో వచ్చే సినిమాలు చూసి ఆ హీరోల్లా (వాళ్లు నిజ జీవితంలో బాగానే వుంటారు, డబ్బు కోసం ఓ వృత్తిగా అలా నటిస్తున్నారని అనుకోకుండా) వుండడానికి ప్రయత్నిస్తూ, పతనమైపోతున్నారు చాలామంది. మరికొందరు కేవలం డబ్బు సంపాదనే ధ్యేయమని భావిస్తున్నారు. చదువైనా డబ్బు సంపాదనకేగా!- అనే వెర్రి ఆలోచనలతో అదేదో ముందే సంపాదనామార్గం ఎన్నుకుంటే పోలేదూ అని చదువుని నిర్లక్ష్యం చేసి పెడదారులు పడుతున్నారు.
ఆడపిల్లలు బాగా చదువుకుని, చక్కటి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. పైగా కాలం తెచ్చే మార్పులవల్ల అంటే, మహిళలను ప్రోత్సహించే పథకాలూ, మహిళా సంఘాల ప్రవచనాలవల్ల, కాస్త ఎదిగిన ఆడపిల్లలు మగ పిల్లలంటే భయాన్ని పోగొట్టుకుంటున్నారు. నిర్భయంగా, బాలుర కాలేజీలోనూ ఎలాంటి న్యూనతాభావం లేకుండా ధైర్యంగా చదువుకోగలుగుతున్నారు.
సహజంగా బాలికలలో బాలురకంటే ఆత్మవిశ్వాసం ఎక్కువ, ఆత్మాభిమానమూ ఎక్కువే. పట్టుదల కూడా ఎక్కువే. ఏదైనా సాధించాలనుకుంటే లక్ష్యసిద్ధి కోసం పాటుపడతారు. అందుకే అన్నారు మన పూర్వీకులు- ‘‘ముదితల్ నేర్వగలేని విద్య కలదే, ముద్దార నేర్పింపగన్’’ అని. ఆ రోజుల్లో అనేక అభద్రతా కారణాల వల్ల, అర్థంలేని అనేక ఆచారాల వల్లా, మూఢ నమ్మకాల వల్లా పాటించలేకపోయారు. క్రమేణా అవి తగ్గి, ఆడపిల్లలకు అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి అని చాలామంది విద్యావేత్తలూ, మేధావులూ అభిప్రాయపడుతున్నారు.
ఇలా పరిస్థితులు అనుకూలించడంతో పెరిగిన మహిళల ఆదాయం కనీసం కొన్ని దశాబ్దాలు ఇలాగే సాగుతుందని, చార్టర్ మేనేజ్‌మెంట్ నిపుణుడు మహేశ్ వాస్వానీ చెప్పారు. మగ పిల్లలు ఈ విషయాన్ని గ్రహించి శ్రద్ధ తీసుకోకపోతే వారి ప్రాముఖ్యం గణనీయంగా పడిపోతుంది కనుక, ఇప్పటినుంచే వారు నైపుణ్యాన్ని పెంచుకోవలసిన అవసరం ఉంది. బాధ్యతగల పౌరులుగా వారు మెలగాలని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో మహిళల ఆలోచనా ధోరణి, ఆచరణలు చాలా మారిపోయాయి. వారిలో నైపుణ్యం కూడా బాగా పెరిగిపోతోంది. ఈ మార్పు ఇప్పటికే తెలుస్తూన్నా, రాను రాను ఇంకా ప్రస్ఫుటంగా తెలుస్తుందని చెబుతున్నారు పరిశీలకులు. ఈ రీతిలో పురుషులూ పుంజుకుంటే, భారతదేశం అగ్రదేశాలలో ఒకటిగా నిలుస్తుందని వారు అంటున్నారు. ‘‘మేరా భారత్ మహాన్... హై...!

ఫ్లోరైడ్ ఉన్న నీరు ప్రమాదమా!

మనం తాగే నీరు ఎంతో స్వచ్ఛంగా ఉండాలి. కలుషిత నీరు ఎంతో ప్రమాదకరం. అందునా ఫ్లోరైడ్, ఇతర లవణాలు అధికశాతంలో ఉన్న నీరు మరీ ప్రమాదకరం. ఇది నేరుగా మన శరీర వ్యవస్థనే దెబ్బతీస్తుంది.

నీటిలో ఫ్లోరైడ్ శాతం 1.5 మి.గ్రా. కంటే ఎక్కువ ఉంటే ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. మెడ వంగిపోవడం, కాళ్లు, చేతులు వంకరలు తిరగడం, ఎముకలు పెళుసుగా తయారై విరిగిపోవడం వంటివి ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు. దురదృష్టమేమంటే ఈ నీటిని చాలాకాలం నుంచీ తాగుతున్నప్పటికీ దాని ప్రభావం తొలిదశలో ఏమీ తెలియదు. కనీసం 12 సంవత్సరాల నుంచి బయటపడుతూ ఉంటుంది. పంటిమీద పచ్చగా గార ఏర్పడుతుంది. దీని ద్వారా ఫ్లోరైడ్ సోకిందని చెప్పవచ్చు

పావురం తెలివి!-kids story

ఒకరోజు పులి సింహంతో పోట్లాడి గెలవాలనుకుంది. అంతే! వెంటనే సింహం గుహ దగ్గరికి వెళ్లి ధైర్యంగా నిలబడి గట్టిగా అరిచింది. అది మధ్యాహ్నం కావడంతో సింహం బాగా తిని నిద్రపోతోంది. పులి గాండ్రింపులకు మేల్కొని కోపగించుకుంది. ‘‘ఎవరక్కడ?’’ అని అరిచింది. పులి మరింత గట్టిగా అరిచింది. దాంతో సింహం కోపంగా గుహలోంచి బయటికి వచ్చి పులివైపు తీక్షణంగా చూసింది.

‘‘ఎందుకలా అరుస్తున్నావు? నీకేం పనిలేదా? ఫో’’ అంది. పులి ఏమాత్రం భయపడలేదు. ‘‘ఈ ప్రాంతమంతా నాది. నన్ను వెళ్లమనడానికి నువ్వెరవు?’’ అని ప్రశ్నించింది. అదే సమయానికి ఒక పావురం వచ్చి ఏం జరిగిందని అడిగింది. అవి చెప్పింది విని ‘‘ఓస్ ఇంతేనా?’’ అంది పావురం.

వెంటనే వాటి మధ్య నిలిచి సింహాన్ని గుహలోకి వెళ్లమంది. దాని వెనకనే పావురం కూడా వెళ్లింది. లోపలికి వెళ్లిన తర్వాత సింహాన్ని తన చెవుల్లో దూది పెట్టుకోమంది. ‘‘అప్పుడు పులి ఎంత అరిచినా వినపడదు, హాయిగా నిద్ర పోవచ్చు’’నంది. సింహం సంతోషించి దూది పెట్టుకుంది. పావురం గుహలోంచి బయటికి వచ్చి పులి దగ్గరికి వెళ్లి, ‘‘ఇపుడు నీ ఇష్టం వచ్చినంత గట్టిగా అరుచుకో, సింహం నిన్నేమీ చేయలేదు’’ అంది.

పులి అలానే చేసింది. సింహానికి నిద్రాభంగం కలగలేదు. మర్నాడు సింహం బయటికి వచ్చి ఎదురుగా ఓ చెట్టుమీదికి వచ్చిన పావురానికి కృతజ్ఞతలు చెప్పింది. మధ్యాహ్నం పులి దగ్గరికి రివ్వున వెళ్లి, ‘‘నువ్వు సింహం గుహదగ్గరే అరవాలని లేదు. అదుగో ఆ గుట్టమీద ఎక్కి కూడా అరవచ్చు. అప్పుడు అడవంతా వినపడుతుంది. నీకు ఎదురులేదు’’అని బుజ్జగించింది. ‘‘ఆహా ఎంత మంచి మాట చెప్పావు మిత్రమా!’’ అని పులి ఆ గుట్టమీదకి ఎక్కింది. పావురం చక్కగా ఎగిరి వె ళ్లిపోయింది.
అందరం జీవితమనే వరదలో కొట్టుకుపోయేవారమే. కొందరు మాత్రమే ఆకాశంలోని తారకలను చూడగలరు.
- ఆస్కార్‌వైల్డ్

అందమె ఆనందం

గంధం చెక్కను కొద్దిగా నీళ్లు వేసి, రాయి మీద అరగదీసి, ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేయాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరచుకోవాలి. మొటిమలు, యాక్నే సమస్యలు తగ్గుముఖం పడతాయి.

గురువాక్యం శిరోధార్యం-నిత్య సందేశం

రామునివల్ల ఉత్తమగతి పొందిన కబంధుడు తాను పొందిన సాయానికి కృతజ్ఞత చూపిస్తూ ‘‘రామా! సుగ్రీవుని వద్దకు వెడితే నీకు ఉపకారం జరుగుతుంది. దారిలో మతంగ ముని ఆశ్రమం ఉంటుంది. అక్కడకు తప్పకుండా వెళ్ళు. అక్కడ నీకోసం శబరి ఎదురు చూస్తోంది, ఆమెకు నీ దర్శనభాగ్యాన్ని కలిగించు. ఆమె చేసే సేవలను అందుకుని ఆమెను తరింపజెయ్యి. నీకు మంచి జరుగుతుంది’’ అని చెప్పి అదృశ్యమైపోయాడు.

పంపా సరస్సు సమీపంలో ఉన్న మతంగ మహర్షికి శిష్యురాలు శబరి. గురువును సేవించడమే తన జీవితానికి ధన్యత్వంగా భావిస్తూ, సేవ చేసింది. కొంతకాలం తరువాత మతంగుడు యోగం ద్వారా తన భౌతిక శరీరాన్ని విడిచి, పుణ్యలోకాలకు వెళ్ళాలనుకొన్నాడు. తనను కూడా తీసుకుపొమ్మంది శబరి. ‘‘నువ్వు ఇంకా కొంతకాలం ఈలోకంలోనే ఉండాలి. దైవసేవ చేసుకుంటూ కాలం గడుపుతూ ఉండు. శ్రీరామచంద్రుడు తన తమ్ముడైన లక్ష్మణునితో కలిసి ఒకనాడు ఇక్కడికి వస్తారు. ఆయనను సేవించు. ఆ పుణ్యం వల్ల నీకు మోక్షం లభిస్తుంది’’ అని చెప్పి, గురువు సిద్ధిని పొందాడు. రాముడు ఎవరో తనకు తెలీదు. ఎందుకు వస్తాడో తెలీదు. తనకు ఏ సంబంధమూ లేని వ్యక్తికోసం తాను ఎందుకు ఎదురు చూడాలని అడగలేదు. గురువు వాక్యం శిరోధార్యం అనుకుని, అలాగే ఎదురుచూస్తోంది.

క్రమక్రమంగా వయసు మీదపడుతోంది. శరీరానికి పటుత్వం తప్పుతోంది. వార్ధక్యం బాధిస్తోంది. జరాదుఃఖాన్ని భరిస్తోంది. తలచుకుంటే గురుసేవ వలన తనకు లభించిన యోగవిద్య ద్వారా శరీరాన్ని విడిచిపెట్టగలదు శబరి. కాని గురువుగారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. పోనీ ఇంతకాలానికి వస్తాడని ఒక స్పష్టమైన సమయాన్నైనా గురువుగారు చెప్పలేదు. చెప్పమని శబరి అడుగనూ లేదు. గురువు చెప్పింది వినడమే తప్ప, ఎదురుప్రశ్నలు వేసే అలవాటు, తిరస్కరించే నైజం లేదు. అందుకని రాముని రాకకోసం ఎదురు చూస్తోంది.

శబరి చూపులు ఫలించాయి. రాముడు రానే వచ్చాడు. అవధి లేని ఆనందంతో గబగబ ఎదురేగింది. సాదరంగా ఆహ్వానించింది. పాద్యం, అర్ఘ్యం ఇచ్చింది. కూర్చోవడానికి ఆసనాన్ని సిద్ధం చేసింది. ఆ అడవిలో దొరికే మధురమైన ఆహారాన్ని తెచ్చి ఇచ్చింది. ఆయన రాక వల్ల తనకు విముక్తి కలిగిందని కాకుండా గురువాజ్ఞను పాటించేందుకు ఇన్నాళ్ళకు అవకాశం దొరికిందని ఆనందపడి, కుశలప్రశ్నలు వేసింది. ఆమె చేసిన సపర్యలన్నీ ఆనందంగా స్వీకరించాడు రాముడు. ఆ తరువాత సోదరులు ఇద్దరూ చూస్తుండగానే ఆమె మోక్షాన్ని పొందింది.

రాముడు తన గురువులైన వశిష్ఠ విశ్వామిత్రులను ఏనాడూ తిరస్కరించలేదు. అందువల్లే మరొక గురుభక్తురాలికి మోక్షాన్ని అనుగ్రహించగలిగాడు. ఆయుర్వేదశాస్త్రాన్ని క్షుణ్ణంగా అభ్యసించిన ఇందీవరాక్షుడు, అవసరం తీరగానే తన గురువైన బ్రహ్మమిత్రుని దూషించాడు. ఫలితంగా విద్య నిరుపయోగమైపోవడమే కాకుండా బ్రహ్మరాక్షస జన్మను పొందాడు. అందువల్ల గురువాక్యం శిరోధార్యం. గురుద్రోహం, గురుతిరస్కరణం, గురుద్రవ్యాపహరణం మహాపాతకం.

- డా. కడిమిళ్ళ వరప్రసాద్

బిగ్ బాసెస్..!---అలా పెంచాం *;*






పిల్లల బుర్రల్లో యక్ష ప్రశ్నలుంటాయి... పెద్దలకు లక్ష పనులుంటాయి. ప్రతి ప్రశ్నకూ జవాబు దొరకదు...ప్రతి జవాబూ సంతృప్తినివ్వదు. పైగా శ్రవణ్, సంజయ్ వండర్ కిడ్స్! ఏమిటి? ఎందుకు? ఎలా? అని కొరుక్కుతినేస్తున్నారు! వాట్ టు డూ? దేవుడా!.. ఆలోచించారు తల్లిదండ్రులు. తాము కూడా ఓ మూడు ‘ఎ’లను ప్రయోగించారు. ఎఫెక్షన్... యాక్సెప్టెన్స్... అచీవ్‌మెంట్! పథకం ఫలించింది! ప్రశ్నల్లోంచి ప్రయోగాల్లోకి వచ్చారు పిల్లలు. ప్రయోగాల్లోంచి ప్రోగ్రామింగ్‌లోకి వచ్చారు. ఇప్పుడీ చిన్నారులిద్దరూ ‘గోడెమైన్షన్స్’ అనే కంపెనీకి బాస్‌లు! ఎలా సాధ్యం? ‘‘పిల్లల్ని వేలు పెట్టనివ్వండి. వేలెత్తి మాత్రం చూపకండి. అప్పుడు ఏదైనా సాధ్యమే’’ అంటున్న కుమరన్ కపుల్ పెంపకంలోని మెళకువలే ఈ వారం మన ‘ అలా పెంచాం’.

‘ఎఫెక్షన్... యాక్సెప్టెన్స్... అచీవ్‌మెంట్... ఈ మూడు పదాలు ఆంగ్లభాషలో ‘ఏ’తో మొదలవుతాయి. ఈ మూడు ‘ఏ’లను మేము మా పెంపకంలో పాటించాం. మా పిల్లల అభివృద్ధికి కారణం ప్రేమ.. అంగీకారం... సాఫల్యం’ అన్నారు శ్రవణ్, సంజయ్‌ల తల్లిదండ్రులు కుమరన్, జ్యోతిలక్ష్మిలు.

‘పిల్లలను ప్రేమించాలి. వారి ఇష్టాయిష్టాలను స్వీకరించాలి. అప్పుడే వారు ఏ విజయాన్నైనా సాధించగలరు’ అంటారు వాళ్లు. ఈ భార్యాభర్తలు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు. ఇంజనీరింగ్ పితామహుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు వీరు సమీప బంధువులు.

‘‘బెంగళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తుండగా మాకు పరిచయమై 1998లో వివాహం చేసుకున్నాం. మంచి అవకాశం రావడంతో కాపురాన్ని యూఎస్‌కు షిఫ్ట్ చేశాం. అక్కడ పిల్లలు ఎదుగుతున్న సమయంలో వారిపై పాశ్చాత్య ప్రభావం ఉండకూడదని 2004 డిశంబరులో శాశ్వతంగా ఇండియాకు వచ్చేశాం. నాది బెంగళూరైనా, మా వారిది చెన్నై కావడంతో చెన్నైలోనే స్థిరనివాసం ఏర్పరచుకున్నాం’’ అన్నారు జ్యోతి లక్ష్మి.

డబ్బు కాదు... పిల్లలే ముఖ్యం
‘‘పెద్దబాబును రెండవ తరగతి, చిన్నబాబును యూకేజీలో చేర్పించాక నేను చెన్నైలోని ఒక ప్రముఖ అమెరికన్ కంపెనీలో డెరైక్టర్‌గా ఉద్యోగంలో చేరాను. తను మాత్రం పెద్దజీతం కోసం పిల్లల జీవితాన్ని తాకట్టుపెట్టకూడదన్న ఉద్దేశ్యంతో ఉద్యోగం జోలికి వెళ్లలేదు’’ అన్నారు కుమరన్. ‘‘బిడ్డల పెంపకంలో మేమిద్దరం ఎవరిపాత్ర వారిదిగా వ్యవహరించాం. పిల్లలు డ్రీమ్స్‌ను సెట్ చేసుకోలేరు, అందుకే అన్ని విషయాల్లోనూ ఎంకరేజ్ చేసేదానిని’’ అని చెప్పారు జ్యోతి ‘‘చిన్నప్పుడే ఐన్‌స్టీన్ వంటి ప్రముఖ సైంటిస్టులు, వారి గొప్పదనం, వారు కనుగొన్నవాటి గురించి ఎక్కువగా చెప్పేదానిని. విమానాన్ని రైట్ బ్రదర్స్ మొదటగా కనుగొన్నారు, మీరు కూడా మన దేశానికి ఏదైనా తయారు చేసి ఇవ్వాలని చెప్పాను. భారతదేశంలో ఒక గొప్ప కంపెనీ మీ ఇద్దరి నుండి రావాలని బోధించాను’’ అన్నారామె.

ప్రశ్నించడమే జ్ఞానం...
‘‘నేను హోమ్‌సైన్స్‌లో చైల్డ్‌సైకాలజీ చదివాను, ఇది నా పిల్లల పెంపకంలో ఎంతో పనికివచ్చింది’’ అని జ్యోతిలక్ష్మి ఆనందపడ్డారు. ‘‘అది ముట్టుకోవద్దు, ఇది చెడిపోతుంది... అంటూ పిల్లలకు పెద్దలు ఆంక్షలు విధించడం తప్పు. ఉదాహరణకు.. టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే వారిచేతికి ఇచ్చితీరాలి. లేకపోతే అలానే డార్క్‌లో మిగిలిపోతారు’’ అన్నారామె. ‘‘ఇంటిలోని కంప్యూటర్‌లో ఆఫీసు పనిచేసుకుంటున్నపుడు మూడు నాలుగేళ్ల వయసులోనే ఇద్దరూ వెనుక నిలబడి గమనించేవారు.

ప్రతి చిన్నవిషయాన్నీ ప్రశ్నించేవారు, ఇద్దరం ఓపిగ్గా బదులిచ్చేవాళ్లం’’ అని సురేంద్రన్ అన్నారు. ‘‘కంప్యూటర్ వారిలోని ఆసక్తికి బీజం వేసింది. క్రమేణా వారే సొంతగా ఆపరేట్ చేయడం ప్రారంభించారు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను నేర్పించడం ప్రారంభించాం. అవసరమైన పుస్తకాలను ఇచ్చాం. చాలా వేగంగా వాటిల్లోని అంశాలను అందిపుచ్చుకోవడం ప్రారంభించారు. మొదట మొబైల్ ఫోన్ ప్రోగ్రామింగ్ చేస్తామన్నారు. అది నాకు తెలియకపోవడంతో అందుకు సంబంధించిన పుస్తకాలను తెచ్చిచ్చాను’’ అని సురేంద్రన్ తెలిపారు.

సంస్థ స్థాపన..
‘‘హైస్కూలు విద్యార్థులుగా కేవలం ఏడేళ్ల సాధనతో గో డైమన్షన్స్ అనే కంపెనీని రిజిష్టర్ చేయించారు. మొబైల్‌ఫోన్స్‌లో గేమ్స్, లెర్నింగ్ అప్లికేషన్స్, లైఫ్‌స్టైల్ అప్లికేషన్స్ తయారుచేశారు. ఐపాడ్, ఐ ఫోన్, ఆండ్రాయిడ్ ఫోన్స్‌లలో అప్లికేషన్‌ను డెవలప్‌చేసే సాఫ్ట్‌వేర్‌ను వీళ్లు కనుక్కొన్నారు. జావా, సీ లాంగ్వేజ్‌ల ద్వారా ఈ ప్రోగ్రామ్‌ను డెవలప్ చేశారు. ఇటువంటి సాఫ్ట్‌వేర్ మార్కెట్‌లో పూర్తిగా కొత్త. క్యాచ్‌మీ కాప్, కలర్ పల్లెట్, ఆల్ఫాబీట్ బోర్డ్, ప్రేయర్ ప్లానెట్ అనే నాలుగు మొబైల్ అప్లికేషన్స్‌ను పిల్లలు కనుగొన్నారు. ఈ నాలుగు అప్లికేషన్స్ 43 దేశాల్లో ప్రఖ్యాతి పొందాయి, 18 వేల డౌన్‌లోడ్లు అయ్యాయి. డౌన్‌లోడ్ ఉచితంగా పెట్టినా ప్రకటనల ద్వారా ఆపిల్ కంపెనీ నుండి కేవలం ఆరునెలల్లో 200 యూఎస్ డాలర్లను పిల్లలు ఆర్జించారు’’ అన్నారు ఇద్దరూ.

ప్రేమ - భక్తి
‘‘భగవంతుని పట్ల భక్తిభావనను పిల్లల్లో పెంచడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది. అందుకే పిల్లలు తమ కంపెనీకి గో డైమన్షన్స్ అనే పేరుపెట్టుకున్నారు. కంపెనీ తొలి మూడు ఇంగ్లీషు అక్షరాలు కలిపి చదివితే గాడ్ అని వస్తుంది. అలాగే డైమన్షన్స్ అంటే ఒకేదానికి కట్టుబడకుండా భిన్నకోణాల్లో ఎదగాలనే భావనను సంస్థ పేరు ద్వారా మా పిల్లలు వెలిబుచ్చారు. ఒకసారి మేం నలుగురం చెన్నై నుండి యూఎస్‌కు బయలుదేరాం. విమానం గాలిలో తీవ్రంగా కుదుపులకు లోనైంది. నాకు భయమేసింది. నా బ్యాగులో భద్రపరుచుకునే దేవుని విగ్రహం కోసం పాకులాడాను. ఎంతో వెతికిన తరువాత విగ్రహం దొరికింది. దానిని ఒళ్లో పెట్టుకుని ప్రార్థించాను. మా పిల్లలు ఇదంతా గమనించారు.

విమానం యూఎస్‌లో ల్యాండయ్యేలోగా ప్రేయర్ ప్లానెట్ అనే మొబైల్ అప్లికేషన్‌ను కనుగొన్నారు. మొబైల్ ద్వారా సులభరీతిలో అన్నిమతాల దేవుళ్ల బొమ్మలను చూస్తూ నామస్మరణను వినేలా అప్లికేషన్‌ను అప్పటికప్పుడే రూపొందించారు. ఈ ప్రేయర్ ప్లానెట్ ఎంతో ప్రఖ్యాతిని పొందింది. అలాగని వారు పుస్తకాల పురుగులు కారు. సంగీతం, గానం, నాట్యం, రచన, క్రీడలు అన్నింటిలో మెచ్చదగిన ప్రవేశం ఉంది.

మొబైల్‌లో రూట్‌మ్యాప్, వాతావరణ కాలుష్యశాతాన్ని తెలుసుకునేలా సాఫ్ట్‌వేర్‌ను తయారుచేయాలని, అంధులు మనిషి తోడు లేకుండా సెల్‌ఫోన్ సహాయంతో నడిచే సాఫ్ట్‌వేర్‌ను క నిపెట్టాలని మా పిల్లలు భావిస్తున్నారు. పిల్లలు స్నేహితుల్లా మెలగాలని చెప్పడం ఇద్దరి మధ్య అనుబంధాన్ని శాశ్వతం చేస్తుంది. అందుకే మా పిల్లలు ప్రతి విషయాన్నీ మాతో షేర్ చేసుకుంటారు. ఉన్నత చదువులున్న తల్లిదండ్రులే పిల్లలను తీర్చిదిద్దగలరని చెప్పలేం. పిల్లల ఆసక్తిని గుర్తించడం, తగిన విధంగా ప్రోత్సహించడంలోనే ఉంటుంది పెంపకంలోని మెళకువ. లెట్ దెమ్ డ్రీమ్ బిగ్ ’’ అంటూ ముగించారు ఆ తల్లిదండ్రులు.
- కొట్రా నందగోపాల్, బ్యూరో చీఫ్, చెన్నై
ఫొటోలు: వన్నె శ్రీనివాసులు


టీ కప్పు కిందపడితే పగిలిపోతుందని పిల్లలకు తెలియాలంటే కప్పును వారిచేతికి ఇచ్చితీరాలి. లేకుంటే అలానే డార్క్‌లో మిగిలిపోతారు అంటారు కుమరన్ కపుల్. ఈ ప్రోత్సాహమే శ్రవణ్ (13), సంజయ్ (11) లు గోడెమైన్షన్స్ అనే సాఫ్ట్‌వేర్ సంస్థను స్థాపించి, అంతర్జాతీయ ఖ్యాతిని సాధించేలా చేసింది. ప్రస్తుతం తమ కంపెనీకి ఒకరు చైర్మన్‌గా, మరొకరు సిఈవోగా ఉన్న ఈ వండర్ కిడ్స్‌తో తల్లిదండ్రులు జ్యోతిలక్ష్మి, సురేంద్రకుమరన్

బ్యాచిలర్ బాబులు.. మీ రూమ్‌లో ఇవున్నాయా..?

సాధారణంగా కాలేజీ చదువులు ముగయగానే ఉద్యోగాలంటూ... సొంత మనుషులను, కొన్ని సంబంధ భాంద్యవ్యాలను సొంత ఊరును వదులు కొన్ని ఇతర ప్రదేశాలకు వెళ్ళి కొత్త జీవితాన్ని మొదలుపెడుతారు. యూత్ బ్యాచిలర్ జీవితాన్ని గడుతారు. అక్కడ ఒక ప్రత్యేకమైన వాతవరణం. ఒంటరితనంతో జీవించాల్సి ఉంటుంది. అయితే బ్యాచిలర్ లైఫ్ ను కూడా బ్యూటిఫుల్ లైఫ్ గా మలచుకోన్నప్పు వారి జీవితం మరింత సుఖంగా మార్చుకోగలుగుతారు.
ఒంటరిగా నివశించే వాతావరణంతో పాటు వారికి కావాల్సిన సదుపాయాలను కూడా పర్ఫెక్ట్ గా అమర్చుకోగలిగినప్పుడు వారి జీవితం హాయిగా ఉంటుంది. అందుకోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సిన పనిలేదు. కానీ కొన్ని వస్తువును మాత్రం మీ బ్యాచిలర్ జీవితాని తప్పకుండా ఉండాల్సినవి, ఉపయోగపడే వాటిని తప్పకుండా అమర్చుకోగలగాలి. మరి అవేంటో చూద్దాం..


కాఫీ మేకర్


మీకు కాఫీ అంటే చాలా ఇష్టం కాద. కాబట్టి కాఫీ మేకర్ మీ కొనుగోలు లిస్ట్ లో మొదటిది, తప్పనిసరిగా ఉండేట్లు చూసుకోండి.ఒక మంచి కాఫీ మేకర్ ను కొనడం వల్ల మీ బ్యాచిలర్ హోంలో ఒక అలంకరణగానే కాదు మీ అవసరాన్ని తీర్చిదికగా కూడా ఉంటుంది. మీ రూమ్ కు మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా చిటికెలో కాఫీ కలిపి ఉవ్వొచ్చు. మీరు అలసిన రూమ్ కి రాగానే మీకు చక్కటి కాఫీ తయారు చేసే మిషన్ మీ చెంత ఉంటే ఒక మనిషి మీతో ఉన్నట్టే అని భావించాలి.
 

ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్


బ్యాచిలర్ రూమ్ లో మరొకటి తప్పనిసరిగా ఉండేది. మీకు ఎంటర్ టైన్మెంట్ అందించేది టెలివిజన్. వీడియోగేమ్స్.
మీకు మీ ఫ్రెండ్ లా ట్రీట్ చేసిది వీడియో గేమ్స్. ఇక ఫ్లాట్ స్ర్కీన్ టెలివిజన్ రాత్రి సమయంలో కొంచెం ఎంటర్ టైన్మె అందించే క్రికెట్, ఫుట్ బాల్ వంటి స్పోర్ట్స్ ను చూసి ఎంజాయ్ చేయడానికి. కాబట్టి టెలివిజన్ రెండవదిగా మీ లిస్ట్ లో చేర్చుకోండి.


మినీ ఫర్నీచర్


బ్యాచిలర్ లైఫ్ అయినా మినీ ఫర్నీచర్ ను మెయింటైన్ చేయడం మంచిది. వాటి ఉపయోగం చాలానే ఉంటుంది.
అందులో మీకేవైతే ఉపయోగపడుతాయో వాటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి తెచ్చుకోవడం మంచిది. చిన్న టేబుల్, ఫోల్డిండ్ కుర్చీలు, ఐరన్ టేబుల్, టేబుల్ ల్యాప్, ఫ్యాన్ వంటివి తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.


బీన్ బ్యాగ్స్


ఇవి కుర్చోవడానికి సుతిమెత్తగా సౌకర్యవంతంగా ఉంటాయి. బీన్ బ్యాగ్స్ ఇంట్లో ఉండటం వల్ల ఒక కొత్త లుక్ వస్తుంది.ఇది ఆకర్షణ మాత్రమే కాదు సౌకర్యవంతం కూడా. అంతే కాకుండా వీటిని మీరు మీ ఇంట్లో ఎక్కడ కోరుకుంటే అక్కడ సౌకర్యవంతంగా అమర్చుకోవచ్చు.
 

మినీ బార్


వారాంతంలో లేదా బోర్ కొట్టినప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకొన్నప్పుడు మీకంటూ ఓ మినీ బార్ ను మెయింటైన్ చేయడం ఆహ్లాదపరుస్తుంది. మీకు ఆ సౌకర్యం లేకపోయినా మీరంతకు మీరు అమర్చుకోవచ్చు. అందు కోసం ఒక సర్వింగ్ కార్ట్ తెచ్చుకిన లివింగ్ రూమ్ లో అమర్చుకోవచ్చు. ఒక్కసారిగా కార్ట్ అమర్చిన తర్వాత అందులో మార్టిన్ షేకర్, కొన్ని మార్టిన్ గ్లాసెస్ మరియు కొన్ని చిన్న గ్లాసులు ఇలా అన్ని అమర్చుకొన్న తర్వాత మీకు కావలసిన మీ ఫేవరెట్స్ తో నింపేసుకోండి. మీకు తాగే అలవాటు లేకున్నా ఈ అరేంజ్ చేయడం వల్ల మీ కోసం వచ్చే అతిథులకు ఓ గొప్ప ఆతిథ్యం ఇస్తున్న ఫీలింగ్ వారిలో కలుగచేస్తుంది.
 

సంవత్సరం పొడవునా పూచే నందివర్ధనం...

నందివర్ధనం పూలను ఎక్కువగా దేవుని పూజకు వాడతారు. చెట్టు నుంచి కోసిన తర్వాత కూడా దాదాపుగా రోజంతా తాజాగా ఉంటాయి. ఇందులో ఐదు రెక్కల నందివర్ధనం, ముద్ద నందివర్ధనం అని రెండు రకాలు ఉంటాయి. రెక్కలు కూడా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి వర్షాకాలం, ఎండకాలం ఎక్కువ పూస్తాయి. శీతాకాలంలో తక్కువగా పూస్తాయి. కొత్త ఆవిష్కరణల్లో భాగంగా పువ్వు రంగులో మార్పు రాలేదు కానీ ఆకులు మాత్రం ఆకుపచ్చ, తెలుపురంగులు మిళితమై వస్తున్నాయి. ఈ మొక్కలు సాధారణంగా మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తు పెరుగుతాయి. తాజా ఆవిష్కరణల్లో వీటిని కుండీల్లో పెంచడానికి వీలుగా ఒకటిన్నర అడుగుల ఎత్తు మాత్రమే పెరిగేటట్లు చేస్తున్నారు. నందివర్ధనం పూలు సీజన్ లో లెక్కలేనన్ని పూస్తాయి. ఎక్కువ రోజలు పూస్తాయి. పూసిన పువ్వు కూడా మొక్కకు ఎక్కువ రోజులు ఉంటుంది.

How Grow Nandivardhanam At Home Garden
నూనె రాసినట్లుగా నిగనిగలాడే ఆకుల మధ్యనుంచి అయిదు రేకులతో నక్షత్రాల్లా విప్పారిన గరుడవర్ధనం పూవును చూస్తున్నా, ప్రసన్నతకు మరో పేరులా ధవళవర్ణంలో ముద్దగా మెరిసే నందివర్ధనాలను చూస్తున్నా మనసు పవిత్ర భావనతో, ప్రశాంతతో నిండిపోతుంది. నలుపుతెలుపుల సమ్మేళనమే, సమన్వయమే జీవితమనే గొప్ప సత్యాన్ని నందివర్ధనాలు మనకు చెబుతున్నట్లుంటుంది. అనాదిగా ఇంటి తోటలో పెంచుకునే ఈ మొక్కల శాస్ర్తియ నామం ఒకటే- టాబర్‌నేమాంటోనియా కొరొనేరియా! వీటిని కేప్ జాస్మిన్ అని కూడా అంటారు.
ఏడాది పొడవునా పూసే ఈ మొక్కలు ఒక మీటరునుంచి నాలుగుమీటర్ల ఎత్తువరకూ పెరుగుతాయి. ఈమధ్యకాలంలో బాల్కనీల్లో సైతం పెంచుకునేలా, కుండీలో పెంచుకోడానికి అనువుగా అర మీటరు లోపునే ఉండి 365 రోజులూ పూసే నందివర్ధనం రకాన్ని సైతం ఉత్పత్తిచేసారు. మామూల మొక్కలనైనా మరీ ఎత్తుగా పెరగకుండా అవసరమైన మేరకు ప్రూన్ చేయవచ్చు. ఈ మొక్కలను పశువులు, జంతువులు ముట్టుకోకపోవటం గొప్ప విశేషం. కొమ్మలను నాటడం ద్వారా వీటిని ప్రవర్ధనం చేస్తారు.
నందివర్ధనం కఫాన్ని, పైత్యాన్ని, మంటలను, రక్తదోషాలను, జ్వరాన్ని, వాంతిని, మగతను, విష ప్రభావాన్ని తగ్గిస్తుందని ఆయుర్వేద గ్రంథాలైన ధన్వంతరి నిఘంటువు, శాలిగ్రామ నిఘంటువులు పేర్కొన్నాయి. గృహ చికిత్సలు...
అప్పుడప్పుడు నందివర్ధనం చెట్టుకు ఆకులుకు తెగులు పట్టి ముడతలు పడుతుంటాయి. వర్షాకాలం మొదట్లో ఈ తెగులు మొదలవుతుంది. పురుగు ఆకులోని రసం పీల్చేస్తుంది. ఈ పురుగులను బొచ్చు పురుగులు అంటాం. బొచ్చు పురుగుకి రక్షణ కవచం. మనం పైన స్ప్రే చేసిన మందులు పురుగును చేరకుండా బొచ్చు అడ్డుకుంటుంది. పురుగు లేత దశలో అంటే రక్షణ కవచం ఏర్పడక ముందే జాగ్రత్త పడాలి. అప్పుడైతే ఏ సాధారణమైన పురుగుమందు చల్లినా పురుగు చనిపోతుంది. ఈ పురుగు పోవడానికి చల్లే మందులను నందివర్థనం మొక్క ఆకుల మీ దచల్లకూడదు, చెట్టు మొదట్లోచల్లాలి.

ఆరోగ్యానికి హాని కలిగించే బిగువైన జీన్స్!

పిరుదులు ఒత్తేస్తూ, తొడలు పిసికేస్తూ బిగువుగా, గట్టిగా వుండే జీన్స్ పేంట్లు ఆరోగ్యానికి మంచివి కావని అవి మీ నరాలను తోడేస్తాయని డాక్టర్లు చెపుతున్నారు. మెరాల్జియా పరేస్తటికా అనే స్ధితికి చిహ్నంగా చురుక్కు మనటం, తిమ్మిరెక్కటం వంటి లక్షణాలు కనపడతాయి. తొడకు ముందుభాగంలో వుండే ఒక నరం బాగా ఒత్తబడితే ఈ పరిస్ధితి ఏర్పడుతుంది. ఈ జీన్స్ గుడ్డలు, అంత త్వరగా ఫ్యాషన్ ప్రపంచంనుండి తొలగే లాగ లేవని యువత వాటిని బాగా ఆదరిస్తోందని, జీన్స్ దుస్తుల వ్యాపారం జోరని తయారీదారులు చెపుతున్నారు.
Tight Jeans May Jeopardize Health


అవి ఫ్యాషన్ ప్రపంచంలో వున్నంతకాలం తమ విక్రయాలు బాగానే వుంటాయని, అందుకనే వారు వాటిని అమ్ముతున్నట్లు విక్రయదారులు తెలిపినట్లు న్యూ యార్క్ డైలీ పేర్కొంది. నేటి యువతరంలో ఎన్నో చెడు అలవాట్లు చోటు చేసుకుంటున్నాయి వాటిలో ఆరోగ్యానికి హానికలిగించే జీన్స్ కూడా ఒకటి అంటున్నారు ధరించేవారు. హై హీల్స్ లేదా సిగరెట్ తాగటం చెడు అలవాట్లే. ఆరోగ్యానికి హాని కలిగించేవే, అదే రకంగా ఇపుడు వేసే జీన్స్ కూడాను అని సరిపెట్టేసుకుంటున్నారు.

అయితే, చర్మానికి అంటుకుపోయే జీన్స్ అయినప్పటికి అవి నరాలకు నష్టం కలిగించే వ్యాధులు కలిగించటం లేదని, బ్రూక్లీన్ లోని మెయిమోనైడ్స్ మెడికల్ సెంటర్ వాస్కులర్ సర్జరీ ఛీఫ్ డా. , డా. రాబర్ట్ రీ తెలిపారు. అయితే, ఏదో ఒక దశలో వారి కాళ్ళు ఇక లేవని తెలిశాక అపుడు అకస్మాత్తుగా తమ కామన్ సెన్స్ ఉపయోగించుతారని, కొద్దిపాటి పెద్ద సైజులకు మారటం మంచిదని ఆయన భావిస్తున్నట్లు తెలిపారు. అయినప్పటికి ఫ్యాషన్ కావాలనుకునేవారు వేరే దుస్తులను ఉపయోగించకపోయినప్పటికి సమస్యలు వచ్చే వరకు వీటిలోనే తమ రిలాక్సేషన్ పొందవచ్చన్నారు.

నేడు తాజాగా న్యూయార్క్ నగరం అంతా టైట్ జీన్స్ తో నిండిపోయింది. వారికి వేరే మార్గం సైతం కనపడకుండా వుంది. అంటూ ఒక సర్జన్ వ్యాఖ్యానించారు. ధరించే వారికి తిమ్మిర్లు ఎక్కటం, కాళ్ళు, పాదాల సమస్యలు లేకుంటే, ఈ ప్యాంట్లు నిరభ్యరంతరంగా వేసుకోవచ్చు. స్కిన్నీ జీన్స్ స్ధానంలో యాసిడ్ వాష్ అతి త్వరలో అధికంగా ఆక్రమిస్తోంది. జీన్స్ తో పోలిస్తే యాసిడ్ వాష్ మరింత సౌకర్యంట.

తాజా పరిశోధనలో పురుషులలో జీన్స్ పట్ల ఆసక్తి తగ్గినప్పటికి మహిళలలో జీన్స్ ధరించాలనే కోరిక బాగా కొనసాగుతోందట. పురుషులు వీటికి కొద్దిపాటి విశ్రాంతినిచ్చారని, కాని వాస్తవానికి ఈ స్కిన్నీ జీన్స్ అంత సౌకర్యం మరొకటి ప్రస్తుత దుస్తులలో లేదని ఆమె తెలిపారు. అయితే, అవి బిగువు అనే కారణంగానైనా కొంతమంది వాటిని పక్కన పెట్టటం మంచిదే అంటున్నారు ఆమె.